Suryaa.co.in

Andhra Pradesh

క్రికెట్ బెట్టింగులు జోలికెళ్ళి జీవితాలు నాశనం చేసుకోకండి

– క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు, పందెం రాయుళ్లుపై ప్రత్యేక నిఘా
– బెట్టింగులకు పాల్పడినా, నిర్వహించినా కఠిన చర్యలు
– బెట్టింగ్ ముఠాల కార్యకలాపాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి
– క్రికెట్ బెట్టింగులు పాల్పడినా, సహకరించినా కఠిన శిక్షలు
– ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలాపాలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా

అమరావతి: అమాయక ప్రజలను యువతను లక్ష్యంగా చేసుకొని క్రికెట్ బెట్టింగ్ ద్వారా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని వారిని ప్రలోభ పెట్టి క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్న వారిని వదిలే ప్రసక్తే లేదని వారిని చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని డిజిపి హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు.

ఐపీఎల్ క్రికెట్ సీజన్ నేపథ్యంలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ బెట్టింగులు, బుకీల కదలికలపై ప్రత్యేక పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్రికెట్ బెట్టింగులు నిర్వహించే వ్యక్తుల సమగ్ర సమాచారం పోలీస్ శాఖ వద్ద ఉందని అన్నారు. వినోదం కోసమే క్రికెట్ చూడాలని, బెట్టింగుల వైపు ప్రజలు మొగ్గుచూపుకూడదని పిలుపునిచ్చారు.

అప్పులు చేసి బెట్టింగులు పెట్టి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకోవద్దు అన్నారు. బెట్టింగ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల పట్ల యువత మరియు విద్యార్థులు ఎక్కువుగా ఆకర్షితులు అవుతున్నారని వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా పెట్టాలని అన్నారు.

యువత బెట్టింగ్ రాయుళ్ళ వలలో పడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. క్రికెట్ బెట్టింగులు పాల్పడినా, సహకరించినా కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ తరహా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని వ్యవస్థీకృత నేరస్తులుగా పరిగణించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.

బెట్టింగులు జరుగుతున్నట్టు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బెట్టింగ్ ముతాల చేతిలో మోసపోయిన వాళ్ళు ఫిర్యాదు చేస్తే నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు చేపడతామన్నారు.

LEAVE A RESPONSE