– సహాయ మంత్రి హోదాలో సిఎం కార్యక్రమాల సమన్వయకర్త గా నియమిస్తూ ఉత్తర్వులు
అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్తగా నియమితులయ్యారు. రాజుకు సహయ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2017-2023 మధ్య కాలంలో ఎమ్మెల్సీగా పని చేశారు. 22 ఏళ్లుగా రాజు టీడీపీలో క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీలో వివిధ పదవులు నిర్వహించారు.
2007-2013 మధ్య కాలంలో తెలుగుయువత కార్యదర్శిగా.. ఆ తర్వాత 2013లో రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శిగా వ్యవహరించి పార్టీ అధినేత చంద్రబాబు అప్పజెప్పిన పనులను సమర్థవంతంగా నిర్వహించారు. ఈ సమయంలో చంద్రబాబు నిర్వహించి వస్తున్నా మీ కోసం పాదయాత్రలో రాజు వాలంటీర్ల సమన్వయకర్తగా పని చేసి పాదయాత్ర సజావుగా సాగేలా తన వంతు పాత్ర పోషించారు.
శాసనమండలిలో ప్రజా సమస్యలను, పార్టీ గళాన్ని గట్టిగా వినిపించారు. మూడు రాజధానులపై శాసనమండలిలో చట్టం చేసేందుకు గత ప్రభుత్వం పన్నిన కుట్రను యువ నేత లోకేష్ సారధ్యంలో సమర్థవంతంగా తిప్పికొట్టారు. మూడు రాజధానుల బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవడంలో సత్యనారాయణ రాజు తన వంతు పాత్ర పోషించారు. ఇక టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శాసన మండలిలో నారా లోకేష్ మీదకు నాటి అధికార పార్టీ నేతలు దూసుకొచ్చిన సమయంలో లోకేష్ మీద దాడి జరగ్గకుండా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ తో కలిసి అడ్డుకున్నారు.
ఇక 2022 నుంచి పార్టీ కార్యక్రమాల సమన్వయకర్తగా వ్యవహరిస్తూ చంద్రబాబు కార్యక్రమాలను కో-ఆర్డినేట్ చేసుకుంటూ.. వాటిని సక్సెస్ అయ్యేలా చేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల సమన్వకర్తగా వ్యవహరించారు. లోకేష్ నిర్వహించిన యువగళం పాదయాత్ర లో కీలక భూమిక పోషించారు. చంద్రబాబు నాయుడు పాల్గొన్న 2024 ఎన్నికల సభలను కూడా మంతెన కో ఆర్డినేట్ చేశారు.
పార్టీకి అత్యంత విధేయుడిగా ఉన్న రాజుకు తన కార్యక్రమాల సమన్వయకర్తగా నియమించి ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవించారు. అనేక మహానాడుల్లో వలంటీర్ల కో-ఆర్డినేటర్ గా వ్యవహారించిన సత్యనారాయణ రాజుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తనను సమన్వకర్తగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి సత్యనారాయణ రాజు ధన్యవాదాలు తెలిపారు. సిఎం ఇచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.