Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ మునిగిపోతుందని ప్రపంచ వేదిక మీద ప్రశ్నిస్తే.. నా కళ్ళు చెమర్చాయ్

– వరదలొస్తే విశాఖ మునిగిపోతుందని ఓ వర్గం మీడియా ఈ ప్రాంత ఇమేజ్ ను దెబ్బతీసింది
– రాష్ట్రానికి, విశాఖకు హాని చేయొద్దు అని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా
– విశాఖను యూనికార్న్ హబ్ గా తయారు చేయాలన్నదే సీఎం జగన్ విజన్
– గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ దిక్చూచి కాబోతుంది
– డీకార్బనైజ్డ్‌ మెకానిజంలో ఐకాన్ గా ఏపీ ఉండాలన్నదే లక్ష్యం
– లోకేష్ కు ఏ సూటూ సూటు కాదు కాబట్టి.. మమ్మల్ని చూసి ఏడుపెందుకు..?
– రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

వరదలొస్తే విశాఖపట్నం మునిగిపోతుందని, ప్రతిపక్ష పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశంతోనో, లేక మరే దురుద్దేశాలతోనో, ఓ వర్గం మీడియా పనిగట్టుకుని ఈ ప్రాంతం మీద తప్పుడు ప్రచారం చేయడం వల్లే, ప్రపంచ స్థాయిలో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న ఓ సంస్థ ప్రతినిధి ప్రశ్నిస్తే ఆశ్చర్యపోవడంతోపాటు, ఈ ప్రాంతం మీద ఇంతగా విషం చిమ్ముతున్న తీరు చూసి నా కళ్ళు చెమర్చాయ్.. అని రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు.

ఐటీ హబ్ గా, పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం ఇమేజ్ ను దెబ్బతీస్తే సహించలేకపోయానని, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో అడిగిన ఆ ప్రతినిధికి ఇక్కడి వాస్తవ పరిస్థితులను వివరించడంతోపాటు, అటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, ఈ దుష్ప్రచారాన్ని దయచేసి ఇంకెవరికీ చెప్పవద్దని కోరానని విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్ లో జరిగిన విలేఖర్ల సమావేశంలో మంత్రి చెప్పారు. రాజకీయాలు ఎన్ని ఉన్నా, రాష్ట్ర అభివృద్ధి విషయంలో అంతా కలిసిరావాలని, రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ఎవరూ పణంగా పెట్టకూడదని విజ్ఞప్తి చేశారు. మీ రాజకీయాల కోసం, మీ స్వార్థం కోసం రాష్ట్రానికి, విశాఖకు ఎవరూ హాని చేయవద్దు అని మంత్రి అమర్నాథ్ రెండు చేతులు జోడించి వేడుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో మంత్రులు, అధికార యంత్రాంగం అంతా దావోస్ వెళ్ళింది, మా వ్యక్తిగత ప్రమోషన్ కోసం కాదని, అంతర్జాతీయ వేదిక మీద రాష్ట్రాన్ని ప్రమోట్ చేయటానికే వెళ్ళాం అన్నది అందరూ గుర్తెరగాలని మంత్రి స్పష్టం చేశారు.

విశాఖను యూనికార్న్ హబ్ గా తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి జగన్ విజన్ అని, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఏపీ ప్రపంచానికే దిక్చూచి కాబోతుందని అన్నారు. డీకార్బనైజ్డ్‌ మెకానిజంలో ఆంధ్రప్రదేశ్ ఐకాన్ గా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…

దావోస్‌లో జరిగిన ప్రపంచ స్థాయి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో మన రాష్ట్రానికి ఉన్నటువంటి అవకాశాలు, రాష్ట్రానికి ఉన్న సహజ వనరులు గురించి వివరించి, పెట్టుబడులు ఆహ్వానించాం. దేశంలోనే రెండో అతి పెద్ద సముద్ర తీరం.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాల్లో 10 జిల్లాల్లో సముద్ర తీరం ఉన్న ప్రాంతం, పోర్టు ఆధారిత ఇండస్ట్రీయల్‌ ఆధారిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఉంది. రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలను ప్రపంచ స్థాయి వేదికపై ఫోకస్‌ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో పలు సంస్థలకు చెందిన అంతర్జాతీయ ప్రతినిధులతో ఆయా సమావేశాల్లో పాల్గొని, పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనువైన వాతావరణాన్ని తెలియజేశాం.

అయిదు రోజులు పాటు జరిగిన ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పెవిలియన్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ స్థాయి నుంచి వచ్చిన అనేక మంది ప్రతినిధులు ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన మన దగ్గర ఉన్న అవకాశాలను అంచనా వేసుకోవడానికి, అవకాశాలు వెతుక్కోవడానికి, రాష్ట్రం నుంచి అందించే అవకాశాలు తెలుసుకోవడానికి ఇది దోహదపడింది. దాదాపు 50మంది ప్రపంచ స్థాయి మల్టీ నేషనల్‌ కంపెనీలకు చెందిన ప్రతినిధులతో భేటీ జరిగింది. ఏపీలో ఐటీకి ఎక్కువ అవకాశాలు ఉన్న విశాఖ నగరాన్ని ఒక యూనికార్న్‌ హబ్‌గా చేయలనే లక్ష్యంతో యూనికార్న్‌, ఓయో సంస్థ ప్రతినిధులు, స్టార్టప్‌ కంపెనీ ప్రతినిధులతో ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశాం.

విశాఖపట్నాన్ని యూనికార్న్‌ హబ్‌గా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజన్‌ ప్రకారం… ఆయా ఐటీ కంపెనీల ప్రతినిధులతో చర్చించి, వారిని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది. వరల్డ్‌ ఎకనామిక్స్‌ కాంగ్రెస్‌లో చాలామంది ప్రపంచ స్థాయి నాయకులతో ముఖ్యమంత్రిగారు భేటీ అయ్యారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌లో దాదాపు 35 సమావేశాలు జరిగాయి. అందుకు సంబంధించిన వివరాలు మీడియా ప్రతినిధులకు అందించాం.

వైద్యం, విద్య, గ్రీన్ ఎనర్జీలపై ఫోకస్
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులో మూడు ప్రధాన అంశాల మీద ఫోకస్‌ చేయడం జరిగింది. హెల్త్‌ కు సంబంధించిన సదస్సులో ప్రపంచస్థాయి వ్యక్తులతో పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గ్లోబల్‌ లీడర్‌గా పాల్గొనడం జరిగింది. హెల్త్‌కు సంబంధించిన సదస్సులో తాను, విద్యకు సంబంధించిన సదస్సులో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.

ప్రధానంగా డీకార్బనైజ్డ్‌ ఎకానమీ మీద దృష్టి సారిస్తూ, గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో ఏపీ కొత్త ట్రెండ్‌ను నెలకొల్పింది. గ్రీన్‌ ఎనర్జీ ప్రొడక‌్షన్‌కు సంబంధించి షోకేస్‌గా కర్నూలు ప్రాజెక్టు నిలుస్తుంది. కర్నూలులో నిర్మిస్తోన్న విండ్‌, హైడల్‌, సోలార్‌ పవర్‌ ప్రాజెక్టులో అనుసరిస్తున్న టెక్నాలజీతో 33,000 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికి పైలట్‌గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, సీఐఏ కలిపి ప్రపంచస్థాయి సదస్సులో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ ఎనర్జీపై చర్చ జరుగుతోంది. దానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖద్వారంగా ఉండాలని, ప్రపంచానికే దిక్చూచీ కాబోతోందని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌కాంత్‌ కూడా ప్రస్తావించడం జరిగింది.

రానున్న కాలంలో గ్రీన్‌ స్టీల్‌ప్లాంట్‌, గ్రీన్‌ ఎస్‌ఈజెడ్‌లను ప్రమోట్‌ చేయాలని ముఖ్యమంత్రి ప్రపంచ వేదిక మీద మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం విశాఖలో ఉన్న ప్లాంట్‌ను విస్తరణకు మరో వెయ్యి కోట్లుకు పెంచుతూ ఆదిత్య మిట్టల్‌ ప్రకటన కూడా చేశారు. దావోస్‌లో జరిగిన ఎంవోయూలో డీకార్బనైజ్డ్‌ ఎకానమికీ సంబంధించి అదానీ, గ్రీన్‌ కో, అరబిందో లు ప్రధాన పరిశ్రమలు. వీటికి సంబంధించి దాదాపు రూ. లక్షా 25వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకున్నాయి.

కర్నూలులో గ్రీన్‌ కో కంపెనీ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్‌ ప్రాజెక్ట్‌ 5230 మెగా వాట్ల సౌర, పవన, పంప్డ్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టును ఒకే వేదికపై ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌ ఈ రంగంలో మరింత విస్తృతంగా పెట్టుబడులును ఆహ్వానిస్తోంది. అందులో భాగంగా పెట్టుబడులు పెట్టడానికి ‍ ప్రధానమైన మూడు సంస్థలు సిద్ధంగా ఉన్నారు. ఈ రంగంలో ఆసక్తి ఉన్న ఎవరికైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది. పర్యావరణం పరిరక్షణపట్ల సానుకూల దృక్ఫదం ఉన్నవారెవరైనా ముందుకు వస్తే సాదర స్వాగతం పలుకుతాం అని ముఖ్యమంత్రి తెలియజేశారు.

అవిగో.. ఇవిగో అంటూ ప్రజలను మభ్యపెట్టం
గత పాలకులు మాదిరిగా అవిగో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మేం అబద్ధాలు చెప్పం. ఊహల్లో అంచనాలు అంతకన్నా వేయం. వాస్తవాలను మాత్రమే ప్రజల ముందు ఉంచుతాం. దావోస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం ఎంత? ఈ రాష్ట్రం ఎంత మేరకు ఒప్పందాలు చేసుకుందనే దానిపై పోలిక ఉండదని సమావేశానికి వెళ్లడానికి ముందే మేం చెప్పాం. మేము జరిగేది, జరగబోయేది గురించి మాత్రమే మాట్లాడగలం. ఊహించి ఏదో నోటికొచ్చిన లెక్కలను చెప్పి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం ఎప్పుడూ చేయం. అదానీ, అరబిందో, గ్రీన్‌ కో కంపెనీలతో ఒప్పందాలకు చేసుకోవడానికి దావోస్‌ వెళ్లాలా అంటూ ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ఖండిస్తున్నాం. ఆ సంస్థలకు ఇక్కడ ఉన్న అవకాశాలు తెలుసు కాబట్టే ఒప్పందాలు చేసుకున్నారు. మిగతా ప్రపంచ స్థాయి సంస్థలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన స్థితిగతులు, అవకాశాలు చూసుకున్న తర్వాతే నిర్ణయాలు జరుగుతాయి.

రాష్ట్రానికి సంబంధించి పారిశ్రామిక అభివృద్ధి కోసం దాదాపు లక్ష ఎకరాలు(99వేల ఎకరాలు) అందుబాటులో ఉంచాం. ఇప్పటికే 40-50వేల ఎకరాలలో ఆయా పరిశ్రమలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు ఛైర్మన్ తో కలిసి, విశాఖలో కార్యాలయం ఏర్పాటు చేయాలని అడిగాం. అలానే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థలను ఆహ్వానించాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 1గా ఉన్నాం.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అందర్నీ ఆహ్వానించాం. వాళ్లందరికీ, సదస్సుకు వెళ్ళి వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం లేఖలు రాస్తుంది. ఎంత మేరకు ఆయా సంస్థలు పెట్టుబడులకు సహకరించగలవో, తద్వారా ఈ ప్రాంతానికి మేలు చేయగలుగుతామనే పాజిటివ్‌ సంకేతాలను చెప్పగలిగాం. దావోస్‌ వెళ్లింది మమ్మల్నో, ముఖ్యమంత్రిగారినో ప్రమోట్‌ చేసుకోవడానికి కాదు, రాష్ట్రాన్ని ప్రమోట్‌ చేయడానికి వెళ్లాం.
జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక పెట్టుబడుల కోసం వెళ్లిన మొట్ట మొదటి పర్యటన ఇది. మంచి సమావేశాలు జరిగాయి. రాష్ట్రానికి సంబంధించి ఆరోగ్యం, వ్యవసాయం, విద్య పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాం.

విశాఖపై ఎందుకంత కక్ష..
విలేకర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ..దావోస్ లో.. ప్రపంచ స్థాయి గుర్తింపు ఉన్న ఒక సంస్థ ప్రతినిధిని కలిసినప్పుడు విశాఖ మునిగిపోతుందట కదా, విశాఖలో పెట్టుబడులు పెట్టడం వల్ల తమకు ఇబ్బందులు వస్తాయని చెప్పారు. విశాఖ మునిగిపోవడం ఏంటని నేను ఆశ్చర్యపోయాను. పేపర్లలో చదివామని వాళ్లు చెప్పారు. ఇదంతా కొంతమంది చేసిన విష ప్రచారం. ఏ ప్రయోజనం ఆశించి వాళ్లు ఇలా చేశారో అర్థం కావడం లేదు. నమ్మవద్దు అని చెప్పాను. ఎవరు, ఎందుకు రాశారో, ఎవరి ప్రయోజనాల కోసం రాశారో రాష్ట్ర ప్రజలకు తెలుసు.

హుద్‌హుద్‌ తుపానును చూపించి, ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ ప్రాంతం ఇమేజ్‌ను కొంతమంది దెబ్బతీశారు. రాష్ట్రానికి మంత్రిగా, విశాఖ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిగా ఈ ప్రాంతానికి అటువంటి చెడ్డపేరు తీసుకుస్తే భరించే స్థితిలో మేము లేము. రాష్ట్రంతో పాటు విశాఖపై ఎందుకంత కక్ష కట్టారని అడుగుతున్నాం.

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దావోస్ కు వెళ్ళి వారు ఏం చేశారో, ఏ భోజనం చేశారు, ఎక్కడ స్నానం చేశారు.. ఇలాంటివన్నీ హైలెట్ చేశారు. మేము ఈరోజు అటువంటి వార్తలు రాయమని అడగటం లేదు. రాష్ట్రానికి మంచి జరుగుతుంటే, దానిని మాత్రమే రాయాలని అడుగుతున్నాం.

రాష్ట్రాన్ని, మా ముఖ్యమంత్రిని పొడగమని మేము మిమ్మల్ని అడగటం లేదు. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాయడం కోసం దయచేసి రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి చెడు చేయవద్దని చేతులు జోడించి వేడుకుంటున్నాను.లోకేష్ కు ఏ సూటూ సూటు అవ్వదు.. మాకు సూటు అయితే, దాన్ని చూసి ఏడవటం ఎందుకు..? అని ప్రశ్నిస్తున్నాం. ఈ ఏడుపుగొట్టు రాజకీయాలు ఆపండి.

LEAVE A RESPONSE