– స్టీల్ ప్లాంట్కు ఫౌండేషన్ కాదు… స్టీల్ సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం
– దేశ ఉక్కు అవసరాలు తీర్చేలా ఏపీ అభివృద్ధి సాధిస్తోంది
– ఉత్తరాంధ్రకు ఊపు తెచ్చే ప్రాజెక్ట్… రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టించే ప్రాజెక్ట్
– రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడి… 1 లక్షకుపైగా ఉద్యోగాలు
– రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు
– AM-NS ఇండియా ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అనకాపల్లి/పాయకరావు పేట: అనకాపల్లిలో జరిగిన శంకుస్థాపన స్టీల్ ప్లాంట్కు మాత్రమే కాదని… స్టీల్ సిటీ నిర్మాణం కోసమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీకి రావడం చాలా మంచి పరిణామమని.. అనకాపల్లి, ఉత్తరాంధ్ర ప్రాంతంతో పాటు రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు పెట్టడానికి ఈ స్టీల్ ప్లాంట్ ఉపకరిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు.
చంద్రబాబు నాయుడు అనే నేను చెబుతున్నా… పరిశ్రమలకు ఏపీనే బెస్ట్ ప్లేస్ అంటూ సీఎం ప్రకటించారు. సోమవారం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్కు శంకుస్థాపన ఘనంగా జరిగింది. కేంద్రమంత్రి హెచ్డి కుమార స్వామి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్ సంస్థకు చెందిన ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి శంకుపస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ…‘‘20 నెలల్లోనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటును శంకుస్థాపన చేసుకున్నాం. ఈ భారీ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షమంది యువతకు ఉద్యోగాలు వస్తాయి. ఈ ప్రాజెక్టు రావడానికి కృషి చేసిన ఆదిత్య మిట్టల్, మంత్రి నారా లోకేష్ను అభినందిస్తున్నా. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం భూమిని ఇచ్చిన రైతులందరికీ ధన్యవాదాలు.
రెండు దశల్లో నిర్మితమయ్యే ఈ ఉక్కు పరిశ్రమ ద్వారా 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది. రూ.1.35 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ సంస్థకు జాతీయ స్థాయిలోనే కాదు… ప్రపంచ వ్యాప్తంగా చాలా మంచి పేరుంది. ఇలాంటి సంస్థ ఏపీకి రావడం చాలా మంచి పరిణామం. అందుకే చెబుతున్నాను… ఇవాళ జరిగిన శంకుస్థాపన స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే కాదు… స్టీల్ సిటీకి జరిగిన శంకుస్థాపన.
ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు కూడా నిర్మాణం జరుగుతుంది. 2028 నాటికి ప్లాంట్లో మొదటి దశ ఉత్పత్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు. 2030 జూన్ నాటికి మొదటి బ్లాస్టర్ ఫర్సెన్, డిసెంబరు నాటికి రెండో బ్లాస్ట్ ఫర్నెస్ నిర్మాణం పూర్తి చేస్తారు. అలాగే జాతీయ రహదారిని అనుసంధానిస్తూ 4 లేన్ల రహదారి కూడా పూర్తి అవుతుంది. పరిశ్రమకు ముడి ఇనుము సరఫరా కోసం పైప్ లైన్ కూడా వేయబోతున్నారు. ఈ ప్లాంట్ కోసం పైప్ లైన్ వేయాలని ప్రధానిని కోరితే వెంటనే అంగీకరించారు. ఉక్కు ఉత్పత్తి ఒక్కటే కాదు ఆర్ధిక లావాదేవీలతో విద్య, వైద్యం, ఉద్యోగాలతో ఈ ప్రాంత రూపు రేఖలు మారతాయి” అని సీఎం చంద్రబాబు చెప్పారు.
అనుమతులు వేగంగా ఇస్తాం… అదే వేగంతో అభివృద్ధి చేయండి
“ఈ పరిశ్రమకు ఇంత వేగంగా భూసేకరణ, అనుమతులను ఒక్క ఏపీలోనే ఇచ్చాం. చంద్రబాబు అను నేను చెబుతున్నాను… దేశంలో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఆంధ్రప్రదేశ్. పారిశ్రామిక అనుకూల ప్రభుత్వం, రాష్ట్రం ఉంది. నిపుణులు, మానవ వనరులు ఏపీకి మాత్రమే సొంతం. టూరిజం నుంచి డేటా సెంటర్ వరకూ, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తయారీ రంగం వరకూ అన్నింటికీ ఏపీలో మెండైన అవకాశాలు ఉన్నాయి. కొత్త ఆలోచనలతో వచ్చి అవకాశాలను అందిపుచ్చుకోవాలి.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే నినాదాన్ని విజయవంతం చేస్తాం. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది. 15 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి రావటం దేశంలో ఇదే తొలిసారి. బీపీసీఎల్ సహా పెద్ద పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలల్లోనే రాష్ట్రానికి 20.35 లక్షల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. విశాఖ ఎకనామిక్ రీజియన్ నాలెడ్జి ఎకానమీ, పోర్టులు, స్టీల్, డేటా సెంటర్లు, ఐటీ సెంటర్లు ఇలా కీలకమైన కేంద్రంగా విశాఖ మారుతోంది. టీసీఎస్, కాగ్నిజెంట్, రిలయన్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు పెట్టుబడి పెడుతున్నాయి.
రేర్ ఎర్త్ మినరల్ హబ్గా ఉత్తరాంధ్ర మారుతుంది. పరిశ్రమలకు అవసరమైన నీటిని పోలవరం ద్వారా అందిస్తాం. కొత్తగా పోర్టులు, ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు, జూలైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభిస్తాం. ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ ప్రాజెక్టుగా భావించి వేగంగా నిర్మాణం పూర్తి చేసుకునేందుకు సహకారం ఇస్తాం. ఈ పరిశ్రమ నిర్మాణంలో రైతులు తమ భూములను త్యాగం చేశారు.
వారికి సహకారం అందించాలి. ఉక్కు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి, సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ను ఏర్పాటు చేస్తున్నందుకు ధన్యవాదాలు. మొదటిగా అనకాపల్లి జిల్లా యువతకు ఈ పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలి. ఆవిష్కరణల కోసం మెటలర్జీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేస్తున్నందుకు అభినందనలు” అని ముఖ్యమంత్రి అన్నారు.
అభివృద్ధి చేస్తామని చెప్పాం… చేసి చూపిస్తున్నాం
“ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వ సహకారం వల్లే ఈ ప్రాజెక్టు సాకారమైంది. రాష్ట్రంపై ప్రధాని చూపిస్తున్న అభిమానానికి ఈ వేదిక పైనుంచి మరోసారి కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రధాని మోదీ చెప్పిన Chip to Ship తయారీ విధానానికి ఏపీ తిరుగులేని వేదిక. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలతో నేడు ఈ పరిశ్రమ రాష్ట్రానికి వచ్చింది. డబుల్ ఇంజన్ సర్కార్ విజయం ఇది. రాష్ట్రాన్ని పునర్ నిర్మాణం చేస్తామని… నేను, పవన్ కళ్యాణ్ చెప్పాం. అభివృద్ధి-సంక్షేమం-సుపరిపాలన చేసి చూపిస్తున్నాం. ఏ పని తలపెట్టినా సంపూర్ణ మద్దతు ఇస్తున్న పవన్ కళ్యాణ్ను అభినందిస్తున్నా. మంత్రి లోకేష్ పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.”అని సీఎం చెప్పారు.
నైపుణ్యాభివృద్ధి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఒప్పందం
యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పన, సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో రెండు వేర్వేరు ఒప్పందాలను ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్ సంస్థ చేసుకున్నాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు నైపుణ్యాలు కల్పించేలా ఒక ఒప్పందం, ఆధునిక ఉత్పత్తి సామర్ధ్యాలపై సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఏర్పాటుకు మరో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అత్యాధునిక మెటలర్జికల్ ఇనిస్టిట్యూట్ ద్వారా యువతకు మెరుగైన నైపుణ్యం, తయారీ సామర్ధ్యాలను కల్పిస్తామని ఆర్సెలార్ మిట్టల్ -నిప్పన్ స్టీల్ ఇండియా చైర్మన్ ఆదిత్య మిట్టల్ ప్రకటించారు.
ఎక్స్ పీరియన్స్ జోన్ సందర్శన
శంకుస్థాపన కార్యక్రమానికి ముందు అదే ప్రాగంణంలో ఏర్పాటు చేసిన ఎక్స్ పీరియన్స్ జోన్ను ముఖ్యమంత్రి సందర్శించారు. సీఎంతోపాటు కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, స్థానిక ప్రజా ప్రతినిధులు ఎక్స్ పీరియన్స్ జోన్ ను సందర్శించారు. AM-NS ఇండియా ప్లాంట్ కు సంబంధించిన వివరాలు, ఉక్కు రంగంలో AM-NS ఇండియా సంస్థ ప్రగతి వంటి అంశాలపై ప్రదర్శించిన వీడియోలను తిలకించారు.
దశల వారీగా ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ మీనియేచర్ ను సీఎం, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎం, మంత్రులు తిలకించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, టీజీ భరత్, అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ సీఎం రమేష్, అనకాపల్లి జిల్లా ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆర్సెలార్ మిట్టర్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, ఆర్సెలార్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్, నిప్పన్ స్టీల్ ప్రతినిధులు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.