– ధరణి నిర్వహణను ఎన్.ఐ.సికి అప్పగిస్తూ ఉత్వర్వులు
– త్వరలో ధరణి సమస్యలనుంచి పూర్తిగా మిముక్తి కల్పిస్తాం
– రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ : ఇప్పటి వరకు విదేశీ సంస్ధ టెర్రాసిస్ చేతిలో ఉన్న ధరణి నిర్వహణా బాధ్యతను స్వదేశీ సంస్ధ ఎన్. ఐ. సికి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.
డిసెంబర్ 1 వతేదీ నుంచి తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణా బాధ్యతను జాతీయ సమాచార సంస్ధ (ఎన్ఐసి ) నిర్వహిస్తుందని ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేయడం జరిగిందని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి గారు వెల్లడించారు. త్వరలో ధరణి సమస్యల నుంచి ప్రజలకు పూర్తి విముక్తి కల్పిస్తామని వెల్లడించారు.
ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం లోని పెద్దలు ఎలాంటి ముందు చూపు లేకుండా హడావుడిగా తొందరపాటు నిర్ణయాలతో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. అప్పట్లో బిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు తెలంగాణకు చెందిన 1.56 కోట్ల ఎకరాల భూమిని టెర్రాసిస్ అనే విదేశీ కంపెనీకి తాకట్టు పెట్టారని . ఒరిస్సా రాష్ట్రంలో ఈ సంస్ధ పనిచేసి విఫలమైంది.
ఇటువంటి సంస్ధకు కేవలం తమ స్వార్ధ ప్రయోజనాల కోసం బిఆర్ఎస్ పెద్దలు కట్టబెట్టినట్లు మంత్రి పొంగులేటి దుయ్యబట్టారు. లక్షలాది రైతుల లకు చెందిన కోట్లాది ఎకరాల వ్యవసాయ భూములను లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములను గత బారాస ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రెవిన్యూ శాఖ మంత్రి అయినా కేసీఆర్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ ఏకపక్షంగా యదేచ్చగా విదేశీ కంపెనీలకు అప్పగించగా ఐదేళ్లపాటు ధరణి పోర్టల్ రైతులను నానా ఇబ్బందులు పెట్టింది.
ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్ విదేశీ కంపెనీల చేతుల్లో నుంచి ప్రభుత్వం చేతిలోకి తీసుకుంటుందని కాంగ్రెస్ చెప్పిన ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి ఇవ్వడం అయినది తద్వారా 71, 00,000 ఖాతాల రైతుల భూములకు పూర్తి రక్షణ లభించినట్లయింది. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాము ఎన్నికల ప్రణాళికలో ధరణి పోర్టల్ ప్రక్షాళన చేపడతామని ప్రకటించి ప్రజల అభిమానాన్ని చూరగొన్నామని తెలిపారు.
ఇచ్చిన మాట మేరకు విదేశీ కంపెనీ చేతుల్లో ఉన్న తెలంగాణ భూములను కాపాడుకోవడానికి , ఆ కంపెనీ రద్దుకు నిర్ణయించామని మంత్రి తెలిపారు. ధరణి నిర్వహణా బాధ్యతను మార్చడం వలన రాష్ట్రంలోని లక్షలాది కుటంబాలు సమస్యలు ,ఇబ్బందుల నుంచి బయటపడతాయని , అందరి భూ సమస్యలకు చక్కని పరిష్కారాలు త్వరలో లభిస్తాయని మంత్రి పొంగులేటి వివరించారు.
2020 అక్టోబర్ లో తీసుకువచ్చిన ధరణి పోర్టల్ దారితప్పి లోపభూయిష్టంగా మారి ప్రజానీకానికి శాపంగా మారిందన్నారు. ధరణి పేరుతో జరిగినా దగా వల్ల తెలంగాణా సమాజం తీవ్రంగా నష్టపోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను సమాధి చేసిందని మంత్రి ఆరోపించారు. ఆ నాటి ప్రభుత్వ పెద్దల దాష్టీకానికి ప్రజలు అనుభవించిన బాధలు అన్నీ ఇన్నీకావని, కాంగ్రెస్ ప్రభుత్వం వీటికి చరమగీతం పాడుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.