Suryaa.co.in

Andhra Pradesh

నష్టపోయిన ప్రతి రైతుని ఆదుకుంటా: సీఎం జగన్

-నాలుగైదు రోజుల్లో నష్టపరిహారం అందేలా చర్యలు
-తుపాను ప్రభావిత తిరుపతి జిల్లాల్లో సీఎం వైఎస్ జగన్ క్షేత్రస్ధాయి పర్యటన
-బాధితులు, రైతులను నేరుగా కలిసి వారితో మాట్లాడి భరోసా కల్పించిన సీఎం జగన్

తిరుపతి: తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన సీఎం వైఎస్ జగన్ ముందుగా తిరుపతి చేరుకున్నారు, అక్కడి నుంచి హెలికాఫ్టర్ ఏరియల్ వ్యూలో తుపాను నష్టంపై తిరుపతి జిల్లా కలెక్టర్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు, కోట మండలం విద్యానగర్ కు చేరుకున్న సీఎంకు అక్కడి సమీప గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.

విద్యానగర్ హెలీప్యాడ్ నుంచి నేరుగా బాలిరెడ్డిపాళెం-గంగన్నపాళెం మధ్యలో స్వర్ణముఖి నదికి గండిపడిన ప్రాంతాలను పరిశీలించారు, నష్టపోయిన పంటలను పరిశీలించారు, రైతుల ఆవేదనను స్వయంగా విని చలించిపోయారు, అక్కడి నుంచి బాలిరెడ్డిపాళెం చేరుకుని తుపాను బాధితులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. అందరితో మాట్లాడి వారి సమస్యలు విన్న అనంతరం హెలీప్యాడ్ కు వెళుతూ కూడా మార్గమధ్యంలో పంట నష్టాన్ని పరిశీలించారు. నష్టపోయిన అన్నదాతలకు ఓదార్పునిచ్చారు. అనంతరం సీఎం జగన్ ఏమన్నారంటే…

ఈ ప్రాంతంలో కురిసిన వర్షాలు, జిల్లాలో మొత్తం యావరేజ్తో పోల్చుకుంటే కూడా అందులో సగం ఈ నాలుగైదు రోజుల్లోనే కురిశాయి. దాదాపు 40-60 సెంటీమీటర్ల వర్షం వచ్చిన పరిస్థితులు. మనందరికీ జరిగిన నష్టం, వచ్చిన కష్టం ఎవరైనా చెప్పడానికి కూడా సాధ్యపడనంత బాధ కలిగించే అంశాలే. దాదాపు ఈ ప్రాంతంలో 92 రిలీఫ్ క్యాంపులను పెట్టాం. 8,364 మందిని రిలీఫ్ క్యాంపులకు షిప్ట్ చేయడం జరిగింది. దాదాపు 60 వేల మందికి పైచిలుకు, వారికి రేషన్ బియ్యం 25 కేజీలు, కందిపప్పు, పామాయిల్ లీటరు, కేజీ ఆనియన్లు, బంగాళాదుంపలు.. ఇవన్నీ ఇవ్వడం జరిగిందని సీఎం జగన్ పేర్కొన్నారు.

సచివాలయం, వాలంటీర్ వ్యవస్థతో ఎంతో మేలు
ఏ రాష్ట్రంలో లేని వ్యవస్థ మన రాష్ట్రంలో ఒకటి ఉంది. అది వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ. ఈ వ్యవస్థ వల్ల ఎవరికి ఎక్కడ ఏ నష్టం జరిగినా ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రతి ఒక్కరికీ భరోసా ఇస్తూ చెబుతున్నా. ఏ ఒక్కరికీ నష్టం జరగదు. నాకు నష్టం జరిగినా ఎదుటివాడికి వచ్చింది, నాకు రాలేదని అనుకోవాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరికీ మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది. డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

62 వేల కుటుంబాలకు రేషన్ డిస్ట్రిబ్యూషన్ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ప్రతి ఇంటికీ రూ.2,500 డబ్బులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దాని వల్ల మీ ఇళ్లలో నీళ్లు వచ్చిన వారికి, సామాన్లకు నష్టం జరిగిన వారికి, ఇబ్బందులు పడిన పరిస్థితుల్లో ఈ డబ్బుతో కాస్తో కూస్తో ఉపశమనం కలుగుతుంది. ఈరోజు మొదలు పెడితే మరో నాలుగు రోజుల్లో ప్రతి ఇంటికీ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది వచ్చి ప్రతి ఇంట్లోనూ రూ.2,500 డబ్బులిచ్చే కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు.

రైతులను ఆదుకుంటా..
పంట నష్టపోయిన పరిస్థితుల్లో ఏ ఒక్కరు ఉన్నా భయపడాల్సిన, బాధపడాల్సిన అవసరం లేదు. ఈ జిల్లాల్లో స్టాండింగ్ క్రాప్ లేదు కాబట్టి కాస్తో కూస్తో ఉపశమనం. ఎవరెవరు పంట వేశారో, నష్టపోయారో 80 శాతం సబ్సిడీతో సీడ్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. నాలుగైదు రోజుల్లో అన్నీ దగ్గరుండి కలెక్టర్లు పూర్తి చేశారు. ఈరోజు నుంచి వారం పట్టొచ్చు. ప్రతి ఒక్కరికీ జరగాల్సినమంచి జరుగుతుంది. కరెంటు చాలా ఫాస్ట్గా రీస్టోర్ చేశారు. యంత్రాంగం అంతా ఇక్కడే పని చేస్తున్నారు. రెట్టించిన వేగంతో పని చేస్తున్నారు. టీమ్స్ ను మొబిలైజ్ చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కరెంటు రీస్టోర్ అయ్యింది.

కొన్ని కాలనీల్లో రీస్టోర్ కాని పరిస్థితి ఉంటే అవన్నీ డీటెయిల్స్ తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు వాలంటీర్ల ద్వారా రీస్టోర్ అయ్యిందా అనే డీటెయిల్స్ తీసుకొని ప్రతి ఒక్కరికీ ఆ సమస్య లేకుండా చేస్తారు. అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీకు తోడుగా ఉంటుందని మరోసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి రాకముందు స్వర్ణముఖిలో జరిగిన బ్రీచ్ కారణంగా ఎలాంటి నష్టం జరిగిందో చూశాను. దానికి పర్మినెంట్ సొల్యూషన్ వెతకాలని చెప్పాను. హైలెవల్ బ్రిడ్జి కడితే బాగుంటుందని చెప్పారు. దాని కోసం రూ.30 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. హైలెవల్ బ్రిడ్జిని శాంక్షన్ చేస్తున్నా.

రోడ్లు రిపేర్ చేసే కార్యక్రమాలు, టెంపరరీ పనులన్నీ మొదలు పెట్టి పునరుద్ధరణకు శ్రీకారం చుడతాం. రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్, ఆర్అండ్బీ రోడ్లు, చిన్న చిన్న ట్యాంకుల రిపేరీ కోసం రూ.32 కోట్ల ప్రపోజల్స్ వచ్చాయి. యుద్ధ ప్రాతిపదికన మొదలు పెట్టించే కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ప్రభుత్వం మీది అన్నది గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికైనా మంచే జరుగుతుంది తప్ప.. చెడు అనేది ఎప్పుడూ జరగదు. ఏ చిన్న సమస్య అయినా, వాళ్లకు రావాల్సింది రాని పరిస్థితి ఎక్కడైనా ఎవరికైనా ఉందంటే జగనన్నకు చెబుదాం 1902కు ఫోన్ కొట్టండి.. నా ఆఫీస్కే ఫోన్ వస్తుంది. అందరికీ అందించే కార్యక్రమం కలెక్టర్ బాధ్యతలు తీసుకుంటారు అని సీఎం జగన్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE