Suryaa.co.in

Andhra Pradesh

పేదలను వెతుక్కుంటూ సంక్షేమ పథకాలు

– కులం, మతం, పార్టీ చూడ్డం లేదు
– దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా
– చిరునవ్వుతో ఇంటిదగ్గరే పించన్‌
– అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమపథకాలు అందనివారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి అర్హులైన వారికి సంక్షేమపథకాలు అందజేసే కార్యక్రమానికి క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి నగదు జమ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.
ఇవాళ 9,30,809 మందికి రూ.703 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైయస్‌.జగన్‌

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే…:
ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో శ్రీకారం చుడుతున్నాం. 9,30,809 మందికి మంచి జరుపుతూ దాదాపు రూ.703 కోట్లు నేడు నేరుగా బటన్‌ నొక్కి వారిఖాతాల్లోకి జమ చేస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమం దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో చేయగలుగుతున్నాం. మనందరికీ గుర్తుంది… గతంలో సంక్షేమపథకాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది. ఈరోజు సంక్షేమపథకాలే పేదలను వెదుక్కుంటూ వారి ఇంటి దగ్గరకి వచ్చి తలుపు తట్టి మరీ అందజేసే కార్యక్రమం మనందరి ప్రభుత్వంలో జరుగుతుంది. ఇది గొప్ప మార్పుకి శ్రీకారం.

ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.. ఈ పథకాల అమలు చేసేటప్పుడు ఎక్కడ కూడా మనం కులం, మతం, ప్రాంతం చూడలేదు. చివరకి రాజకీయాలు, పార్టీలు ఇవేవీ పట్టించుకోలేదు. అర్హత ఉంటే చాలు సంక్షేమపథకాలు అందరికీ దక్కుతాయి అనే సంకేతాలు ఇచ్చేట్టు ప్రతి అడుగు వేశాం. ఇంకా ఎక్కడైనా అర్హులై ఉండి కూడా దరఖాస్తు చేసుకోకపోవడమో, అర్హత నిర్ధారణలో జరిగిన పొరపాట్లు వలనో, నిర్ణీత గడువు లోగా దరఖాస్తు చేసుకోకపోవడం వల్లో, బ్యాంకు అకౌంట్లు సరిగా లేకపోవడమో… ఇలా కారణాలేవైనా కూడా… అర్హులందరికీ సంక్షేమపథకాలు అందకపోతే అటువంటి వారు ఎవరైనా కూడా మిస్‌ కాకూడదని.. వారికి కూడా న్యాయం చేసేందుకు ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇదొక గొప్ప విప్లవాత్మక మార్పు.

గతంలో ప్రభుత్వాలు ఎలా కత్తిరించాలని చూసేవి. ఈరోజు అర్హత ఉన్నవారెవరూ మిగిలిపోకూడదు.. పొరపాటున ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా మంచి ఎలా చేయాలి అన్న ఆరాటం, తపన, తాపత్రయం ప్రభుత్వంలో కనిపిస్తోంది. దేశచరిత్రలోనే ఎక్కడా, ఎప్పుడూ జరగని విధంగా, కనీవినీ ఎరుగని రీతిలో అర్హులై ఉండి కూడా పొరపాటున సంక్షేమకార్యక్రమాల ఫలితాలను అందుకోలేకపోయిన పేదలకు మరో అవకాశం ఇచ్చి, వారికి కూడా పథకం అయిపోయిన నెలరోజుల లోపు దరఖాస్తు పెట్టుకోమని చెప్పి, దాన్ని కూడా పరిశీలించి వారికి కూడా రావాల్సిన లబ్ధిని అందిస్తున్నాం.

మన ప్రభుత్వం వచ్చాక పథకాల తీరు
పెన్షన్లు తీసుకున్నా, రేషన్‌ కార్డులు తీసుకున్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలు చేస్తున్న పథకాల లబ్దిదారులను చూస్తే.. గత ప్రభుత్వం కంటే లబ్ధిదారుల సంఖ్యలో, ఇస్తున్న డబ్బుల్లో కానీ విపరీతమైన మార్పు, తేడా ఉంది. విప్లవాత్మకంగా ఈ మార్పుకు శ్రీకారం చుట్టాం.

ఉదాహరణకు టీడీపీ హయాంలో అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగుల కోసం ఇచ్చే పించన్లు చూస్తే… ఎన్నికలకు రెండు నెలలు ముందు వరకు వీళ్లకు కేవలం రూ.1000 మాత్రమే ఇచ్చారు. అది కూడా ఎన్నికలకు ఆరునెలలు ముందు వరకు కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చేవాళ్లు. నెలకు వాళ్లిచ్చిన ఫించన్‌ మొత్తం కేవలం రూ. 400కోట్లు.

నేడు 69 లక్షల పించన్లు
గతంలో ఉన్న 39 లక్షల పించన్లు కాస్తా…ఈరోజు మన హయాంలో చూస్తే 69 లక్షలకు చేరాయి. ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు రూ.1000 ఉన్న పించన్‌ను, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2250 చేయడంతో ఏకంగా ఇవాళ నెలకు రూ.1450 కోట్లు ఒక్క పించన్లు పథకంపై మాత్రమే మన ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.

అది కూడా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదు, ఏ ఒక్కరి ఆత్మాభిమానం కూడా దెబ్బతినకూడదని ఏకంగా వాలంటీరే ఇంటికొచ్చి.. వేకువనే తలుపుతట్టి గుడ్‌మార్నింగ్‌ చెప్పి, చిరునవ్వుతో చేతిలో డబ్బులు పెట్టి వెళ్లిపోతున్నారు. ఇంత గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టడం జరిగిందన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న 1వ తేదీ నుంచి రూ. 2250 కాస్తా.. రూ.2500 అవుతుంది.

గతంలో గిట్టని వారికి ఎగ్గొట్టారు
గత ప్రభుత్వంలో తమకు గిట్టని వారికి పథకాలు ఎగ్గొట్టేందుకు, లంచాలు గుంజేందుకు జన్మభూమి కమిటీలు పెడితే… మనందరి ప్రభుత్వం మనకు ఓటు వేయని వారికి కూడా వారు పేదలైతే చాలు, వారు పథకాలకు అర్హులైతే చాలు గుర్తించి ఇంటింటికీ వెళ్ళి వెరిఫై చేసి ఇవ్వడానికి వీలుగా వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్ధను గ్రామంలోనే ఏర్పాటు చేశాం. సోషల్‌ ఆడిట్‌ ద్వారా అర్హుల జాబితా కూడా ప్రదర్శించి వీరందరికీ న్యాయం చేస్తున్నాం.

గత ప్రభుత్వంలో సంక్షేమపథకాల లబ్ధి కోసం ఆత్మాభిమానం కూడా చంపుకుని వృద్ధులు,వికలాంగులు, అక్కచెల్లెమ్మలు కాళ్లరిగేలా జన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఈ రోజుకి ఆరోజుకు ఎంత తేడా ఉందో గమనించమని అడుగుతున్నాను.

ఈ రోజు వివక్షకు తావులేకుండా
ఈ రోజు వివక్ష లేదు, లంచాలకు తావులేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుంది. ఈ కోవిడ్‌ సమయంలో ప్రభుత్వ రాబడి తగ్గినప్పటికీ కూడా ప్రభుత్వం చేయాల్సిన ఖర్చు పెరిగినప్పటికీ పేదలకు అండదండలకు అందించాల్సిన విషయంలో మన ప్రభుత్వం మానవత్వమే చూపింది.
ఈ 31 నెలల పాలన తర్వాత కూడా మరో 9,30,809 మంది లబ్ధిదారులకు మేలు చేస్తూ.. దాదాపు రూ.703 కోట్లు వారి ఖాతాల్లోకి.. ఎవరైతే సమయానికి దరఖాస్తు చేయలేకపోవడంతో పాటు రకరకాల కారణాల వల్ల అందలేదో వారందరికీ జమ చేస్తున్నాం.

పేదలపై మమకారంతో చేస్తున్నాం
పేదల మీద మమకారం, బాధ్యతతో ఈ డబ్బు వారికి జమ చేస్తున్నాం. స్కీంలు ఎలా ఎగ్గొట్టాలి, పేదలను ఎలా ఎండగట్టాలి, డబ్బులు ఎలా మిగల్చుకోవాలి అన్నది గత ప్రభుత్వ విధానం అయితే, వారిలో ఏ ఒక్కరికీ కూడా అన్యాయం జరగకుండా ఎలా ఇవ్వాలి అన్నది మన ప్రభుత్వ విధానం. దానికి ఉదాహరణగానే ఈరోజు మనం చేస్తున్న సహాయం, న్యాయం.

ఈ 9.30 లక్షల మంది లబ్ధిదారులు ఏయే కేటగిరీలలో ఉన్నారో చూస్తే…
వైయస్సార్‌ రైతు భరోసా– 2021 రెండో విడత కింద 2,86,059 మందికి రూ.58 కోట్ల 89 లక్షలు జమ చేస్తున్నాం. ఇప్పటివరకు 52.38 లక్షల రైతు కుటుంబాలకు రైతు భరోసాగా అందించినది రూ.17,030 కోట్లు, వీరికి.. ఈ కొత్త లబ్ధిదారులకు మనం చేస్తున్నది అదనంగా యాడ్‌ అవుతుంది.

వైయస్సార్ చేయూత
వైయస్సార్‌ చేయూత పథకంలో మరో 2,50,929 మంది లబ్ధిదారులకు రూ.470.49 కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం.
ఈ 45 –60 సంవత్సరాల మధ్య వయస్సున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రెండేళ్లలో అందించినది రూ.8,944 కోట్లు. వీరికి ఈ 2,50,929 మంది కొత్త లబ్ధిదార్లు అదనం.

వైయస్సార్ సున్నావడ్డీ
అదే విధంగా రైతులకు వైయస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల వర్తింపులో భాగంగా, 2019–20 రబీకి సంబంధించిన మరో 62,622 మంది లబ్ధిదారులకు రూ.9 కోట్ల 1 లక్ష జమ చేస్తున్నాం. అంతేకాకుండా 2020 ఖరీప్‌కు సంబంధించి మరో 58,821 మందికి రూ.10 కోట్ల 6 లక్షలు జమ చేస్తున్నాం.
గత 30 నెలల్లో సున్నా వడ్డీ పంట రుణాలు గత ప్రభుత్వపు బకాయిలతో కలుపుకుని అందుకున్న రైతులు 58.97 లక్షల మంది అయితే.. వీరికి అందిన లబ్ధి రూ.1106 కోట్లు. ఇప్పుడు అందిస్తున్నది అదనం.
పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వైయస్సార్‌ సున్నా వడ్డీ పథకం వర్తింపజేస్తూ.. మరో 59,661 మంది లబ్ధిదారులకు రూ.53 కోట్ల 51 లక్షలు జమ చేస్తున్నాం.గత 30 నెలల కాలంలో 98 లక్షలకు పైగా అక్కచెల్లెమ్మలకు, రూ.2,354 కోట్లు వైయస్సార్‌ సున్నావడ్డీగా అందించాం. ఇప్పుడు దాదాపు మరో 60 వేల అక్కచెల్లెమ్మలకు అందిస్తున్నది ఆ మొత్తానికి అదనం.

జగనన్న వసతి దీవెన
జగనన్న వసతి దీవెన పథకంలో మరో 43 వేల 10 మంది విద్యార్ధులకు రూ.39.82 కోట్లు జమ చేస్తున్నాం. గత 30 నెలల కాలంలో 18.78 లక్షల విద్యార్ధులకు 16.80 లక్షల మంది వారి తల్లులకు అందించింది రూ.2267 కోట్లు. ఇప్పుడు మరో 43 వేల మంది విద్యార్ధులకు అదనంగా సాయం అందుతోంది.

జగనన్న విద్యాదీవెన
జగనన్న విద్యాదీవెన పథకం అందుకోకుండా మిగిలిపోయిన మరో 31,940 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.19 కోట్ల 92 లక్షలు జమ చేస్తున్నాం.
గత 30 నెలల్లో 21.55 లక్షల విద్యార్ధులకు సంబంధించి 19.2 లక్షల మంది వారి తల్లులకు రూ.6,258 కోట్లు అందించాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు సైతం మనమే చిరునవ్వుతో స్వీకరించి ఇచ్చాం. ఇప్పుడు మరో 32 వేల మంది విద్యార్ధులకు విద్యా దీవెన ద్వారా సహాయం అందిస్తున్నాం.
వైయస్సార్‌ కాపు నేస్తం పథకంలో మరో 12,983 మందికి రూ.19.47 కోట్లు జమ చేస్తున్నాం. గత 30 నెలలుగా 3.27 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు అందించినది రూ.982 కోట్లు కాగా.. ఇప్పుడు మరో 13 వేల మందికి సుమారు మరో రూ. 20 కోట్లు వరకు అదనంగా అందిస్తున్నాం.
వైయస్సార్‌ వాహవమిత్ర పథకంలో మిగిలిపోయిన 8,080 మంది లబ్ధిదారులకు రూ. 8.8 కోట్లు జమ చేస్తున్నాం. గత 30 నెలల కాలంలో 2.74 లక్షల మందికి రూ.762 కోట్లు వాహనమిత్ర ద్వారా మంచి చేశాం. దీనికి అదనంగా ఇవాళ ఇస్తున్నది యాడ్‌ అవుతుంది.

వైయస్సార్ మత్స్యకారభరోసా
వైయస్సార్‌ మత్స్యకార భరోసా కింద 3,788 మందికి రూ.3 కోట్ల 79 లక్షలు ఇప్పుడు అదనంగా జమ చేస్తున్నాం.
గత 30 నెలల్లో 1.20 లక్షల మందికి రూ.332 కోట్లు అందిస్తే… ఇప్పుడు అందిస్తున్నది దానికి అదనం.
వైయస్సార్‌ఆసరా పథకంలో మరో 1,136 మందికి రూ.7 కోట్ల 67 లక్షలు జమ చేస్తున్నాం. గత 30 నెలల కాలంలో 78.76 లక్షల అక్కచెల్లెమ్మలకు రూ.12,750 కోట్లు అందిస్తే… ఇప్పుడు ఇస్తున్నది అందుకు అదనం.
వైయస్సార్‌ నేతన్న నేస్తం పథకంలో మిగిలిపోయిన మరో 794 మంది లబ్ధిదారులకు రూ.1 కోటి 91 లక్షలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం.
గత 30 నెలల్లో 82 వేల లబ్దిదార్లకు రూ.576 కోట్లు అందిస్తే..ఇప్పుడు అందిస్తున్నది అదనం.

90 రోజుల్లో ఇళ్లపట్టాలు
90 రోజుల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మరో 1,10,986 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తున్నాం. గతంలో ఇచ్చిన 31 లక్షల ఇళ్లపట్టాలకు అదనంగా ఇది జరుగుతుంది.
వీటన్నింటితో పాటు అర్హులైన మరో 1,51,562 మందికి పెన్షన్‌ కార్డులు అందజేస్తున్నాం. దీంతో రాష్ట్రంలో పెన్షన్‌ కార్డులు ఉన్న వారి సంఖ్య 61,74,593కు చేరింది.
అదే విధంగా 3,249 మందికి ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అందజేస్తున్నాం. దీనితో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారి సంఖ్య 1,40,45,491 కు చేరింది.
ఇక ప్రతి సంవత్సరం జూన్, డిసెంబరులో అంటే ఏడాదికి రెండు దఫాలు సంక్షేమపథకాలుఅందుకోలేని లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వారందరికీ మంచి జరుగుతుంది. డిసెంబరు నుంచి మే వరకు అమలైన సంక్షేమపథకాల్లో అర్హత ఉండి లబ్ధిపొందని వారికి జూన్‌లోనూ, జూన్‌ నుంచి నవంబరు వరకు అర్హత ఉండి లబ్ది పొందని వారికి డిసెంబరులోనూ సంక్షేమపథకాల లబ్ధిని పూర్తిగా అందజేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
ఇది కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యంత పారదర్శకంగా సోషల్‌ ఆడిట్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏకంగా జాబితా ప్రదర్శించి అర్హులైన ప్రతి ఒక్కరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. ఎటుంటి వివక్షకు, లంచాలకు తావులేకుండా జరుగుతుంది.

ఇంకా మంచి చేయాలని ఆకాంక్షిస్తూ..
ఈ రోజు ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుడి దయతో మీ అందరి చల్లనీ దీవెనలతో రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ… ఈ రోజు లబ్ధిదారులకు మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ..ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు.

అనంతరం అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమపథకాలు అందనివారికి మరోసారి వెరిఫికేషన్‌ చేసి అర్హులైన వారికి సంక్షేమపథకాలు అందజేసే కార్యక్రమానికి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ నగదు జమ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి(రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి అనంతరాము, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి కె సునీత, గ్రామ, వార్డు సచివాలయాల కమిషనర్‌ షన్‌ మోహన్, మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు, మెప్మా ఎండీ విజయలక్ష్మి, స్త్రీనిధి ఎండీ నాంచారయ్య ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

LEAVE A RESPONSE