– సోనియా, రాహుల్ గాంధీ నిజాయితీతో ఉన్నారు
– కావాలనే ప్రతిపక్షాల దుష్ప్రచారం
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్
విజయవాడ : నేషనల్ హెరాల్డ్ కేసు నమోదు ద్వారా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, యువ నేత రాహుల్ గాంధీ పై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిజాయితీగా ఉన్నా మతోన్మాద శక్తులు వారిపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కేసులు నమోదు చేసినా వారిని ఏమీ చేయలేరని, వారి నిజాయితీ తెలుస్తుందని స్పష్టం చేశారు. శనివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
2002 నుంచి 2011 వరకు పదేళ్ళలో 100 వాయిదాలలో చెల్లించేలా రూ.90 కోట్ల ను ఋణము రూపేణా ఇచ్చిందని, అందులో రూ.67కోట్లను నేషనల్ హెరాల్డ్ ఉద్యోగుల జీతాలకు, వాలంటరీ రిటైర్మెంట్ కోసం ఖర్చు చేయడం జరిగిందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణను శైలజనాథ్ కొట్టి పారేశారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్గాంధీ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు దాఖలు చేయడమే బూటకమని అన్నారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్లో ఆరోపించడం అసంబద్ధమన్నారు.