Home » బాబుతో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ

బాబుతో మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ భేటీ

-ఎయిమ్స్ సమస్యలను సిఎంకు వివరించిన డైరెక్టర్ డా.మధబానందకర్
-సాధ్యమైనంత త్వరలో సమస్యలు పరిష్కారం చేస్తామని ముఖ్యమంత్రి హామీ

అమరావతి: మంగళగిరి ఎయిమ్స్ ను దేశంలో టాప్-3 స్థానంలో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వంలో రూ.1,618 కోట్ల కేంద్ర నిధులతో ఎయిమ్స్ ఏర్పాటు అయ్యింది. ఎయిమ్స్ నిర్మాణానికి అవసరమైన భూములు, అనుమతులు ఇచ్చి నాటి తెలుగుదేశం ప్రభుత్వం వేగంగా పనులు పూర్తి చేసింది. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరవాత ఈ ప్రతిష్టాత్మక సంస్థను సమస్యలు చుట్టుముట్టాయి. రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన చేయూత ఇవ్వకపోవడం, మౌళిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఎయిమ్స్ సమస్యల భారిన పడింది.

సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఎయిమ్స్ డైరెక్టర్ డా.మధబానందకర్ సంస్థ సేవలపై వివరించారు. ప్రస్తుతం తాము ఎదుర్కొంటున్న సమస్యలను సిఎం దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా తీవ్ర నీటి కొరతతో సేవలను విస్తరించలేకపోతున్నాం అని తెలిపారు. నీటి సమస్య పరిష్కారం కోసం తలపెట్టిన పైప్ లైన్ పనులు కూడా ఆగిపోయాయని తెలిపారు. రోజుకు 7 ఎఎల్ డి నీరు అవసరం పడగా…ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా కేవలం 2 ఎంఎల్ డి నీరు మాత్రమే అందుబాటులో ఉంటుందని డైరెక్టర్ వివరించారు.

అటవీ భూమిగుండా పైప్ లైన్ నిర్మాణం విషయంలో సమస్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. అదే విధంగా విద్యుత్ సరఫరా విషయంలో కూడా ఉన్న సమస్యలు సిఎం దృష్టికి తెచ్చారు. 192 ఎకరాలకు గాను 182 ఎకరాలు సంస్థ కోసం ఇచ్చారని….మరో 10 ఎకరాలు ఇస్తే ఎయిమ్స్ విస్తరణ పనులు చేస్తామని సిఎంకు డైరెక్టర్ వివరించారు. ఎయిమ్స్ లో అందుతున్న సదుపాయాలపై ఒకసారి వచ్చి పరిశీలించాలని సీఎం చంద్రబాబు నాయుడుని డైరెక్టర్ ఆహ్వానించారు.

ప్రతిష్టాత్మక ఎయిమ్స్ సమస్యల వలయంలో చిక్కుకుపోవడంపై సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో దీనిపై పూర్తి స్థాయి సమీక్ష చేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 5 ఏళ్ల పాటు గత ప్రభుత్వం కనీసం నీటి సమస్య తీర్చకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సాంకేతిక, ఆర్థిక సమస్యలతో ఎయిమ్స్ కు తాగునీటి సరఫరా చేసే పనులు నిలిచిపోవడం సరికాదని సీఎం అన్నారు. సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

Leave a Reply