– సముద్రంలోకి వృథాగా పోయే నీటితో రిజర్వాయర్లు, చెరువులు నింపండి
– ఆగస్టు 31న కుప్పం బ్రాంచ్ కెనాల్ కు హంద్రీనీవా నీళ్లు
– ప్రాజెక్టుల్లో నీటి నిల్వలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి: సముద్రంలోకి వృథాగా పోతున్న నీటితో రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులకు ఈ నీటిని తరలించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో గురువారం సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు సమర్ధ నీటి నిర్వహణపై జల వనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతీ నీటి బొట్టును సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 771 టీఎంసీల మేర నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే మధ్య స్థాయి ప్రాజెక్టుల్లో 43 టీఎంసీలు, చిన్న నీటి చెరువుల్లో 67 టీఎంసీల మేర నీరు నిల్వ ఉందని తెలిపారు. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా రిజర్వాయర్లు, చెరువుల్లో 882 టీఎంసీల మేర నీరు ఉన్నట్టు వివరించారు. ప్రస్తుతం కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహాలు కొనసాగుతున్నందున రాయలసీమలోని ప్రాజెక్టులకు నీటిని తరలించే అంశంపై సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
నదుల్లోకి ఇంకా ఎన్ని రోజుల పాటు ప్రవాహాలు కొనసాగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి ఆరా తీశారు. సోమశిల, కండలేరు, గండికోట, బ్రహ్మం సాగర్, పైడిపాలెం తదితర రిజర్వాయర్లన్నీ నింపాలని సీఎం ఆదేశించారు. రాయలసీమ ప్రాంతంలోని రిజర్వాయర్లు, చెరువుల్లోకి ఇంకా 132 టీఎంసీల మేర నీటిని నింపేందుకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సగటున ప్రతీ రోజూ 4 టీఎంసీల మేర నీటిని తరలిస్తే ఎన్ని ప్రాజెక్టులను నింపే అవకాశం ఉందో చూడాలని సీఎం సూచించారు. వీలైనంత మేర నీటిని తరలించి తుంగభద్ర, పెన్నా రివర్ బేసిన్లలో ఉన్న రిజర్వాయర్లను నింపాలన్నారు.
గండికోట, మైలవరం, పీఏబీఆర్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల నుంచి కాలువలకు నీటిని విడుదల చేసి మరోవైపు వీటిని నింపాలని సూచిచారు. పోతిరెడ్డిపాడు, మచ్చుమర్రి, హంద్రీనీవా నుంచి జీడిపల్లి రిజర్వాయర్ కు కూడా నీటిని తరలించుకునే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నీటిని తరలించాలని స్పష్టం చేశారు. వీలైనంత వరకూ వ్యయం లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని తరలించాలని సీఎం అధికారులకు సూచనలు చేశారు.
చెరువులతో పాటు భూగర్భజలాలు కూడా నిండాలి
రాష్ట్రంలోని 43 వేల చెరువులను నింపటం ద్వారా భూగర్భజలాలను కూడా రీఛార్జి చేయవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 1 మీటరు మేర భూగర్భజలాలు పెరిగితే 120 టీఎంసీల నీరు నిల్వ చేసినట్టేనని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున భూగర్భజలాలు 9.8 మీటర్ల లోతున ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించి మరో 5 మీటర్ల మేర నిల్వలు పెరిగేలా చర్యలు తీసుకుంటే 600 టీఎంసీల నీరు అందుబాటులోకి వస్తుందని సీఎం స్పష్టం చేశారు.
రుతుపవనాల సీజన్ సాధారణ వర్షపాతం అంచనాలు ఉన్నందున అన్ని రిజర్వాయర్లలో 1300 టీఎంసీల మేర నీరు నిల్వ అవుతుందన్నారు. తద్వారా ఖరీఫ్, రబీ సీజన్లకు పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుందని సీఎం అన్నారు. గ్రావిటీతో పాటు మొబైల్ లిఫ్టుల ద్వారా ఎన్ని చెరువులు నింపవచ్చన్న అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. బ్రహ్మం సాగర్, గోరకల్లు, మారాల, చెర్లోపల్లి, పత్తికొండ ప్రాజెక్టులకు దిగువన ఉన్న అన్ని చెరువుల్ని తక్షణం నింపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
మరోవైపు రిజర్వాయర్లు, చెరువులు నింపే అంశంపై సాగునీటి సంఘాలను క్రియాశీలకం చేయాలని సీఎం స్పష్టం చేశారు. మొత్తంగా ఈ సీజన్ లో చివరి ఆయకట్టు వరకూ ఎంత మేర నీరు తీసుకెళ్లగలం అనేది ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. అలాగే చెరువులు, ప్రాజెక్టుల మరమ్మతులను కూడా వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ కు ఆగస్ట్ 31న నీళ్లు తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సమీక్షలో మంత్రి నిమ్మల రామానాయుడు, ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు