-మొన్న పాతిక సీట్లు అనుకున్నాం… తమ పార్టీ అవి కూడా గెలిచేది కష్టమే
-సింహం ఎవరో ప్రజలకు తెలిసిపోయింది
-ఇది ఒక పార్టీకి వచ్చిన సమస్య కాదు… ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చిన ముప్పు
-బుద్ధిలేని వీళ్లా మన పాలకులు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
అనపర్తి అరాచక ఘటనతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి శుభం కార్డు పడినట్టేనని సుస్పష్టమైందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు తెలిపారు. మొన్నటి వరకు తమ పార్టీ పాతిక సీట్లలో విజయం సాధిస్తుందని అనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా కష్టమేనని అనిపిస్తోందన్నారు. అనపర్తి లో పోలీసులు ఒకరకంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు పై దాడి చేసినంత పని చేశారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి , పోలీసుల అఘాయిత్యాలు నిచ్చెన మెట్లుగా చేసుకొని చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్లారని కొనియాడారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రజలంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఇది ఒక పార్టీకి వచ్చిన సమస్య కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చిన ముప్పని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వాదులంతా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అనపర్తి ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు తో సహా, ఆ పార్టీ ముఖ్య నేతలు స్పందించాలని సూచించారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలను నిర్వహిస్తోందని , రేపు ఎవరైనా ఆ పార్టీ పెద్ద నాయకులు హాజరైనప్పుడు, జనం అధికంగా వస్తే వారికి ఇదే సమస్య తలెత్తనుందన్నారు. ఎవరికి వారు మనకెందుకులే అనుకుంటే రేపు మనకు ఇటువంటి సమస్యలే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. తనపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేసి, లాకప్ లో చిత్రహింసలకు గురిచేసి జగన్మోహన్ రెడ్డి ఆనందించినప్పుడే రాష్ట్రంలో ప్రభుత్వ అరాచకం మొదలయ్యిందన్నారు. తనని లాకప్ లో చిత్రహింసలు పెట్టినప్పుడు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించి… ఒక ఎంపీకే రక్షణ లేకపోతే, రేపు సామాన్యుల పరిస్థితి ఏమిటని?
ప్రజాస్వామ్యానికి జరగనున్న ప్రమాదాన్ని ముందే గ్రహించి, ప్రతీ ఒక్కరూ స్పందించాలని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న రోడ్ షోలకు అనూహ్య ప్రజాదరణ లభిస్తుండడం వల్లే రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవో నెంబర్ 1 తీసుకువచ్చిందని విమర్శించారు. అనపర్తి లో రోడ్డుపై పోలీసులు బైఠాయించి, లారీలు ట్రాక్టర్లను అడ్డుపెట్టి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ని అడ్డుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు తీరని మచ్చ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అప్రజా స్వామీక ధోరణిని అనపర్తి ప్రజలు తీవ్రంగా నిరసించారన్నారు. ఎక్కడైనా రోడ్డుపై ప్రజలు బైఠాయించి నిరసన తెలుపడం చూశామని, కానీ అనపర్తి లో మాత్రం పోలీసులే రోడ్డు కు అడ్డంగా బైఠాయించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అనపర్తి రోడ్ షోకు చంద్రబాబు నాయుడుకు తొలుత అనుమతి ఇచ్చిన పోలీసులు, ఆఖరి నిమిషంలో రద్దుచేసి చంద్రబాబు నాయుడు కాన్వాయ్ ని అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు రోడ్ షోలకు అశేష ప్రజాదరణ లభిస్తుండడం వల్ల ప్రభుత్వ పెద్దలు కంటగింపుతో ఈ నిర్ణయం తీసుకొని, ఆఖరి నిమిషంలో అనుమతి రద్దు చేసే విధంగా పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఉంటారన్నారు. అయినా పోలీసుల చర్యకు వెరవని చంద్రబాబు నాయుడు, 72 ఏళ్ల వయసులోనూ ఏడు కిలోమీటర్ల దూరం అలుపెరుగకుండా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరుల సెల్ ఫోన్ల లైట్ల వెలుతురులో నడుచుకుంటూ అనపర్తికి చేరుకోవడం అరుదైన ఘట్టమని అన్నారు. అనపర్తి లో సభా వేదికను పోలీసులు కూల్చివేయగా,నిచ్చెన ద్వారా స్కార్పియో వాహనం పైకి చేరుకొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారని తెలిపారు. సభా ప్రాంగణంలోనూ పోలీసులు విద్యుత్ సరఫరాను నిలిపివేయగా, సభికులు సెల్ ఫోన్ లైట్లను వెలిగించగా, ఆ వెలుతురులోనే తన ప్రసంగాన్ని పూర్తి చేశారన్నారు. పోలీసులు తనను పెట్టిన కష్టాలు , ప్రజలు పడుతున్న కష్టాలను వివరిస్తూ సాగిన చంద్రబాబు ప్రసంగానికి అపూర్వ స్పందన లభించిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
సింహం అంటారా?.. మరో సింహం అంటారా??
పరదాల చాటున, పోలీసుల మాటున బితుకు బితుకుమంటూ వచ్చేవారిని సింహం అంటారా?, మరి ఏదైనా అంటారా??, మరో సింహం అంటారా??? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. పోలీసులు ఎన్ని అవాంతరాలు కల్పించిన, వాహనంలో వెళ్లడానికి వీలు లేదని అడ్డంకులు సృష్టించిన, చీకటిలో ప్రజల తో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నడిచిన వారిని సింహం అంటారా? అని నిలదీశారు. తమ పార్టీ నాయకులు, మంత్రులు తరుచూ సింహం సింగిల్ గా వస్తుందని పేర్కొంటారని, ఇక ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనని తానే సింహం తో పోల్చుకున్నారని గుర్తు చేశారు. సింహాల ప్రస్తావన అనవసరం అయినప్పటికీ, అనపర్తి ఘటన ద్వారా ప్రజలకు అసలు సింహం ఎవరో తెలిసి పోయిందన్నారు. ఇక తనని తాను సింహంతో పోల్చుకున్న జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని ముసలోడంటూ ఎగతాళి చేసే ప్రయత్నం చేశారన్నారు. చీకటిలో ఏడు కిలోమీటర్లు అలుపెరగకుండా నడిచిన చంద్రబాబు నాయుడు వృద్ధుడా?, కొబ్బరికాయ కొట్టడానికి కూడా నడుము వంగని జగన్మోహన్ రెడ్డి వృద్ధుడా?? అనేది ప్రజలే తేల్చాలన్నారు. గంగ పూర్తి చంద్రముఖి గా మారిందని చంద్రముఖి సినిమాలో హీరో రజనీకాంత్ చెప్పిన డైలాగు మాదిరిగానే ముఖ్యమంత్రి ని ఉద్దేశించి ప్రతిపక్ష నేతలు తరచూ చేసే వ్యాఖ్యలు నిజమేనని నిరూపించినట్లయిందని అన్నారు. అనపర్తి లో టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారని, ఈ దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి వెళ్లి చంద్రబాబు నాయుడు పరామర్శించడమే కాకుండా వారిలో భరోసా నింపే ప్రయత్నం చేశారన్నారు.
దండి మార్చ్ స్ఫూర్తితో పోలీసు నిరాకరణోద్యమం ప్రారంభించిన చంద్రబాబు
మహాత్మా గాంధీ దండి మార్చ్ ఉద్యమ స్ఫూర్తితో అనపర్తి లో చంద్రబాబు నాయుడు పోలీసు నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం, అటువంటి పరిస్థితులు రాష్ట్రంలో తలెత్తడం దురదృష్టకరమని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. న్యాయస్థానాలు జీవో నెంబర్ 1 ని కొట్టివేయడం ఖాయమన్నారు. మాజీ మంత్రి, దళిత నాయకుడైన జవహర్ ను పోలీసులు స్టేషన్లో బలవంతంగా నేలపై కూర్చోబెట్టి అవమానించడం దారుణమని మండిపడ్డారు. అనపర్తి ఘటన అనంతరం పోలీసులు చంద్రబాబు నాయుడు పై, మాజీమంత్రి జవహర్ పై, అనపర్తి టిడిపి ఇన్చార్జి రామకృష్ణారెడ్డి లపై కేసులు నమోదు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. ముందుగానే పోలీసుల అనుమతి తీసుకొని సభ నిర్వహించినప్పటికీ, ఆఖరి నిమిషంలో అనుమతిని రద్దు చేసిన పోలీసులే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు తమ నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్వహిస్తున్న సభలు సమావేశాలు అంటే భయం లేకపోతే ఎందుకిలా వేధిస్తున్నారో చెప్పాలని ప్రభుత్వ పెద్దలను నిలదీశారు.
చంద్రబాబు సభలను అడ్డుకోవడం, యువగళం పాదయాత్ర కు హాజరైన ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న లోకేష్ వద్ద నుంచి మైకు లాక్కోవడం, స్టూలు గుంజుకోవడం లాంటి చిలిపి చిల్లర పనులను ప్రభుత్వ పెద్దలు నిరాశ నిస్సృహాలకు లోనై చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, త్వరలోనే రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయని చెప్పారు. సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయలేని ప్రభుత్వం, ప్రచార ఆర్భాటాన్ని మాత్రం పతాక స్థాయిలో చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలపై విపరీతమైన పన్నుల భారాన్ని మోపుతూ, ప్రజలకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.
బుగ్గన మానసిక పరిస్థితి పై అనుమానం
రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మానసిక ఆరోగ్య పరిస్థితిపై తనకు అనుమానంగా ఉందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు. బెంగళూరులో జరిగిన పారిశ్రామికవేత్తల సదస్సులో రాష్ట్ర ఏకైక రాజధాని విశాఖపట్నమని పేర్కొన్న బుగ్గన, కర్నూల్ లో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేస్తామని, గుంటూరులో ఒక దఫా శాసనసభ సమావేశాలను నిర్వహిస్తామని పేర్కొన్న విషయం తెలిసిందేనని గుర్తు చేశారు. తాజాగా చెన్నైలో మూడు రాజధానుల బిల్లు వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించడం పరిశీలిస్తే, ఆయన మానసిక పరిస్థితి పై ఆందోళన కలుగుతోందన్నారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నామని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి, సుప్రీంకోర్టులోనూ రాష్ట్ర ప్రభుత్వం అదే విషయాన్ని చెప్పిందన్నారు. బుగ్గన లాంటి వ్యక్తులు ఉంటారనే , అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెట్టే అర్హత రాష్ట్ర ప్రభుత్వానికి లేదని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యలపై, సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలన్నారు. మంత్రులంతా రాజధాని గురించే తమ నోటికొచ్చినట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. అనకాపల్లిలో సంక్షేమ హాస్టల్ విద్యార్థినీలు స్నానాలు చేసుకోవడానికి బాత్రూంలు లేవని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తున్నారని ఇదేనా మనం చేసిన అభివృద్ధి అంటూ ప్రశ్నించారు.