– తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, కవి, రచయిత నందిని సిధారెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్ : తెలంగాణను తిరిగి ఆంధ్రప్రదేశ్ గా మార్చే కుట్ర జరుగుతుంది. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండే పత్రికలు, నాయకులు ఆ దిశగా పావులు కదుపుతున్నారు.రాధాకృష్ణ కొత్త పలుకుల పేరిట రాసిన వ్యాసం లో హెడ్డింగ్ బీఆర్ఎస్ ను రాజకీయంగా విమర్శించినట్లుగా పెట్టి, లోపల తెలంగాణ అస్థిత్వాన్ని అస్థిరపరిచే రాతలు రాశాడు.
ఇప్పుడిప్పుడే తెలంగాణ, ఆంధ్ర అనే భావన లేకుండా అందరు సంతోషంగా ఉన్నారంటూ రాశారు. తెలంగాణ, ఆంధ్ర భావన లేకుండా సంతోషంగా ఉన్నది కేవలం రాధాకృష్ణ, రేవంత్ రెడ్డి వారి గురువు చంద్రబాబు మాత్రమే. ఇప్పుడిప్పుడే గవర్నమెంట్ వచ్చింది ఎందుకు మాట్లాడాలి అని మౌనంగా ఉంటే.. మన లోగోలో కాకతీయ తోరణం మాయమయింది, తెలంగాణ తల్లి చేతిలొ బతుకమ్మ మాయమయింది, భారతదేశ చిత్రపటంలో తెలంగాణ పటమే తీసేశారు.
ఇవన్నీ ఏదో అనుకోకుండా జరిగిన ఘటనలు కావు, చాలా పక్కా ఆలోచనలతో కుట్ర పూరితంగా చేసినవే.
తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇంకెక్కడి తెలంగాణవాదం ఉంది అని సమైక్య వాదులు అనుకుంటే పొరపాటు అవుతుంది. తెలంగాణ ప్రాంతీయత అస్తిత్వం మీదనే రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ప్రాంతీయతత్వం అనేది ఇక్కడి మట్టిలో ఇక్కడి ప్రజల్లో ఎప్పుడు ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రాంతానికి చరిత్ర ఉంది. తెలంగాణ ప్రజలు ఈ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది