Suryaa.co.in

Andhra Pradesh

విశాఖ ఉక్కు త్యాగాలు మరచిపోవద్దు

• పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, వారి సంఘాల్లో ఉండాలి
• ఉద్యోగులు, కార్మికులు, భూ నిర్వాసితులు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తా
• ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
• క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రితో సమావేశమైన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు

విజ‌య‌వాడ : ‘32 మంది బలిదానాలు, 16 వేల మంది నిర్వాసితుల త్యాగాలు, 24 వేల ఎకరాలు భూ సేకరణతో ఏర్పాటైన పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్. ఈ పరిశ్రమ కోసం అంతమంది చేసిన త్యాగాలను ఎవరూ మరచిపోకూడదు. వారి త్యాగాలతో ఏర్పడిన పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం ప్లాంట్ లో పని చేసే ప్రతి ఒక్కరితోపాటు కార్మిక, ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా ఉండాల’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఈ పరిశ్రమను కాపాడుకొనేందుకు కార్మికులు, ఉద్యోగులు, భూ నిర్వాసితులు తెలియచేసిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఆదివారం సాయంత్రం విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన వివిధ కార్మిక సంఘాలు, ఉక్కు పరిరక్షణ సంఘాల ప్రతినిధులు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు.

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రయివేటీకరణ కాకుండా కాపాడాలని ఆ ప్రతినిధులు కోరారు. 12,500 మంది ఉద్యోగులు, 14 వేలమంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారని, వారికి కొద్ది నెలలుగా పలు అలవెన్సులు కూడా అందటం లేదని తెలిపారు. తమ ఆవేదనను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆ రోజే అందరూ కలసి వచ్చి ఉంటే…

పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ‘పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ బతకాలని కోరుకొనేవాడిని. అలాగే సహకార విధానంలో ఉన్నవి నిలబడాలని ఆకాంక్షిస్తాను. విశాఖ ఉక్కును ప్రయివేటీకరణ చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి మాట్లాడాము. కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ని కలిసి ఎన్ని త్యాగాలు, పోరాటాలతో ఈ పరిశ్రమ ఏర్పాటైందో తెలిపాము.

విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర సభ నిర్వహించి ఉద్యోగ, కార్మిక సంఘాలు అన్నీ ఒక తాటిపైకి వచ్చి అఖిల పక్షంతో కేంద్రం దగ్గరకు వెళ్ళి విజ్ఞాపన ఇద్దాము అని చెబితే ఎవరూ ముందుకు రాలేదు. ఆ రోజే అందరూ కలసి వచ్చి ఉంటే ఇప్పుడు ఇంత ఆందోళన చెందాల్సి ఉండేది కాదు.

ప్రస్తుతం మీ ఆందోళనను కేంద్ర ప్రభుత్వానికి తెలియచేస్తాము. విశాఖ ఉక్కును నిలబెట్టుకొనేందుకు కార్మిక, ఉద్యోగ సంఘాల తరఫున మీరు చేసే ప్రతిపాదనలు వివరించాలి. అదే విధంగా మన వైపు నుంచి ఉన్న ఇబ్బందులను కూడా మనం తెలుసుకొని సరిదిద్దుకోవాలి’ అని సూచించారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసే వివరాలపై వారితో చర్చించి నివేదికను రూపొందించారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రయివేటీకరణ కాకుండా ఎలా కాపాడింది వివరించారు.

స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేద్దామన్నారా?

ఈ సందర్భంగా చర్చల్లో పవన్ కళ్యాణ్ కార్మిక, ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడుతూ ‘నాటి ముఖ్యమంత్రి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు అమ్మేద్దామని మీ ముందు ప్రతిపాదించిన మాట నిజమేనా?’ అని అడిగారు. ఆ ప్రతిపాదన వాస్తవమే అని ఆ నేతలు తెలిపారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఐ.ఎన్.టి.యూ.సి., బి.ఎం.ఎస్., సి.ఐ.టి.యు.సి., ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్, టి.ఎన్.టి.యూ.సి., డి.ఎస్.యు, యూ.ఎస్.ఈ, వి.ఎం.ఎస్.యూనియన్, యూత్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు, జనసేన పార్టీ పి.ఏ.సి. సభ్యులు కోన తాతారావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గడసాల అప్పారావు, భీమిలి పార్టీ ఇంచార్జ్ పంచకర్ల సందీప్ పాల్గొన్నారు.

LEAVE A RESPONSE