– సింగపూర్ లో అవసరమైన పద్ధతులను అధ్యయనం చేస్తున్న మంత్రి
– ఆల్బ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను పరిశీలన
– ప్లాస్టిక్ వ్యర్థాలు, ఈ – వేస్ట్ ను రీ సైక్లింగ్ చేయడం, ఇతర వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పతి చేసే విధానాలపై అధ్యయనం
– సింగపూర్ పోలీస్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి
– రాత్రికి సింగపూర్ నుంచి మలేషియా బయలుదేరిన మంత్రి నారాయణ
సింగపూర్: అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మించేలా అవసరమైన పద్ధతులపై మంత్రి నారాయణ అధ్యయనం చేస్తున్నారు. ఆరు రోజులుగా సింగపూర్ లో మంత్రి పర్యటిస్తున్నారు. వివిధ నిర్మాణాలు, ప్రాజెక్ట్ లను అధ్యయనం చేయడంతో పాటు పలువురు ప్రముఖులతో సమావేశమవుతున్నారు. శుక్రవారం ఉదయం సింగపూర్ లోని ఆల్బ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు.
ఈ ప్లాంట్ లో ఘన వ్యర్థాలను వివిధ రూపాలుగా మార్చనున్నారు. ఇళ్లు, పరిశ్రమల నుంచి సేకరించిన ఘన వ్యర్థాలను అధునాతన టెక్నాలజీతో తయారుచేసిన వాహనాల్లో ఈ ప్లాంట్ కు తరలిస్తారు. ఇక్కడ ప్లాస్టిక్ రీసైక్లింగ్ తో పాటు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేయనున్నారు. మిగిలిన ఘన వ్యర్థాలను వేస్ట్ టు ఎనర్జీగా మారుస్తున్నారు. వ్యర్థాల సేకరణ నుంచి వాటిని రీసైక్లింగ్ చేసే వరకూ ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారనేది సింగపూర్ అధికారులు మంత్రి నారాయణకు వివరించారు.
ఏపీలో కూడా ఘన వ్యర్థాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఓవైపు రోజువారీ వచ్చే చెత్తను వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లకు తరలించడంతో పాటు ఈ – వేస్ట్ ను కూడా రీసైకిల్ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సింగపూర్ లో అనుసరిస్తున్న విధానాలను ఏపీలో కొన్నిచోట్ల అమలుచేస్తే ఎలా ఉంటుందనే దానిపై సింగపూర్ అధికారులతో మంత్రి నారాయణ చర్చించారు.
సింగపూర్ పోలీస్ ఫోర్స్ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం మంత్రి సందర్శించారు. సింగపూర్ లో చట్టాల అమలు, శాంతి భద్రతల పరిరక్షణ వంటి అంశాలతో పాటు నేరాలను అరికట్టేందుకు ఉపయోగిస్తున్న సాంకేతిక గురించి అక్కడి పోలీస్ ఉన్నతాధికారులు మంత్రి నారాయణకు వివరించారు. ఆ తర్వాత సింగపూర్ కాలమానం ప్రకారం రాత్రికి అక్కడి నుంచి మలేషియా బయలుదేరి వెళ్లారు. మలేషియాలోనూ అర్బన్ డెవలప్ మెంట్, ట్విన్స్ టవర్స్ తో పాటు కన్వెన్షన్ సెంటర్లు, రోడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై అక్కడి అధికారులతో కలిసి పరిశీలించనున్నారు.