Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి హామీ నెరవేరుస్తా… వెనుకడుగు వేయను

– అభివృద్ధితో చిత్తూరు ప్రజల రుణం తీర్చుకుంటా
– బంగారు పాళ్యంలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభించిన మంత్రి లోకేష్

బంగారుపాళ్యం: యువ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తానని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. యువగళం 100 కి.మీ. పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాబోయే 5 ఏళ్ళలో చిత్తూరు జిల్లా సమగ్రాభివృద్ధి చేసి ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని అన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేనని అన్నారు.

గత ఏడాది జనవరి 27వతేదీన కుప్పం శ్రీ వరదరాజస్వామి పాదాల చెంతనుంచి నేను ప్రారంభించిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన విషయం మీకందరికీ తెలుసు. 11 ఉమ్మడి జిల్లాలు, 97 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 2200 గ్రామాలను స్పృశిస్తూ 3132 కి.మీ.ల మేర యువగళం పాదయాత్ర సాగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గతంలో మరెవరూ చేయని విధంగా 14 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ 45 రోజులపాటు 577 కి.మీ.ల మేర కొనసాగిన యువగళం పాదయాత్ర రికార్డు సృష్టించింది. యువగళాన్ని అడ్డుకునేందుకు ఆ రోజున ఇదే బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో మీరంతా కళ్లారా చూశారు.

నా పాదయాత్రను అడ్డుకునేందుకు జిఓ.1 విడుదల చేసి, ఇదే బంగారుపాళ్యంలో నా ప్రచారరథాన్ని నాటి పోలీసులు అడ్డుకుని నా గొంతునొక్కాలని విఫలప్రయత్నం చేశారు. కానీ, యువగళం అన్నది నా ఒక్కడి గొంతు కాదు… 5 కోట్లమంది ప్రజల గొంతుక అని వారికి తర్వాత అర్థమైంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళాన్ని ఆపడం వారి తరం కాలేదు. పాదయాత్ర సమయంలో ప్రతి 100 కి.మీ.లకు ఒక అభివృద్ధి కార్యక్రమానికి మైలురాయివేసి, అధికారంలోకి వచ్చాక నెరవేర్చాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నాను. అందులో భాగంగా యువగళం పాదయాత్ర 8వ రోజు (2023 ఫిబ్రవరి 3)న బంగారుపాళ్యంలో 100 కి.మీ.లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇక్కడ తొలి మైలురాయిని ఆవిష్కరించాను.

ఈ ప్రాంతంలో డ‌యాల‌సిస్ కేంద్రం అవ‌స‌రం ఉంద‌ని స్థానికుల చెప్పిన మీదట ప్రభుత్వ ఆస్పత్రిలో డ‌యాల‌సిస్ కేంద్రం ఏర్పాటు చేస్తానని ఆనాడు హామీ ఇచ్చాను. పాదయాత్ర సమయంలో మీరు నాపై చూపిన అభిమానానికి రుణం తీర్చుకోవడానికి ఈరోజు చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంలో మంత్రిగా మీ ముందుకువచ్చాను. బంగారుపాళ్యం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నారు. త‌ర‌చూ డ‌యాల‌సిస్ కోసం దూర‌ప్రాంతాల‌కు వెళ్లడానికి డ‌బ్బు, స‌మ‌యం ఖ‌ర్చవుతోంది.

ప్రైవేట్ డయాలసిస్ సెంట‌ర్లకు వెళ్లి వేలు వెచ్చించి డ‌యాల‌సిస్ చేయించుకోవ‌డం ఇక్కడి పేదల‌కు త‌ల‌కుమించిన భారంగా మారింది. పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోపే ఈరోజున బంగారుపాళ్యంలో డయాలసిస్ సెంటర్ ను ప్రారంభిస్తున్నాను. ఈ డ‌యాల‌సిస్ కేంద్రం ఏర్పాటుతో కిడ్నీబాధితులు వ్యయ‌ప్రయాస‌ల‌ కోర్చి దూర‌ప్రాంతాల‌కు వెళ్లే బాధ త‌ప్పుతుంది. త‌మ ఊళ్లోనే ఉచితంగా డ‌యాల‌సిస్ చేయించుకునే అవ‌కాశం దొరుకుతుంది. యువగళం సందర్భంగా కుటుంబసభ్యుడి మాదిరిగా నాపై అభిమానాన్ని చూపి, ఈరోజు రాష్ట్రప్రజలకు సేవ చేసుకునే అవకాశమిచ్చిన ప్రజలందరికీ మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.

గత స్మృతులను నెమరు వేసుకున్న లోకేష్
యువగళం పాదయాత్ర బంగారు పాళ్యంలో 100 కి.మీ. చేరుకున్న సమయంలో తాను ఆవిష్కరించిన శిలాఫలకం దగ్గర లోకేష్ సెల్ఫీ దిగారు. అభిమానులు తనను ఆపిన బంగారుపాళ్యం సర్కిల్లో ఆగి స్థానికులతో మాట్లాడి పాదయాత్రలో జరిగిన ఘటనలు గుర్తు చేసుకున్నారు. ఆ రోజున పోలీసులు మైకు లాగేయడంతో అప్పుడు తాను మాట్లాడిన భవనం ముందు సెల్ఫీ దిగారు.

ప్రజారోగ్యానికి పెద్దపీట
రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. బంగారుపాళ్యం కొత్తగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో రెడ్ క్రాస్ ఆధ్వర్యాన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. తర్వాత ఆసుపత్రి ఆవరణలో మంత్రి లోకేష్ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE