Suryaa.co.in

Telangana

ప్రాజెక్టు కోసం భూములిచ్చిన మేమంతా అనాథలైనం

– కోటి రూపాయల విలువైన భూమిని కేసీఆర్ స్వాధీనం చేసుకున్నడు
– కేసీఆర్ తీరువల్ల 96 మంది రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది
– మీరే మమ్ముల్ని కాపాడాలి
– బండి సంజయ్ తో బస్వాపూర్ రైతులు

‘‘సార్…బస్వాపూర్ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన మేమంతా అనాథలైనం. రీడిజైన్ పేరుతో ఉన్న భూములను కూడా సీఎం కేసీఆర్ స్వాధీనం చేసుకున్నడు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఆ బాధతో కొందరు రైతులు గుండె పోటుతో చనిపోయారు. కోటి రూపాయల విలువైన భూమిని కేసీఆర్ స్వాధీనం చేసుకున్నం. నష్ట పరిహారం ఇస్తానన్నరు. అప్పటి కలెక్టర్, ఎమ్మార్వో వివరాలు తీసుకెళ్లారు. అయినా ఫలితం లేదు. సర్కారు తీరుతో ఇక్కడే కట్టమీద బాధతో మా మనవడు చనిపోయిండు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అందరికీ పరిహారం ఇవ్వాలని కోరుతున్నా. ఆర్ అండ్ అర్ పరిహారం ఇస్తానని హామీ ఇచ్చి అమలు చేయలేదు. మా ఊరి తరపున ప్రజలకు న్యాయం చేయమని కోరేందుకు ఇక్కడికి వచ్చాను. దయచేసి మా ఊరి ప్రజలను ఆదుకోవాలని చేతులెత్తి నమస్కరిస్తున్నా.. మేం త్యాగం చేసిన భూముల విలువ ఎకరాకు కోటి రూపాయలు దాటింది. మాకు మాత్రం ఎకరాకు రూ.15 లక్షలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఏళ్ల తరబడి పోరాడుతున్నం. ఫలితం లేదు.. కేసీఆర్ తీరువల్ల 96 మంది రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మీరే మమ్ముల్ని కాపాడాలి’’

బండి సంజయ్ తో బస్వాపూర్ రైతులు..

’’ సార్… మాది బీఎం తిమ్మాపూర్ గ్రామం. ప్రాజెక్టులో భాగంగా మా ఊరు పూర్తిగా ముంపుకు గురవుతోంది. మా ఊరు మునిగినా మరో 10 ఊర్లు బాగుపడతాయనే ఉద్దేశంతో భూములు ఇచ్చేందుకు సిద్ధమైనం.. కానీ ఇంత వరకు పూర్తిగా పరిహారం ఇవ్వనేలేదు. కలెక్టర్, ఆర్డీవో చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయింది. గట్టిగ నిలదీస్తే… మా పేరిట పట్టాల్లేవని… ఆధారాల్లేవంటూ అధికారులు చెబుతున్నరు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నం. మా భూములు గుంజుకుని మమ్ముల్ని అనాథలు చేయడం ఎంత వరకు న్యాయం?. టీఆర్ఎస్ గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క నాయకుడు మా దగ్గరకు రాలేదు. మా బాధ పట్టించుకోలేదు. నిజం చెప్పాలంటే.. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు అంతో ఇంతో సాయం చేస్తోంది బీజేపీ నాయకులే’’ – బండి సంజయ్ తో బిఎం తిమ్మాపూర్ సర్పంచ్ తిన్నం రాజు సహా గ్రామస్తుల ఆవేదన….

‘‘పరిహారం ఇవ్వవైతివి.. భూములు గుంజుకుంటువి… ఇంకెన్నాళ్లు గోస పెడతవ్ కేసీఆర్.. కంటికి నిద్ర లేదు.. బుక్కెడు బువ్వ లేదు.. ఎట్లా బతకాలె? ఇండ్ల స్థలాలిస్తానంటివి… ఊరేళ్లిపోయినందుకు ఏడున్నర లక్షలిస్తనంటివి… మాట తప్పితివి… మేం బతకలేకపోతున్నం… మాకు పరిహారమైన ఇవ్వండి.. లేకపోతే మమ్ముల్నందరినీ చంపేయండి…’’ బండి సంజయ్ కు మొర పెట్టుకున్న బస్వాపూర్ ముంపు బాధిత మహిళలు..

‘‘కేసీఆర్…. నువ్వు ఫాంహౌజ్ కట్టుకుని వంద ఎకరాలతో దర్జాగా ఉంటున్నవ్… మాకున్న ఎకరా, రెండెకరాల భూమిని మాత్రం గుంజుకుంటివి. పరిహారం కూడా ఇవ్వవైతివి. ఇదేం న్యాయం?’’ – బండి సంజయ్ తో బస్వాపూర్ బాధిత మహిళ ఆవేదన.

LEAVE A RESPONSE