– ఇతర మతాలకేనా హక్కులు?
– పాక్, ఇరాన్, ఇరాన్, ఇజ్రాయిల్పై దాడులు జరిగితే భారత్లో నిరసనలు ఎందుకు?
– పాక్, బంగ్లాదేశ్లో హిందువులపై హత్యలు జరిగితే ఎవరూ నిరసన ప్రకటించరేం?
అసలు మానవహక్కులు అంటే ఏమిటి? ప్రతి మానవుడికి సహజసిద్ధంగా ఉండే హక్కులను మానవహక్కులని పిలుస్తాము. ఇవి జాతి, మత, దేశ, లింగ, భాషలకు అతీతంగా సర్వత్రా, మానవులందరికీ వర్తించే హక్కులు; వ్యక్తుల జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, హింస, బానిసత్వం నుంచి స్వేచ్ఛ, విద్య, ఉపాధి హక్కు, భావప్రకటనా స్వేచ్చ తదితర హక్కులు మానవహక్కులుగా పరిగణిస్తున్నారు.
ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 న యావత్ ప్రపంచం మానవహక్కుల రోజుగా పాటిస్తోంది. హక్కుల పరిరక్షణకై పునరంకితం అవుతోంది. ఐక్యరాజ్యసమితి (UNO) సర్వసభ్య సాధారణ సమావేశం 1945, 1948లో మనవ హక్కుల ప్రకటన పత్రం విడుదల చేసింది, ఇందులో ఆదర్శవంతమైన, ఆచరణీయమైన పౌర, సాంస్కృతిక, ఆర్ధిక, రాజకీయ, సామాజిక హక్కులను పరిరక్షించే సూత్రాలను పొందుపరిచింది.
ప్రపంచ దేశాలు తమ దేశాలలో వీటిని అమలుపరచేందుకు వీటిని రూపొందించారు. వివిధ దేశాలు ఈ ప్రకటనాపత్రంపై సంతకాలు చేసి, తమ దేశ ప్రజల సమగ్ర హక్కులను కాపాడే విధంగా చట్టాలలో మార్పులు చేసి, హక్కుల పరిరక్షణకు, ప్రజల ఆకాంక్షల సిద్ధికి, ప్రజాస్వామ్య విస్తరణకు దోహద పడ్డాయి. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశం 1965నుంచి వరుసగా ఎన్నెన్నో ఒడంబడికలపై సంతకం చేసింది. పౌర రాజకీయ హక్కుల ఒప్పందంపై (ICCPR) 1966లో, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల ఒప్పందంపై (ICESCR) 1966లో, జాతివివక్షతకి వ్యతిరేకంగా (ICERD)1965లో, స్త్రీలపై అన్నిరకాల వివక్షతలకి వ్యతిరేకంగా జరిగిన ఒప్పందంపై (CEDAW)1979లో, బాలల హక్కుల ఒప్పందంపై (CRC)1989లో, క్రూరమైన హింసాత్మక శిక్షలను వ్యతిరేకించే ఒప్పందంపై (CAT)1984లో మన దేశం సంతకాలు చేసింది.
క్రమేణా ఈ సంస్థ మానవ హక్కుల పరిధిని, వికలాంగులు 2006 (CRPD), ఇతర అల్పసంఖ్యాక వర్గాలకు విస్తరింపచేస్తూ, వివక్షను ఎదిరించే హక్కుల పరిరక్షణను విశ్వవ్యాప్తం చేసింది. అంతకుముందున్న `యుఎన్ మానవహక్కుల కమిషన్’ బదులు, 2006లో `మానవ హక్కుల కౌన్సిల్’ ఏర్పాటైంది. ప్రపంచంలోని అన్ని దేశాలు, ప్రాంతాలలో మానవహక్కులను మానవాళి అందరికీ విస్తరింపచేయడం కౌన్సిల్ ప్రధాన లక్ష్యం.
వీటితోపాటు ఎన్నో ప్రపంచదేశాలు తమ దేశాలలో `మానవహక్కుల కమిషన్’లు ఏర్పరిచి, ప్రజల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్నాయి.
మనదేశంలో కూడా, జాతీయ మానవహక్కుల కమిషన్ (NHRC) 1993లో ఏర్పాటైంది. దీనికి ప్రభుత్వం రాజ్యాంగ హోదా కల్పించింది.
మానవహక్కుల పరిరక్షణ, వృద్ధి, రాజ్యాంగంలోని `పౌరుల జీవించే హక్కు, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం’ కాపాడడం, మానవహక్కులకు భంగం వాటిల్లినపుడు, న్యాయస్థానాల ద్వారా వాటిని పునరుద్ధరించడం ఈ మానవహక్కుల కమిషన్ బాధ్యత. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి కమిషన్ అధ్యక్షుడుగా ఉంటారు.
ఇతర జాతీయ కమిషన్ల (మహిళా, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, బిసి, బాలలు, వికలాంగులు) అధ్యక్షులు ఎక్స్అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. అంతేకాక, అనేక రాష్ట్రాలలో కూడా రాష్ట్రస్థాయి మానవహక్కుల కమిషన్లు ఏర్పాటు చేయబడ్డాయి, మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ కమిషన్లు ఏర్పాటై ఉన్నాయి.
ప్రస్తుత పరిస్థితులు – భారత్ ఎదుర్కోవాల్సిన సవాళ్ళు
ప్రపంచంలో ఆధిపత్యంలో ఉన్న దేశాలు, అధిక సంఖ్యలో ఉన్న మెజారిటి క్రిస్టియన్ ముస్లిమ్ దేశాలు, లేక ఆయా దేశాలలో క్రిస్టియన్లు ముస్లిములు అధిక జనాభా కల దేశాలు, సహజంగానే `ప్రపంచ మానవహక్కుల కౌన్సిల్’ లో ఎక్కువ శాతం సభ్యులుగా కొనసాగుతున్నారు. ఆ దేశాలు అంతర్జాతీయ మానవహక్కుల సదస్సుల్లో, జమ్మూకాశ్మీర్ లో ముస్లిముల మానవహక్కులకి భారత ప్రభుత్వం, సైన్యం ఎంతో విఘాతం కలిగిస్తున్నాయి అనే తప్పుడు వార్తలు, కథలు చాలా దశాబ్దాలు ప్రచారం చేసాయి. ఈ వార్తలను భారత ప్రభుత్వం ఖండించినా అవి ఎవరూ పట్టించుకోలేదు. కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో `జిహాద్’ పేరిట జరిగిన హిందువుల హత్యలు, స్త్రీలపై మానభంగాలు, వేలాది దేవాలయాల విధ్వంసo, ఆఖరికి లక్షలాది హిందువులను అక్కడినుంచి తరిమికొట్టడం వంటి దురాగతాలను సాటి భారతీయులు కాని, భారత మానవహక్కుల కమిషన్లు, సంఘాలు/ సంస్థలు ఎందుకు విస్మరించాయో తెలియదు.
పాకిస్తాన్-ప్రేరేపిత ఈ మతహింసపై, భారత ప్రభుత్వ వాణి కూడా అంతర్జాతీయంగా బలంగా వినిపించలేదు. అయితే భారతదేశానికి వ్యతిరేకంగా మాత్రం, ఇక్కడి అల్పసంఖ్యాక వర్గాలపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని, ప్రజాస్వామ్యానికి, మానవహక్కులకి భంగం వాటిల్లుతోందని, కొందరు వ్యక్తులు, సంస్థలు పనికట్టుకునిచేసే అసత్య వార్తలు మాత్రం బాగా ప్రచారoలో ఉన్నాయి.
వారు చాలాకాలంగా ప్రపంచ దేశాలలో, మరీ ముఖ్యంగా భారతదేశం దేశం నుంచి విడిపోయి, రెండు ఇస్లామిక్ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో, గత కొన్ని దశాబ్దాలుగా హిందువులకి వ్యతిరేకంగా జరిగే మానవహక్కుల ఉల్లంఘనలను ఎప్పుడూ పట్టించుకోలేదు. భారత్ లోని 135కోట్లమంది ప్రజలు, ముఖ్యంగా హిందువులు భారత ప్రభుత్వం కూడా ఆ దేశాలలో హిందువులపై జరిగే దౌర్జన్యo, హత్యాకాండ, హింస, బలవంతపు మతమార్పిడిలు, ప్రాణహాని, స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నా, అంతర్జాతీయంగా వాటిపై ప్రతిస్పందించలేదు.
అసలు ఎటువంటి వార్తలు కూడా బయటకి వచ్చేవి కావు. ఇటివలికాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని చాలా సంఘటనలు ప్రతినిత్యం తెలుసుకోగలుగుతున్నాము. అయినా ఆశ్చర్యకరంగా భారత మీడియాలోగానీ, మెజారిటీ భారతీయులలోగానీ ఎటువంటి స్పందనా ఉండదు. `ఆప్ఇండియా’వంటి కొన్ని వెబ్సైట్లు మాత్రం హిందువుల మానవహక్కుల ఉల్లంఘనలపై కధనాలు రాస్తుండడం అభినందనీయం.
కొన్ని ఉదాహరణలు- 2001లో బంగ్లాదేశ్ భోలా జిల్లాలో హిందూద్వేషo కారణంగా, ఏకంగా 200మంది హిందూమహిళలపై మూకుమ్మడి అత్యాచారాలు జరిగాయి. 2017లో బంగ్లాదేశ్ రంగాపూర్ లో ఒక హిందూ యువకుడి ఫేస్ బుక్ పోస్ట్ కారణంగా హిందువులను వెళ్ళగొట్టి వారి ఇళ్ళు తగలబెట్టారు. జూన్ 2020లో పాకిస్తాన్ సింద్ గోలార్చిలో 102మంది హిందువులు బలవంతపు మతమార్పిడికి గురయారు.
అక్కడి దేవాలయం మసీదుగా మారింది. సెప్టెంబర్2020లో సింద్ రాష్ట్ర సంఘర్ లో 171 భిల్ సముదాయ హిందువులు బలవంతపు మతమార్పిడికి గురయారు. పాకిస్తాన్ లో హిందూ అమ్మాయిల బలాత్కరణ, బలవంతపు పెళ్లిళ్లు అసంఖ్యాకం. హిందువుల ఇళ్ళు తగలబడిపోవడం, దేవాలయాలు మసీదులుగా మారడం కోకొల్లలు. కరోనా కాలంలో కూడా, హిందువులకి మందులు, చికిత్స ఇవ్వలేదనే వార్తలు అనేకం వచ్చాయి.
పాకిస్తాన్ లో ఉన్న ` మతదూషణ’ చట్టంకింద, అనేకమంది హిందువులపై తప్పుడు కేసులు పెడుతుంటారు. పాకిస్తాన్ , బంగ్లాదేశ్ ల్లో హింసకు గురై, ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయిన హిందువులు సిక్ఖులకు కొంత వెసులుబాటు కల్పిస్తూ, డిసెంబర్2019లో భారత ప్రభుత్వం, `పౌరసత్వచట్ట సవరణలు’ (CAA 2019) చేసినపుడు, ఆ సవరణలకి మనదేశంలో మైనారిటీలకి ఎటువంటి సంబంధం లేకపోయినా, దేశంలో అసంఖ్యాక ప్రాంతాల్లో సుదీర్ఘకాలం నిరసనలు ప్రేరేపించడం జరిగింది.
ఢిల్లీలో షాహీన్బాగ్ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసి, చివరికి మార్చ్2020లో ఢిల్లీ అల్లర్లు సృష్టించారు, వాటిల్లో 50మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంటలిజెన్స్ అధికారి అంకిత్ శర్మను అతి కిరాతకంగా హింసించి చంపి, మురికి కాలవలో పడేసారు.
కేవలం `హిందూద్వేషం’తో, శరణార్ధి హిందువులకి మానవహక్కులు లేకుండా చేయాలని ఈ అక్రమాలన్నీ జరిగాయి. అయితే కోట్లాదిమంది బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు ఈ దేశంలో అక్రమంగా చట్టవిరుద్ధంగా నివాసం ఏర్పరుచుకున్నా, ఆశ్చర్యకరంగా ఎప్పుడూ ఎటువంటి నిరసనలు జరగలేదు.
హిందువుల జీవించే హక్కు
కాశ్మీర్ లాగే, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా బెంగాల్, కేరళ, హర్యానా, హైదరాబాద్ వంటి కొన్ని ప్రాంతాల్లో, కొన్ని వర్గాలు వివిధ రకాలుగా హిందువులపై ఆధిపత్యం చెలాయిస్తున్నా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవు, దౌర్జన్యాలపై ఎటువంటి చర్యలు తీసుకోవు, అయినా ఇవి హిందువుల మానవహక్కుల ఉల్లంఘనగా పరిగణించబడట్లేదు.
ఇటీవలి కాలంలో, మహారాష్ట్ర పాల్ఘర్ హిందూ సాధువుల హత్య, ఉత్తరప్రదేశ్ లో హిందూ కార్యకర్త కమలేశ్ తివారీ దారుణ హత్య, తెలంగాణాలోని వరంగల్ లో హిందూ పూజారి హత్య, తమిళనాడులో హిందూ కార్యకర్తలు రామలింగం, అరుణ్ ప్రకాష్ హత్యలు, తెలంగాణా భైన్సాలో హిందువుల ఇళ్ళపై దాడి, ఎన్నోచోట్ల `గోవుల స్మగ్లింగ్’ని ఆపే ప్రయత్నం చేసే గోరక్షకుల హత్యలు, హిందూ యువతులను ప్రేమ పేరుతో చేసే `లవ్ జిహాద్’ మోసాలు, యువతుల హత్యలు, బెంగుళూరులో ఒక ఫేస్బుక్ పోస్ట్ పై హిందువులపైన, పోలీస్ స్టేషన్లపైన దాడులు, ఇంకా అనేకానేక సంఘటనలు, కేవలం `హిందూ ద్వేషంతో’ హిందూస్తాన్ అని పిలిచే భారత్ లో జరుగుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ మిర్జాపూర్ లో తివారీ సోదరుల హత్యలు, గోపాల్గంజ్ లో రోహిత్ జస్వాల్ హత్య, ఢిల్లీలో అంకిత్ సక్సేనా హత్య, విద్యార్థిని నికితా తోమర్ హత్య, ఇంకా ఎన్నెన్నో ఈ కోవకి చెందుతాయి. జాతి, మత విద్వేషంతో జరిగే ఈ హత్యలు, దౌర్జన్యాలు, అరాచకాలు మానవహక్కుల ఉల్లంఘన క్రిందకే వస్తాయి. ఇతర దేశాలు ఇటువంటి హింసాదౌర్జన్యాలు ఎంత తీవ్రంగా తీసుకుంటాయో, మనం ఇటీవల ఫ్రాన్స్, ఆస్ట్రియా, డెన్మార్క్, బ్రిటన్ వంటి దేశాలలో గమనించాము.
హిందూ మత- సాంస్కృతిక హక్కులు
పైన చెప్పిన ఉదాహరణలు, హిందువుల జీవించే హక్కును ఉల్లంఘిస్తుంటే, హిందువుల తమ మతాన్ని స్వేచ్ఛగా పాటించే హక్కు, ఇతర సామాజిక, సాంస్కృతిక మానవహక్కులను దశాబ్దాలుగా విచ్చలవిడిగా ఉల్లంఘిస్తూ నిరాటంకంగా క్రిస్టియన్ మతమార్పిడిలు చర్చ్ ద్వారా సాగిపోతున్నాయి.
కోట్లాదిమంది హిందువులు, మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, ఈశాన్య రాష్ట్రాలలో, దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాలలో, చాలా శాతం జనాభాను మతమార్పిడి చేయడమే కాక, ఈ మార్పిడి జనాభా లెక్ఖలలో నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు; హిందూ పేర్లతో కొనసాగుతూ, హిందువులకి చెందాల్సిన రిజర్వేషన్లవంటి సౌకర్యాలను హరించారు. అలాగే ముఖ్యంగా దక్షిణ భారతంలో హిందూ దేవాలయాలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉంటాయి.
వారు ఇష్టానుసారంగా వాటిని నిర్వహిస్తారు. భక్తులు హుండిలో వేసే డబ్బులతో, భక్తులనుంచి టికెట్ల రూపంలో వసూలు చేసే డబ్బుతో ప్రభుత్వ లౌకికమైన కార్యక్రమాలు చేస్తుంటారు. దేవాలయాల భూములు, ఇతర ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నా, ప్రభుత్వం హిందూ సమాజానికి సమాధానం చెప్పదు, ప్రభుత్వమే భూముల పంపిణి చేస్తుంటుంది. బ్రిటిషు కాలంనాటి హిందూ వ్యతిరేక చట్టాలు, 21వ శతాబ్దంలో కూడా, హిందువుల నిర్లక్ష్యం కారణంగా కొనసాగుతున్నాయి.
ఇవన్నీ హిందువుల సామాజిక సాంస్కృతిక మానవహక్కుల ఉల్లంఘనే అని భారతీయులు అర్థం చేసుకోవాలి. హిందువులకి కూడా సమాన మానవహక్కులు ఉంటాయని భారతదేశంతో సహా ప్రపంచం అర్థంచేసుకుని, హిందువుల మానవహక్కుల పరిరక్షణకై కృషి చేయడం మంచిది.
పాకిస్థాన్ , బంగ్లాదేశ్ లో నివసిస్తున్న హిందువులకు మానవహక్కులు ఏవి? కాశ్మీరీ పండిట్ ల కు మానవ హక్కులు ఉండవా ?
ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. 1948 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి చేసిన ఒక తీర్మానంతో మానవ హక్కుల దినోత్సవానికి ప్రాముఖ్యత వచ్చింది. కానీ ఈ మానవహక్కుల పరిరక్షణ అంతటా జరుగుతోందా? మానవహక్కుల ఉల్లంఘనను యుఎన్ అరికట్టగలుగుతోందా అంటే సందేహమే. మన పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్లో మైనార్టీలుగా జీవనం సాగిస్తున్న హిందువులకు మానవహక్కులు అందని ద్రాక్ష అయ్యాయి.
ఇస్లామిక్ ఛాందస భావజాలంతో ఆ దేశాలు అక్కడి మైనారిటీల హక్కులను కాలరాస్తున్నాయి. అంతదాకా ఎందుకు మన దేశంలోనే కాశ్మీర్ లో పండిట్ ల హక్కులను , వాల్మీక మొదలగు హిందూ జాతుల హక్కు ల ను ఆర్టికల్ 370 కింద ఎంత దారుణాలు జరిగినాయొ అందరికీ తెలుసు అయినా సరే మన లిబరల్ మూకలు ఒక్క మాట మాట్లాడరు . పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకల అకృత్యాలు కశ్మీరీ పండితులకు నిలువనీడ లేకుండా చేస్తున్నాయి. ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి ఏడాది దాటిన క్రమంలో స్వస్థలాలకు తిరిగి చేరుకుంటున్న కశ్మీరీ పండితులను నిరాశ్రయులను చేసే కుట్రను దాయాది దేశం పాకిస్తాన్ అమలు చేస్తున్నది. కానీ మానవహక్కులంటూ గుండెలు బాదుకునే మేధావులు సొంత గడ్డపై హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న క్రూరత్వంపై స్పందించరు.
ఒక వైపు జమ్మూ కాశ్మీర్లో కశ్మీరీ పండితుల నుంచి మానవ హక్కులను దూరం చేస్తున్న పాకిస్తాన్ పాలకులు.. వారి దేశంలో మైనార్టీలుగా జీవిస్తున్న హిందువులపై కొనసాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘనకు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నది. హిందూ దేవాలయాలపై మెజార్టీ ముస్లిముల దాడులు నిత్యకృత్యంగా మారిపోయింది.
ఇటీవల హిందువులపై అక్కడి సర్వోన్నత న్యాయస్థానం మూడు కోట్ల రూపాయలకు పైగా విధించిన అపరాధ రుసుము అక్కడ సాగుతున్న వివక్షకు పరకాష్ట. దేవాలయంపై దాడి చేసిన ముస్లిము మూకలను వదిలి హిందువులపై అపరాధ రుసుము విధించడమే విచిత్రమైన విషయం. అంతేకాదు అఖిల పాకిస్తాన్ హిందూ మండలి చెల్లించే ఈ మూడు కోట్ల రూపాయలను ముస్లిం మూకలు ధ్వంసం చేసిన దేవాలయాల పునరుద్ధరణకు వినియోగించాలని కోర్టు చెప్పడం మరీ విచిత్రం.
బాధితుడి బాధను తీర్చడానికి వాడి జేబులో నుంచే పరిహారం ఇవ్వాలనే తీర్పు మైనార్టీ హిందువులపట్ల పాకిస్తాన్ ధోరణికి ఉదాహరణ. పాలకుల ప్రోద్బలంతో మెజార్టీ ముస్లిములు జరుపుతున్న అకృత్యాలు, బలవంతపు మత మార్పిడులతో.. మొదట్లో జనాభాపరంగా రెండంకెల్లో ఉన్న హిందువుల శాతం ప్రస్తుతం అత్యంత కనిష్టానికి పడిపోయిందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయినా సరే ఈ మానవ హక్కుల గురించి గప్పాలు కొట్టే ‘ ఉదారుణ’ భావజాలులకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు.
హిందువుల హక్కులను కాలరాయడంలో మరో పొరుగుదేశమైన బంగ్లాదేశ్ సైతం తక్కువేమీ తినలేదు. గడచిన 50 సంవత్సరాలుగా ఏదో ఒక సాకుతో మైనార్టీలుగా జీవిస్తున్న హిందువులపై అక్కడి ముస్లిము మూకలు దాడులు చేస్తూనే ఉన్నాయి. పాలకులు మారినా మైనార్టీ హిందువుల తలరాతలు మారడంలేదు. ఇటీవల విజయదశమి నవరాత్రుల సందర్భంగా హిందూ దేవాలయాలపై ముస్లిము మూకలు జరిపిన దాడి బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణమైనది.
మైనార్టీ హిందువుల పట్ల బంగ్లాదేశ్ పాలకుల ఉదాసీనత, మెజార్టీ ముస్లిములు చూపుతున్న వివక్ష, పాల్పడుతున్న అకృత్యాలు దేశ జనాభాలో హిందువుల శాతం గణనీయంగా పడిపోతున్నది. 50 ఏళ్ళ క్రితం బంగ్లాదేశ్ ఆవిర్భవించినప్పుడు దేశ జనాభాలో 30 శాతంగా ఉన్న హిందువులు ప్రస్తుతం తొమ్మిది శాతానికి పరిమితమయ్యారంటే వారిపై దాడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్ధమవుతుంది.
ప్రతి సంవత్సరం మొక్కుబడిగా మానవ హక్కుల దినోత్సవాన్ని జరిపినందువల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. మానవహక్కుల పరిరక్షణ గురించి తగు చర్యలు చేపట్టాలి. ఆ దిశగా ఐక్యరాజ్యసమితితో పాటుగా అంతర్జాతీయ సమాజం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– వీఎస్కె తెలంగాణ సౌజన్యంతో