– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
ఇబ్రహీంపట్నం : కార్మికుల సంక్షేమమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, తన కుటుంబ సభ్యుల మాదిరిగా కార్మికుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారన్నారు.
తెలుగునాడు విద్యుత్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన మే డే ఉత్సవాల్లో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. సంపద సృష్టికి మూలమైన కార్మికుల క్షేమం, సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పరిశ్రమల్లో పనిచేసే కార్మికుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.
ఇబ్రహీంపట్నం థర్మల్ విద్యుత్ ప్లాంట్ (వీటీపీఎస్) కాలుష్యం నియంత్రణతో పాటు ప్లాంట్ నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలను తగ్గించడానికి రూ.600 కోట్లతో ప్రణాళికలు రూపొందించామన్నారు. వీటీపీఎస్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కూడా కృషిచేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
కార్మికుల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో కలిసి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టి తీసుకెళ్తామన్నారు. గతంలో ఇదే పరిశ్రమలో నాలుగు వేల మందికిపైగా కార్మికులను రెగ్యులరైజ్ చేసిన ఘనత సీఎం చంద్రబాబునాయుడిదేనన్నారు. కార్మికుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సీఎం చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు.