Home » ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు

ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటు

-స్వర్ణకారులకు లోకేష్ హామీ
-ప్రజాదర్బార్ కు పెద్దఎత్తున తరలివచ్చిన ప్రజలు

అమరావతి: సమస్యల పరిష్కారం కోసం సామాన్యుల నుంచి ఉద్యోగులు, యువకులు, వివిధ సంఘాల ప్రతినిధులు “ప్రజాదర్బార్” కు తరలివచ్చారు. ఉండవల్లిలో నివాసంలో విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ను నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాదర్బార్ కార్యక్రమానికి పెద్దఎత్తున తరలివచ్చారు. అందరి సమస్యలను ఓపిగ్గా విన్న యువనేత ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరితో పాటు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న సామాన్య ప్రజలు “ప్రజాదర్బార్” కార్యక్రమం ద్వారా యువనేత తమకు అండగా నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి విన్నపాలను స్వీకరించి, నారా లోకేష్ ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి చొరవ తీసుకోవడం ప్రజా ప్రభుత్వ పాలనకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

6 నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్

ఆరు నెలల్లో స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటుచేసి కార్మికులను ఆదుకుంటామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటుచేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన లక్ష్మీ నరసింహా గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు యువనేతను కలిసి విజ్ఞప్తి చేశారు. నారా లోకేష్ చేతుల మీదుగానే ఈ సొసైటీ ఏర్పాటైంది. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. స్వర్ణకార కార్పోరేషన్ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలు ఏవిధంగా ఉండాలి, స్వర్ణకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి వివరాలు సమర్పించాలని కోరారు. మంగళగిరిలో స్వర్ణకార వృత్తిపై ఆధారపడి అనేక మంది జీవనం సాగిస్తున్నారని, మంగళగిరిని గోల్డ్ హబ్ గా రూపొందిస్తామనే హామీకి కట్టుబడి ఉన్నామని, ఆధునిక సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

ఆర్కే రైట్ హ్యాండ్ పై చర్యలు తీసుకోండి

ఉండవల్లి పంచాయతీలో మహిళా పారిశుద్ధ్య కార్మికులపై లైంగిక వేధింపులతో పాటు ఉద్యోగులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్న సూపర్ వైజర్ పిల్లి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైట్ హ్యాండ్ గా పేరుగాంచిన డి.రాంబాబును విధుల నుంచి తొలగించాలని మహిళా కార్మికులు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. మహిళా కార్మికులపై ఇష్టానుసారంగా వ్యక్తిగత ధూషణలకు దిగడంతో పాటు వేతనం తగ్గించారని ఫిర్యాదు చేశారు. తమ వేతనాలు పెంచాలని, రైతు కూలీ పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని యువనేతను కోరారు. మహిళా పారిశుద్ధ్య కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.

“ప్రజాదర్బార్” లో వినతుల వెల్లువ

గత వైసీపీ ప్రభుత్వం తొలగించిన సీఆర్డీయే పెన్షన్ ను పునరుద్ధరించాలని మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెంకు చెందిన తాడిబోయిన నాగరాజు నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం పొందుగలలో తనకు వంశపారపర్యంగా వచ్చిన వ్యవసాయ భూమి, నివాస స్థలాన్ని తన బంధువులు కబ్జా చేశారని, వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని మంగళగిరి చెందిన మల్లెల రామారావు కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె వైద్యానికి ఆర్థిక సాయం చేయాలని మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన ఎమ్.సుజాత కోరారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని పాత మంగళగిరికి చెందిన నాగ భవాని విజ్ఞప్తి చేశారు.

నూతనంగా ఏర్పాటుచేసిన మెడికల్ కాలేజీలలో వైసీపీ ప్రభుత్వం మేనేజ్ మెంట్ కోటా కింద 50శాతం ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేసేలా జీవో నెం.107, 108 జారీ చేశారని, దీని వల్ల అర్హులైన పేద, మధ్య తరగతి విద్యార్థులు నష్టపోతుతున్నారని, తక్షణమే ఆయా జీవోలను విద్యార్థులు, తల్లిదండ్రులు కోరారు. భర్త లేని తనకు ఇల్లు మంజురు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎస్.పద్మజ కోరారు. ఏపీ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, టెక్నికల్ బోటు సిబ్బందిని వైసీపీ ప్రభుత్వం విధుల నుంచి తొలగించందని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ కోస్టల్ సెక్యురిటీ పోలీస్ బోట్ క్రూస్ ఉద్యోగులు కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.

Leave a Reply