– గూగుల్ అనే బ్యానర్ ముందుపెట్టి అసలు విషయాలు చెప్పలేదు
– ఉద్దేశ పూర్వకంగా చంద్రబాబు అదానీ పేరు బయటకు రానీయలేదు
– అదానీ డేటా సెంటర్కు వైయస్ జగన్ హయాంలో పునాది
– రూ.22వేల కోట్ల రాయితీలకు కేవలం 200 ఉద్యోగాల కల్పనా?
– ఈ డేటా సెంటర్ వల్ల వచ్చే రెవెన్యూ ఎంత?
– విశాఖపట్నం వైయస్ఆర్సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
విశాఖపట్నం: విశాఖలో గూగుల్ సంస్థను ముందుపెట్టి డేటా సెంటర్ ఏర్పాటుకు కుదుర్చుకున్న ఒప్పందానికి సీఎం చంద్రబాబు చేసుకున్న ప్రచారం జాస్తి… దీనివల్ల యువతకు కొత్తగా వచ్చే ఉద్యోగాలు నాస్తి… అని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఒప్పందంలో రూ.22 వేల కోట్ల రాయితీలను ఇచ్చేందుకు ఒప్పుకున్న సీఎం చంద్రబాబు, దాని వల్ల కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయనే నిజాన్ని ఎందుకు వెల్లడించలేక పోతున్నారని నిలదీశారు. దీనిని ప్రశ్నిస్తే మేం పెట్టుబడులకు వ్యతిరేకం అంటూ మాపై బుదరచల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో సీఎంగా వైయస్ జగన్ డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల ఉద్యోగాల కల్పన స్వల్పంగా ఉంటుందని గ్రహించే, అనుబంధ కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. దానిలో భాగంగానే ఆనాడే ఆదానీతో చేసుకున్న ఒప్పందాల్లో ఏపీ ప్రయోజనాలకు పెద్ద పీట వేశారని వెల్లడించారు.
వాస్తవానికి ఆదానీ భాగస్వామ్యంతోనే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఈ ఒప్పందం జరిగింది. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆదానీ పేరును బయటపెట్టకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే సీఎంగా వైయస్ జగన్ హయాంలోనే ఆదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు పునాది పడింది. ఈ మేరకు భూముల కేటాయింపు, అనుమతుల ప్రక్రియ కూడా పూర్తయ్యింది.
ఇప్పుడు చంద్రబాబు కుదుర్చుకున్న ఒప్పందంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారీ రాయితీలను కల్పిస్తూ, సాధించే ఉద్యోగాల విషయంలో ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు?
ఇటీవలే సిఫీ డేటా సెంటర్ ఏర్పాటుకు భూమి పూజ జరిగితే, ఆ సందర్భంగా ఆ సంస్థ అధినేత మాట్లాడుతూ.. డేటా సెంటర్ ఏర్పాటు వల్ల ఉద్యోగాలు రావని స్పష్టంగా చెప్పారు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడ డేటా సెంటర్ ఏర్పాటు జరిగినా ఉపాధి కల్పన జరగదు. ఆరోజున అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పుడు దాని వల్ల యువతకు ఉపాధి దొరకదు కాబట్టి, వారికి రాయితీ కింద ఇచ్చిన స్థలంలో ఐటీ టవర్స్ కట్టి ఐటీ ఎకో సిస్టం డెవలప్ చేసి 25 వేల మందికి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాలని వారితో ఒప్పించాం.
గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ వస్తే తప్ప, గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు. ఆ సంస్థకు భారీగా 500 ఎకరాల భూములిచ్చి, ఇతర రాయితీలిస్తుంటే.. దానివల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం ఆలోచించుకోవాలి. రైడన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఒక గిగా వాట్ డేటా సెంటర్ నడవడానికి గంటకు ఒక మిలియన్ యూనిట్లు కావాలి.
జీవీఎంసీ మొత్తానికి గంటకు కావాల్సిన విద్యుత్ ఒక మిలియన్ యూనిట్లు. అంటే, గంటకు విశాఖ నగరం మొత్తానికి ఎంతైతే విద్యుత్ వినియోగం ఉందో దానికి సమానంగా ఈ డేటా సెంటర్కి కూడా కావాల్సి ఉంటుంది. ఈ భారాన్ని ఎలా అధిగమించాలి అనేదానిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో ప్రజలకు చెప్పాలి.
ప్రతీ గంటకు రూ. 10 లక్షలు సబ్సిడీ ఇస్తున్నారు. రోజుకు రూ.2.40 కోట్లు ఏడాదికి దాదాపు రూ. వెయ్యి కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు. ఇది కేవలం పవర్ టారిఫ్ సబ్సిడీ కింద ఇచ్చే రాయితీ మాత్రమే. ఇది కాకుండా 15 ఏళ్లపాటు ఎలక్ట్రిసీటీ డ్యూటీ మినహాయింపు ద్వారా రూ. 1200 కోట్లు, 20 ఏళ్లకు ట్రాన్స్మిషన్ చార్జెస్ మినహాయింపు కింద రూ.4 వేల కోట్లు … ఇలా దాదాపు రూ.22 వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్నారు. రూ. 22వేల కోట్లు సబ్సిడీ ఇస్తున్నప్పుడు ఉద్యోగ కల్పన లేకపోయినా రాష్ట్రానికి కనీసం ఆదాయమైనా సమకూరాలి కదా. కానీ అది కూడా జరగడం లేదు.
డేటా సెంటర్ కోసం 5 టీఎంసీలు నీరు కావాల్సి ఉంటుంది. దాన్ని పోలవరం నుంచి ఇస్తామంటున్నారు. పోలవరం ద్వారా విశాఖ నగరం, పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టీఎంసీలు నీరు కేటాయించాలని 2004లో నిర్ణయించారు. విశాఖ పారిశ్రామిక అవసరాల నుంచి మినహాయించుకుని 5 టీఎంసీల నీటిని డేటా సెంటర్కి కేటాయిస్తే దాన్ని ఎలా సర్దుబాటు చేస్తారో ప్రభుత్వమే చెప్పాలి. అసలు పోలవరం నీరు విశాఖకు ఎప్పుడు తీసుకొస్తారో కూడా ఇంతవరకు ప్రభుత్వం దగ్గర కనీసం క్లారిటీ కూడా లేదు.