– మీ సక్కదనం చూసే రైతులు పక్కనపెట్టారు
– మాది రైతు ప్రభుత్వం.. రైతేరాజు మా నినాదం
– యూరియా పారదర్శకత కోసమే యాప్
– కేసీఆర్, బీఆర్ఎస్పై విరుచుకుపడిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న యూరియా పంపిణీ, ఎరువుల కోసం క్యూ లైన్లు, రైతు సమస్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విరుచుకుపడ్డారు. ‘‘మీరు రైతుద్రోహులు. కాబట్టే మిమ్మల్ని రైతులు పక్కన కూర్చోబెట్టారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా ఉన్నట్లుంది మీ వ్యవహామ’’ని దుయ్యబట్టారు.
తుమ్మల ఇంకా ఏమన్నారంటే…మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలోనే మేము తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో రైతు ప్రభుత్వం అనే పేరు తెచ్చుకుంది. యూరియా సరఫరాలో మా ప్రభుత్వం తీసుకురాదలుచుకున్న యాప్ అనేది కేవలం రైతుల సమయాన్ని ఆదా చేయాలనే సదుద్ధేశ్యంతో మాత్రమే. “పచ్చకామర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు” రైతులను మోసం చేయాలనే ఉద్దేశంతో ఉండే వారికి మేము చేసే మంచి పని కూడా మోసంలాగే కనిపిస్తుంది.
పదేళ్ళు అధికారంలో ఉన్నామని చెప్పుకొనే వారికి యూరియా ఎవరిస్తారు ? ఎక్కడి నుండి వస్తుంది ఎలా వస్తుంది అని తెలియక మాట్లాడుతున్నారో లేక ఎప్పటిలాగే వాళ్ళ స్వార్ధరాజకీయాల కోసం మాట్లాడుతున్నారో తెలుస్తుంది. మొదటి రెండు పంటకాలలలో యూరియా సరఫరాలో ఆటంకాలు లేకుండా చేసిన మాప్రభుత్వం.. 3 వ పంటకాలంలో కేంద్రం నుండి కేటాయింపులు అనుకొన్న సమయానికి రాకపోవడంలో సరఫరాలో ఇబ్బందులు ఏర్పడిన మాట వాస్తవం.
వానాకాలం 2024 వినియోగం 9.66 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, 2025 లో ఇంతకంటే అధికంగా13,000 మెట్రిక్ టన్నులు అనగా 9.79 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సరిపోయేంత యూరియా అందుబాటులో ఉన్నప్పటికి, ప్రతిపక్ష పార్టీ నాయకులు రైతులను మరింత భయపెట్టే విధంగా మాట్లాడి, రైతులు యూరియా కోసం ఒకేసారి కొనుగోళ్ల కోసం వచ్చే విధంగా చేశారు.
అంతేకాకుండా కొందరు యూరియాను పక్కదారి పట్టించినట్టు మా దృష్టికి వచ్చింది. గుడ్డు మీద ఈకలు పీకే స్వభావం మీరు ఈ మోసాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించే గ్రామీణ ప్రజలు మరొక్కసారి మిమ్మల్ని తిరస్కరించారు.
యూరియా పక్కదారి పట్టకుండా, రైతులు క్యూ లైన్లలో వారి సమయాన్ని వృధా చేసుకొకుండా, పారదర్శకంగా అమ్మకాలు జరగాలనే ఉద్దేశ్యంతోనే మా ప్రభుత్వం యాప్ ని తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నాయకులు కావాలనే యాప్ మీద అనుమానాలు రేకెత్తిస్తు మాట్లాడుతుంది. ఇప్పటికే కిసాన్ కపాస్ యాప్ ద్వారా పత్తి కొనుగోళ్లను సమర్థవంతంగా నిర్వహించాము. దీనిని కూడా విజయవంతంగా అమలుచేసి, ప్రతిపక్ష నాయకుల అనుమానాలు పటాపంచలు చేస్తాం. అలాగే పారదర్శకంగా యూరియా సరఫరా చేస్తాం.
పది సంవత్సరాల పాటు మీరు చెప్పిన కథలు, చేసిన ఉత్తుత్తి హామీలు వినీవినీ విసిగెత్తిపోయి మార్పు కోరుకుంటున్న ప్రజల్ని, మీరు తెలంగాణ ప్రజల్ని ఆశపడి అనడం తెలంగాణ సమాజాన్ని కించపరిచే మాటలు మానుకోవాలి. తెలంగాణ ప్రజల్ని దోచుకుందెవరు? దాచుకుందెవరు అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రుణమాఫీ గురించి మాట్లాడకుండా ఉంటే, కనీసం వారికి ఉన్న కాస్తో, కూస్తో గౌరవం ఉంటుంది అని చెప్పాలనుకుంటున్నాను.
మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం. పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీసం 1 లక్ష రుణమాఫీ చేయడానికే నానా అవస్థలు పడి, 4 వాయిదాలో చేస్తామని, 5 సంవత్సరాల సమయం తీసుకొని, సగం మందికి కూడా చేయని నాయకులా.. మా గురించి మాట్లాడేది? ఎన్నికల హామీలో ఇచ్చిన మాటకు కట్టుబడి, 50 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీని అధికారంలోకి వచ్చిన సంవత్సరకాలంలోపే పూర్తి చేసి, రుణమాఫీ కోసమే 20,600 కోట్లు ఖర్చు చేసిన ఘనత మాది.
మీ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం తరువాత కూడా, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు రుణమాఫీ కోసం 20,600 కోట్లు చేశామంటే, మా ప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రికి రైతుల మీద ఎంత అభిమానం, ప్రేమ ఉందో తెలిసిపోతుంది.
అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే బిఆర్ఎస్ నాయకులు, మా ప్రభుత్వంపై లేని పోని విమర్శలు చేశారు. రుణమాఫీ చేయడం వీరి వల్లకాదు అన్నారు. రైతులకు అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు అన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసిన మా ముఖ్యమంత్రి మొండి పట్టుదల చూపించి, ఆర్థికంగా పరిస్థితులు అధ్వానంగా ఉన్న, మనకు అన్నం పెట్టిన రైతులకు ఇచ్చిన మాటను ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకోవాలని, 25 లక్షలకు పైగా అర్హత కలిగిన రైతులకు 2 లక్షలలోపు రుణమాఫీని అమలు చేసి చూపించి, ప్రతిపక్షనాయకులకు దిమ్మతిరిగి పోయే సమాధానాన్ని ఇచ్చారు.
అయినప్పటికి “కుక్క తోక వంకర” అన్న విధంగా ఈ బిఆర్ఎస్ నాయకులు నోటికి పని చెబుతూనే ఉన్నారు. మేము కూడా అదేవిధంగా తెలంగాణ రైతాంగానికి, ప్రజానికానికి మంచి పనులు చేస్తూ వారికి దిమ్మతిరిగి పోయేలా సమాధానం ఇస్తూనే ఉంటాము. వడ్లు కొనడం మాత్రమే కాదు. బోనస్ ఇచ్చి మరీ వడ్లు కొంటున్నాము.
బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వరి వేస్తే ఉరి అని రైతులను బెదిరించి, వరి వేయకుండా చేసింది మీరే కదా.? రైతులకు ఆ పంట వేయకూడదు, ఈ పంట వేయకూడదు అని షరతులు పెట్టింది మీరే కదా..? అలాంటి మీరు వడ్లు కొనడం గురించి, బోనస్ ల గురించి మాట్లాడుతుంటే.. దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.
మా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కేవలం బోనస్ కోసమే దాదాపు 1800 కోట్లు ఖర్చు పెట్టాం. రైతుబంధును మీరు ఏ పంటకాలంలోనైనా 90 రోజులలోపు పూర్తి చేసారా? మేము 9 రోజుల్లోనే ఎకరానికి 6000 చొప్పున రైతుభరోసా చెల్లించాము. 9 రోజుల్లో 67 లక్షల మంది ఖాతాలలో 8290 కోట్ల రైతుభరోసా నిధులు జమ చేశాము.
రైతుబంధుగా మీరు ఎకరానికి 5000 ఇస్తే, మేము అధికారంలోకి వచ్చాక దానిని 6000 పెంచి, 67 లక్షల మంది రైతులకు అందించాము. మీరు రైతుబంధు పేరుతో రైతు సబ్సిడీ పథకాలు బంద్ చేస్తే, మేము రైతుభరోసా అందించడంతో పాటు రైతు సబ్సిడి పథకాలను తిరిగి ప్రారంభిస్తున్నాము.
జోక్ అంటే రుణమాఫీని వాయిదాలలో 4 సంవత్సరాలలో చెల్లించడం. సోయి ఉన్నవారెవరైనా ఆఖరి సంవత్సరంలో రుణమాఫీ చేస్తారా? అదీ సగం మందికే. మీరెన్ని విమర్శలు చేసిన, మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రిది ఒకే లక్ష్యం. రైతును రాజును చేయాలి. అందుకు అవసరమయిన అన్ని చర్యలను ముఖ్యమంత్రి అధ్యక్షతన మా ప్రభుత్వం తీసుకుంటుంది.
ఇప్పటికే వ్యవసాయరంగంలో సాంకేతికతను జోడించాము. భవిష్యత్తులో తెలంగాణ విజన్ 2047 కు అనుగుణంగా వ్యవసాయరంగాన్ని మార్చి, రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తాము. యూరియా కోసం తీసుకొచ్చిన యాప్ ముందు ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలలోనే పరిశీలిస్తున్నాము. అప్పుడు రైతుల అభిప్రాయాల ప్రకారం యాప్ లో రైతు సౌలభ్యం కోసం చేయాల్సిన మార్పులుంటే చేస్తాం. కావాలంటే బిఆర్ఎస్ నాయకులు కూడా రైతుల ప్రయోజనాల కోసం మార్పులు సూచించవచ్చు.
ఈ ప్రభుత్వం నియంతృత్వ పోకడల ప్రభుత్వం కాదు. అందరి అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకొని, రైతుల ప్రయోజనాలకి మొదటి ప్రాధాన్యతగా భావించే ప్రభుత్వం. మరొకసారి స్పష్టంగా చెప్పదల్చుకున్నా. సిద్దిపేట, గజ్వెల్ లోనే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతములో ఉండే రైతు అయిన, వారికి దగ్గర్లోని షాప్ లోనే యూరియా కొనుక్కునే సదుపాయం రైతులకు కల్పిస్తున్నాం.