– పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
న్యూఢిల్లీ: దేశానికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిలో(ఏస్సీసీఏల్) ప్రధాన పాత్ర పోషిస్తున్న సింగరేణి సంస్థ (ఏస్సీసీఏల్)బలోపేతానికి సంపూర్ణ సహకారం అందించాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సింగరేణి కోల్ బెల్ట్ వేలాది కుటుంబాలకు ముఖ్యమైన జీవనాధారమన్నారు. ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో గురువారం జీరో అవర్ లో సింగరేణి సంస్థకు సంబంధించిన అత్యవసరమైన అంశాలను ప్రస్తావించారు.
బొగ్గు ఉత్పత్తి, అనుమతులు, విస్తరణ, ఆర్థిక సుస్థిరత గురించి ఎంపీ రవిచంద్ర సవివరంగా మాట్లాడారు.వానలు, వరదల కారణంగా బొగ్గు ఉత్పత్తి, తరలింపు మందగించడంతో థర్మల్ విద్యుత్ తయారీకి అంతరాయం తలెత్తిందని చెప్పారు. తద్వారా ఉత్పత్తి ప్రణాళికకు ఇబ్బంది ఏర్పడి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసుకున్న 72 మిలియన్ మెట్రిక్ టన్నులను చేరుకునే పరిస్థితి లేదని ఎంపీ రవిచంద్ర తెలిపారు.కొత్తగూడెం వీకేసీ, జవహర్ ఖని (జేకేఓసీపీ) ఓపెన్ కాస్ట్, గుండాల-ఇల్లందు ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఏస్సీసీఏల్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా, అవసరమైన సహకారం అందించాలని ఎంపీ వద్దిరాజు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.పలు రాష్ట్రాలు బకాయి పడిన మొత్తం విడుదలవుతే సింగరేణి ఆర్థికంగా బలోపేతం కావడానికి దోహదపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 49 శాతం వాటాను ఉపసంహరించుకుంటుందన్న అభిప్రాయం కార్మికులలో నెలకొందని,కోల్ ఇండియా వారితో సమానమైన ప్రోత్సాహాలు తమకు కూడా అందాలని సింగరేణి అధికారులు కోరుకుంటున్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
సింగరేణి కంపెనీ భద్రత,సమర్థత, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి ప్రాధాన్యత ఇస్తున్నదని ఆయన చెప్పారు.కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల నుంచి రావలసిన అనుమతులు సత్వరమే అందాలని,అధునాతన యాంత్రీకరణ జరగాలని,భద్రత, సుస్థిరత,అత్యుత్తమ పర్యవేక్షణ ఉండాలని కార్మికులు కోరుకుంటున్నారని ఎంపీ రవిచంద్ర చెప్పారు. అరుదైన, కఠినమైన ఖనిజాలు, బ్యాటరీ స్టోరేజ్,పెంప్డ్ హెడ్రో, విండ్ ఎనర్జీ,జియో థర్మల్ ఎనర్జీ వంటి వైవిధ్యమైన వాటిపై కేంద్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని, పరిశోధనలు జరగాల్సి ఉందని ఎంపీ వద్దిరాజు పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఏస్సీసీఏల్ విదేశ్ ప్రణాళికపై ప్రత్యేక దృష్టి అవసరమని ఎంపీ రవిచంద్ర సలహానిచ్చారు.సింగరేణిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి,ఉత్పత్తి పెంపుదలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపడితే, సంపూర్ణ సహకారం అందిస్తే సంస్థ ఆర్థికంగా పురోగమించడంతో పాటుగా దేశ ఇంధన భద్రతకు దోహదపడుతుందని ఎంపీ వద్దిరాజు వివరించారు.