-భాజపా ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి
విజయవాడ: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నాయకురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దేశ సేవకు ప్రతి బీజేపీ కార్యకర్త పునరంకితం కావాలని పిలుపిచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. ఉత్తరప్రదేశ్లో రెండో సారి అధికారం ఇవ్వడం అంటే బీజేపీ పాలనపై ప్రజలకు ఉన్న నమ్మకమని అన్నారు.
మోదీ ప్రధానిగా ఎనిమిదేళ్ళ కాలంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, దేశంలో పేదల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ప్రతి కార్యకర్త కూడా పార్టీ గెలుపు కోసం పని చేయాలన్నారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రకాశ్’ సూత్రంతో ముందుకు వెళుతున్నామన్నారు. రాష్ట్రంలో అధికార దాహం పెరిగిపోయిందని, సేవ చేయడం కన్నా అధికారమే లక్ష్యంగా పని చేస్తున్నారని పురంధేశ్వరి విమర్శించారు. రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలు ఎదురు చుస్తున్నారన్నారు.
పెట్రోల్, డీజిల్ ఛార్జీల విషయంలో కేంద్రం తన వంతు బాధ్యతగా తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విషయంలో ఎందుకు తగ్గించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఇప్పుడు పెట్రోల్ రేట్లు పెరిగాయన్నారు. విశాఖ ఉక్కు విషయంలో వైసీపీ నాయకులు బీజేపీ నేతలను తప్పు పట్టే అర్హత లేదన్నారు. మిత్ర పక్షంగా పవన్ కళ్యాణ్ మాతో చర్చిస్తే మేము కూడా స్పందిస్తామన్నారు.
ఏపీలో కార్యక్రమాలు వేరు అయినా బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతుందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ప్రజల ఆకాంక్షలను కేంద్రం పెద్దలకు వివరిస్తామన్నారు. వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని విమర్శించారు. తమ ప్రణాళికలు తమకు ఉన్నాయని, వాటికి అనుగుణంగా పని చేస్తామని పురంధేశ్వరి స్పష్టం చేశారు.