– ఆఫీసులో కూర్చుని డివిజన్లు మారుస్తారా?
– లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
– సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం మరిన్ని ఉద్యమాలు చేయాలి
– లష్కర్ జిల్లా సాధన సమితి దీక్షలో మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: ఎంతో చరిత్ర కలిగిన సికింద్రాబాద్ ప్రాంతాన్ని లష్కర్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్ లో లష్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో లష్కర్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని చేపట్టిన దీక్షలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్ రెండు మున్సిపాలిటీ లుగా ఉండేవని, కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, నగరం విస్తరించడంతో 100 డివిజన్ లతో గ్రేటర్ హైదరాబాద్ గా ఏర్పడిందని తెలిపారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో 150 డివిజన్ లుగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ORR లోపల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ లు, మున్సిపాలిటీ లను విలీనం చేసి 300 డివిజన్ లు చేసిందని చెప్పారు.
మూడు కార్పొరేషన్ లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నందున లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్న ఈ ప్రాంత ప్రజల డిమాండ్ న్యాయమైనదని, ఆ కోరిక ను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ప్రాంతం కు గతంలో లష్కర్ అనే పేరు ఉండేదని, 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఘనంగా సంబురాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్పొరేషన్ గా ఏర్పడితే ఈ ప్రాంత ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
కార్పొరేషన్ ఏర్పాటు కోసం చేసే పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. దీక్ష చేస్తున్న వారిని ఆయన అభినందించారు. కార్పొరేషన్ ఏర్పాటయ్యే వరకు పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిధులు అందరికీ ఈ పోరాటంలో కలుపుకుపోవాలని అన్నారు. ఇప్పటికే లష్కర్ జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ సమితి సభ్యులు అనేక కార్యక్రమాలు చేపట్టడంతో పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం లష్కర్ జిల్లా, కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డివిజన్ ల ఏర్పాటు శాస్త్రీయంగా జరగలేదని, ఆఫీసుల్లో కూర్చొని డివిజన్ లను ఏర్పాటు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. మేయర్ కే తెలియకుండా డివిజన్ లను ఏర్పాటు చేయడం బాధాకరం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, బన్సీలాల్ పేట డివిజన్ కార్పొరేటర్ కుర్మ హేమలత, నాయకులు MN శ్రీనివాస్, ఎడ్ల హరిబాబు యాదవ్, నరేందర్ నాయి, ముఠా జయసింహ, ఏసూరి మహేష్, సమితి ప్రధాన కార్యదర్శి సాదం బాలరాజ్ యాదవ్, బాబురావు, శైలేందర్, హైదరాబాద్ నగర అంబులెన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ తదితరులు ఉన్నారు.