Suryaa.co.in

Andhra Pradesh

భూహక్కులపై.. వందేళ్ల చరిత్రగతిని మార్చిన సీఎం జగన్‌

– పేదలపక్షాన ఆయనకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు.
– మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ.
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదలకు విలువైన ఆస్తినిచ్చిన సీఎం
– అసైన్డ్‌, చుక్కలు,లంకభూముల సాగుదార్లకు హక్కు పత్రాలు
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేదవర్గాల ప్రయోజనాలే లక్ష్యంగా సంస్కరణలు
– ఇలాంటి మేలు గతంలో ఏనాడైనా చూశారా..?
– 14 ఏళ్ళు సీఎం గా పనిచేసిన చంద్రబాబు ఎందుకు మేలు చేయలేదు?
-ః మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌

పేదలపక్షాన సీఎంకు ధన్యవాదాలు
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. జగన్ మోహన్ రెడ్డిగడిచిన 53 నెలల పరిపాలన చరిత్రాత్మకం. ఇంతటి అభివృద్ధి, సంక్షేమం జరిగి పేదలకు అండగా ఉన్న చరిత్ర గత ప్రభుత్వాల్లో ఎన్నడూ జరగలేదు. ఈ విషయంపై రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ కి పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

భూహక్కులపై వందేళ్ల చరిత్రను మార్చిన జగన్‌
స్వాతంత్య్రం వచ్చాక భూములు పంపిణీ చేయడం, వాటిపై హక్కులు కల్పించడమనేది చాలా పెద్ద కార్యక్రమం. అది వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం చేపట్టడం ద్వారా పేదలకు పెద్దఎత్తున మేలు జరిగింది. గత వందేళ్లుగా సక్రమమైన రీతిలో భూసర్వే జరగకపోవడం వలన లక్షలాది ఎకరాలు అసైన్డ్‌భూములుగానే ఉండి.. లబ్ధిదారులకు వాటిపై హక్కుల్లేకుండా ఉన్న పరిస్థితిని మనం చూశాం. గతంలో సర్వేవ్యవస్థ కూడా అస్తవ్యస్థంగా ఉన్నందున రైతులు, రైతుకూలీలు కూడా చాలా నష్టపోయారు. గ్రామాల్లో అనేక వివాదాలకూ భూసమస్యలే ప్రధాన కారణంగా అందరం చూశాం.

బ్రిటీషు ప్రభుత్వంలో ఆనాడు సర్వే సెటిల్‌మెంట్‌ జరగడమే గానీ.. మనకు స్వాతంత్య్రం వచ్చాక ఎవరూ ఏ ప్రభుత్వం దానిజోలికి వెళ్లలేదు. అయితే, ఎవరూ చేయలేని ధైర్యం చేసి వందేళ్ల చరిత్రను గౌరవ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు మార్చారు. మూడంచెల సర్వేతో భూముల వివరాలు, లబ్ధిదారులతో సహా కొలిక్కితెచ్చి వాటిపై వారికి సర్వ హక్కులు కల్పించడమనేది ఒక చరిత్రగా చెప్పుకోవచ్చు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని సాహసానికి జగన్‌ గారు శ్రీకారం చుట్టారు. తద్వారా లక్షలాది ఎకరాల భూములపై హక్కులు పొందిన పేదలకు భారీస్థాయిలో మేలు జరిగింది. దీనిద్వారా లబ్ధి పొందిన మెజార్టీ ప్రజలు బడుగు, బలహీనవర్గాలవారే.

42,60,000 ఎకరాల్లో భూసర్వేను పూర్తి
రాష్ట్రంలోని మొత్తం 17,460 రెవెన్యూ గ్రామాలకు గాను మొదటి రెండు దశల్లో 4000 రెవెన్యూ గ్రామాల్లో భూ సర్వే కార్యక్రమం విజయవంతమైంది. వందేళ భారతదేశ చరిత్రలో ఇదొక రికార్డుగా చెప్పాలి. ప్రస్తుతం మూడోవిడత భూసర్వే మొదలుపెట్టబోతున్నారు. మొదటి దశలో 18 లక్షల ఎకరాలు, రెండో దశలో 24 లక్షల ఎకరాలతో మొత్తం 42,60,000 ఎకరాల్లో భూసర్వేను పూర్తిచేశారు. వీటిల్లో మొదటి దశలో 7.8 లక్షల ఎకరాలు, రెండోదశలో 9.73 లక్షల ఎకరాలకు భూహక్కు పత్రాలను రైతులకు అందజేయడం జరిగింది. జాయింట్‌ కలెక్టర్‌లు, రెవెన్యూ అధికారులు, తహశీల్దార్లు , సర్వే సెటిల్‌మెంట్‌ అధికారులు కూర్చొని వేలాది ఎకరాల భూమి సరిహద్దు తగాదాలకు పరిష్కారం చూపారు. దీనివల్ల కోర్టుల్లో పెండింగ్‌ ఉన్న వేలాది కేసులు కూడా తగ్గిపోతాయి. తద్వారా ప్రజలు భూవివాదాల నుంచి బయటపడతారని తెలియజేస్తున్నాం.

సచివాలయాల్లోనే భూ రిజిస్ట్రేషన్ల సదుపాయం
భూములపై హక్కులు రావడంతో ఆయా భూముల విలువలు కూడా పెరుగుతుంటాయి. ఇంతకుముందు మనం భూముల రిజిస్ట్రేషన్‌కు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. బ్రోకర్లును ఆశ్రయించి డాక్యుమెంట్‌ రైటర్లతో గంటలపాటు పడిగాపులు పడే పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు అలాంటి వాతావరణాన్ని పూర్తిగా మార్పు చేశారు. ఉన్న ఊరిలోనే గ్రామ సచివాలయాల దగ్గరనే భూముల రిజిస్ట్రేషన్‌ అవకాశం కల్పించడం జరిగింది. దీనివల్ల రైతులకు చాలా వరకు లాభం కలుగుతుంది.

టీడీపీ హయాంలో అసైన్డ్‌ దారుల పొట్టకొట్టారు
పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పొందిన అసైన్డ్‌భూములపై ఇన్నాళ్లూ ఎలాంటి హక్కుల్లేకుండా ఉండేవారు. ఆపదలో ఒక విలువైన ఆస్తి లేకుండా.. దిక్కుతోచని పరిస్థితులు అమ్ముకోలేని పరిస్థితి ఉండేది. అసైన్డ్‌ భూములున్నప్పటికీ.. వాటిపై హక్కులు లేకపోవడంతో ఎవరూ వాటిని కొనుగోలు చేయడానికి ముందుకొచ్చే పరిస్థితి ఉండేదికాదు. ఇదే కారణంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. ఎందుకంటే, రాజధానికి భూసమీకరణలో ప్రైవేటు పట్టాలకు ఒక ధర, ప్రభుత్వ బంజరు, అసైన్డ్‌భూములు కలిగి ఉన్న వారికి మరొక ధర ఇచ్చారు. దీంతో భూములపై ఎలాంటి హక్కుల్లేని అసైన్డ్‌పట్టాదారులైన బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులు నష్టపోయారు.

అయితే, జగన్‌ మంచి హృదయం కారణంగా 20 ఏళ్లు దాటి అనుభవంలో ఉన్న అసైన్డ్‌భూముల పట్టాదారులకు ఈ ప్రభుత్వం పూర్తి హక్కులు కల్పించింది. ప్రైవేటు పట్టాదారు భూముల్లాగానే అసైన్డ్‌భూముల్ని రెగ్యులర్‌ చేసింది. తద్వారా అసైన్డ్‌దారుల గౌరవం సమాజంలో పెరిగింది. పట్టణాల్లోనైతే ఇప్పుడు అసైన్డ్‌భూములపై హక్కులు రావడంతో భూముల విలువ రూ.కోట్లకు పెరిగింది కనుక హక్కులు పొందిన రైతులకు భారీస్థాయిలో లాభం చేకూరింది. భూపరిపాలనా రికార్డుల చరిత్రలో ఇదొక విప్లవాత్మక అడుగుగా చెప్పాలి. ఇంతటి ఘనతకు కారణమైన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కి పేద, మధ్యతరగతి వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా రుణపడి ఉంటారు.

22.42 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై హక్కులు
20 ఏళ్లకుపైగా అసైన్డ్‌ భూములు లబ్ధిదారులైన పేదలకు ఆ భూములపై సర్వ హక్కులూ కల్పిస్తూ.. 22.42 లక్షల ఎకరాలకు సంపూర్ణ భూహక్కులు కల్పించగా, దీని వల్ల 15.21 లక్షల మంది పేద రైతన్నలకు మంచి జరుగుతోంది.

22 (ఏ) నుంచి తొలగించి చుక్కల భూములకు పరిష్కారం
గతంలో వివరాలు సరిగ్గాలేని సర్వేనెంబర్ల భూములకు రికార్డుల్లో రెడ్ చుక్కలు మాత్రమే పెట్టి ఉండేవి. అంటే, ఆయా భూముల యజమానుల పేర్లు రికార్డుల్లో ఉండేవి కావు కనుక నిజమైన హక్కుదారులు తమ వద్దనున్న ఆధారపత్రాల్ని పట్టుకుని ప్రభుత్వ అధికారుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరుగుతుండే వారు. కొన్ని వేల వివాదాలు చుక్కల భూముల చుట్టూ తిరుగుతుండేవి. అలాంటిది, జగన్‌ పుణ్యాన చేపట్టిన భూసర్వే సెటిల్‌మెంట్‌తో చుక్కల భూములకూ పరిష్కారం చూపి.. వాటిని 22 (ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగించి రైతులకు లబ్ధికలిగించారు.

22,387 ఎకరాల ఎస్సీ కార్పొరేషన్‌ భూములకూ స్వేచ్ఛ
ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా భూమికొనుగోలు పథకంతో అర్హులైన ఎస్సీలకు ప్రభుత్వం భూములు పంపిణీ చేసేది. కానీ, వాటిపై లబ్ధిదారులకు ఎలాంటి హక్కులూ ఉండేవి కాదు. కార్పొరేషన్‌కు చెందిన ఆస్తిగా, బ్యాంకు ఆధీనంలో ఉండేవి. అయితే, జగన్‌ గారు నా ఎస్సీ, నా ఎస్టీ రైతుల చేతుల్లో విలువైన ఆస్తి ఉండాలనే మంచి ఆలోచన చేశారు. కార్పొరేషన్‌ల ద్వారా పంపిణీ చేసిన 22,387 ఎకరాల భూములకు విడుదల కల్పించి 22,346 మంది దళిత లబ్ధిదారులకు పట్టాలిచ్చి హక్కులు కల్పించారు. కార్పొరేషన్‌ రుణాలన్నీ జగన్‌ చెల్లించి.. ఇకనుంచి అవి ఎస్సీ రైతుల సొంత ఆస్తుల్లాగానే ప్రభుత్వం స్వేచ్ఛను కల్పించింది.

3,26,980 ఎకరాల గిరిజన భూములపై హక్కులు
అదేవిధంగా రిజర్వుఫారెస్ట్‌ (ఆర్వోఎఫ్‌ఆర్‌) భూముల్ని అనాదిగా సాగుచేసుకుంటున్న గిరిజన రైతులకూ వాటిపై హక్కులు కల్పించి.. విలువైన ఆస్తిని అందజేశారు. రాష్ట్రంలో 1,56,655 గిరిజన కుటుంబాలకు 3,26,980 ఎకరాలకు ఆర్వోఆర్‌ పట్టాలిచ్చి వారికి హక్కులు కల్పించారు. గతంలో గిరిజన రైతులు తాము సాగుచేసే భూములపై బ్యాంకు రుణాలు తీసుకునే వీలుండేది కాదు. పంటరుణాలు, సబ్సిడీలు ఏమీ అందేవి కావు. అలాంటిది, ఈరోజు జగన్‌ గారి పుణ్యామాఅని గిరిజనులు సాగు చేసుకుంటున్న అటవీభూములపై హక్కులొచ్చాయి. ఇలాంటి హక్కుల కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు, హింసాయుత ఘటనలూ జరిగాయి. వాటన్నింటికీ ముగింపు పలికిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కే దక్కుతోంది.

లంకభూముల రైతులనూ ఆదుకున్నారు
లంకభూములను దశాబ్దాలుగా సాగుచేసుకుంటున్న రైతులకూ జగన్‌ గారి ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పించింది. ఏ,బీ, సీ కేటగిరిలుగా లంక భూముల్ని విభజించి ఏ,బీ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు ప్రభుత్వం డీకే పట్టాలిచ్చింది. సీ కేటగిరి లంకభూము సాగుదారులకు లీజు పట్టాల్ని పంపిణీ చేసింది. ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లా రైతులకు వీటిల్లో లబ్ధికలిగింది. సుమారు 9,064 ఎకరాల లంకభూములు సాగుచేస్తున్న 17,768 కుటుంబాలకు మేలును అందజేయగలిగారు. అదేవిధంగా ఈనాం భూములకూ విముక్తి కల్పించి, వాటి అనుభవసాగు రైతులకూ హక్కులు కల్పించారు. దీంతో రైతులంతా ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలతో చాలా సంతోషంగా ఉన్నారు.

30.65 లక్షల మందికి ఇళ్లస్థలాల అందజేత
ఇక, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయానికొస్తే.. ఈ ప్రభుత్వం రాష్ట్రంలో 17,005 లే అవుట్‌లు వేసి 30,65,315 మంది అక్కచెల్లెమ్మల పేరిట ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేసింది. ఇంత భారీస్థాయిలో ఒక్కసారిగా మహిళల పేరిట 30 లక్షలకు పైగా ఇళ్లస్థలాల్ని పంపిణీ చేయడం ఇప్పటి వరకూ ప్రపంచ చరిత్రలో ఎక్కడా జరగలేదని గుర్తుచేస్తున్నాను. ఈ పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల విలువను మార్కెట్‌వాల్యూ ప్రకారం సుమారు రూ.1లక్ష కోట్లకు పైగానే ఉంటుంది. గతంలో చైనా, రష్యన్‌ విప్లవాల చరిత్రలోనూ ఈస్థాయిలో పేదలకు నివాసాన్ని కల్పించిన చరిత్ర నాకు తెలియదు. మరి, ఇంతటి ఘనమైన చరిత్రను ఒక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే సాధ్యమైందని తెలియజేస్తున్నాను.

డీబీటీ ద్వారా రూ.2.40 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ
ఈ ప్రభుత్వంలో బటన్‌ నొక్కితే పేదల బతుకులు బాగుపడుతున్నాయి.
ఆర్థికశాస్త్రంలోనే బటన్‌ నొక్కుడు అనే పదబంధం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. డీబీటీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కితే విద్యార్థుల చదువులకు సంబంధించి మేలు కలుగుతుంది. రైతులకూ, అక్కచెల్లెమ్మలకు, యువత, న్యాయవాదులు, ఆటోడ్రైవర్లు, ఆలయాలు, మందిరాల్లో పనిచేసే వారికి సైతం బటన్‌నొక్కితే మేలు కలిగి వారి ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. ఈ డీబీటీ ద్వారా మొత్తం రూ.2.40 లక్షల కోట్లు నవరత్నాల పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అయ్యాయి. నాన్‌ డీబీటీ ద్వారా మరో రూ.1.70 లక్షల కోట్లు ప్రభుత్వం ఖర్చుపెట్టింది. అనేక కుటుంబాల్లో పేదరికం తగ్గింది. తద్వారా ఆయా కుటుంబాల ఆత్మగౌరవం పెరిగింది.

శ్మశానవాటికలకు 1,250 ఎకరాల కేటాయింపు
సమాజంలో కులవ్యవస్థ ఉంది. ఆయా కులాల్లో ఎవరైనా చనిపోతే వారి ఖర్మకాండలు జరుపుకోవడానికీ సరైన శ్మశానవాటిక లేక చాలా ఇబ్బందులు పడేవారు. దళితులు, బలహీనవర్గాలకు శ్మశానవాటికలు పెద్ద సమస్యగా మారేవి. చాలాచోట్ల ఉద్యమాలు జరిగాయి. కొన్నిచోట్ల వివాదాలూ జరిగాయి. అయితే, వీటన్నింటికీ గౌరవ ముఖ్యమంత్రి జగన్‌ పరిష్కారం చూపారు. సుమారు 1,854 గ్రామాల్లో 1,250 ఎకరాల్ని శ్మశానవాటికలకు కేటాయించి.. అంతిమసంస్కారాలు చేసుకుని ఆత్మగౌరవం నిలుపుకునే అవకాశం కల్పించారు.

ఇలాంటి మేలు గతంలో ఏనాడైనా చూశారా..?
పేదవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలను ఆదుకోవడంతో పాటు రైతులకు అండగా ఉండి రూ.కోట్లల్లో మేలు చేసి చూపించిన ప్రభుత్వం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది మాత్రమే. మరి, ఇలాంటి మేలును గత ప్రభుత్వాల హయాంలో ఏనాడైనా చూశారా..? అంటూ ప్రతిపక్షాల్ని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవంలోనూ, అధికారంలోనూ పేదలకు, రైతులకు మేలు చేసే ఇలాంటి మంచి ఆలోచన ఎందుకు చేయలేకపోయారంటూ ప్రశ్నిస్తున్నాను.

మంచి ప్రభుత్వాన్ని ప్రోత్సహించే బాధ్యతను గుర్తిద్దాం
గత ప్రభుత్వాల హయాంలలో, ప్రస్తుతం దళితులపై కొన్నిచోట్ల జరిగే చిన్నచిన్న సంఘటనల్ని మేమూ ఖండిస్తున్నాం. కానీ, ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చేసిన మేలును ప్రతిపక్షాలు ఎందుకు అంగీకరించలేకపోతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున పేదవర్గాలకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ని ‘శెభాష్‌ ’ అని ఎందుకు అనలేకపోతున్నారు. మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రోత్సహించే బాధ్యతను మనమంతా గుర్తెరగాలని రాజకీయపక్షాలతో పాటు వివిధ ప్రజాసంఘాలనూ కోరుతున్నాను.

LEAVE A RESPONSE