– కిషన్ రెడ్డి ఫోన్ ను కూడా బీఆర్ఎస్ ట్యాపింగ్ చేసింది
– లోకల్ బాడీ ఎన్నికల నినాదం తిట్లు, బూతులేనా?
– ఏ ప్రభుత్వంవల్ల పంచాయతీలకు నిధులొచ్చి అభివృద్ధి జరిగిందో చర్చకు సిద్దమా?
– డేట్, టైం, గ్రామ పంచాయతీ మీరే డిసైడ్ చేయండి
– 11 ఏళ్ల మోడీ పాలనలో గ్రామాలవారీగా కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చిద్దాం రండి
– స్థానిక ఎన్నికల్లో దగాపడ్డ మాజీ సర్పంచులే బీజేపీ బ్రాండ్ అంబాసిడర్లు
– దశాబ్దాల కల రైల్వే మ్యానుఫాక్చర్ యూనిట్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది
– కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కుమ్కక్కు రాజకీయాలు
– అవినీతి స్కాంలలో కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా కాంగ్రెస్ రక్షణ కవచంగా మారింది
– 6 గ్యారంటీలపై కాంగ్రెస్ ను నిలదీయకుండా బీఆర్ఎస్ టైంపాస్ రాజకీయాలు
– బీసీ జాబితా నుండి ముస్లింలను తొలగించాల్సిందే
– 42 శాతం రిజర్వేషన్లను పూర్తిగా బీసీలకు అందించాల్సిందే
– జనగాంలో కేంద్ర మంత్రి బండి సంజయ్
– స్థానిక ఎన్నికలపై బీజేపీ జిల్లా నేతలకు దిశానిర్దేశం
జనగాం: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలను,అభివ్రుద్ధిని పక్కనపెట్టి పరస్పరం బూతులు తిట్టుకుంటూ ప్రజల ద్రుష్టిని మళ్లిస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. ‘‘ఒకాయనేమో ‘అరే హౌలే, రా, బే, చెప్పుతో కొడతా, నీ బొంద’ అంటూ బూతులు తిడితే.. ఇంకొకాయనేమో ‘డ్రగ్స్, హీరోయిన్, బే’ అని తిట్టుకుంటూ, సవాళ్లు విసురుకుంటూ టీవీల్లో, పేపర్లలో వార్తలకెక్కుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ వార్తలకు స్పేస్ లేకుండా చేస్తున్నారు. బహుశా ఈ రెండు పార్టీలు ఈ తిట్లతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాయోమో’’అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ గ్రామ పంచాయతీల అభివృద్ధి పై కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసిరారు. ‘‘నేను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల
నేతలకు నేను సవాల్ చేస్తున్నా. గ్రామ పంచాయతీల్లో ఎవరివల్ల నిధులు వస్తున్నాయి? ఎవరి వల్ల పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయో చర్చకు సిద్ధమా? మీరే ఏ గ్రామమైనా ఫిక్స్ చేయండి. డేట్, టైం కూడా మీరే డిసైడ్ చేయండి. మేం అక్కడికి వస్తాం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో, కాంగ్రెస్ 19 నెలల పాలనలో ఆ గ్రామంలో ఏ అభివృద్ధి జరిగింది? ఎన్ని నిధులు వచ్చాయి?
నరేంద్రమోదీ 11 ఏళ్ల పాలనలో కేంద్రం ఆ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చిందో బహిరంగంగా చర్చిద్దాం. దమ్ముంటే రెండు పార్టీలు నా సవాల్ ను స్వీకరించి చర్చకు రావాలి’’అని సవాల్ విసిరారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనగాంలో బీజేపీ జిల్లా శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘వర్క్ షాప్’ లో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర
మంత్రి బండి సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే…
ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేసి గెలిచేందుకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గ్రామాల్లో అభివృద్ధి, నిధులు ఇస్తోంది కేంద్రంలోని నరేంద్ర ప్రభుత్వమే. మేం అభివృద్ధే మంత్రంగా మేం స్థానిక సంస్థల్లో పోటీ చేయబోతున్నాం. ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్నాం.
ఇయాళ టీవీలో చూసిన. కేసీఆర్ కొడుకు సీఎంను ఉద్దేశించి హౌలే, రా, బే, చెప్పుతో కొడతా, నీ బొంద అంటూ అడ్డగోలుగా తిడుతుంటే, కాంగ్రెస్ నేతలు బే, డ్రగ్స్, హీరోయిన్ అంటూ అదే స్థాయిలో తిడుతూ టీవీల్లో, పేపర్లలో వార్తలకెక్కుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ వార్తలకు స్పేస్ లేకుండా చేస్తున్నారు. బహుశా ఈ రెండు పార్టీలు ఈ తిట్లతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాయోమో. కానీ బీజేపీ మాత్రం అభివృద్ధి
మంత్రంగా గ్రామ పంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధుల వివరాలను వివరిస్తూ పోటీ చేయబోతున్నాం.
10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ సర్వనాశనమైంది. ప్రజలు ఇంకా బీఆర్ఎస్ ను తిడుతున్నారు. 6 గ్యారంటీల పేరుతో 420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 19 నెలల పాలనలో హామీల అమలులో ఘోరంగా విఫలమైంది. అతి తక్కువ కాలంలో ప్రజల ఆదరణను కోల్పోయిన ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. అందుకే ప్రజలు నిలదీస్తున్నారు.
మహిళలకు నెల నెలా రూ.2500లు ఇస్తానన్న హామీ ఏమైంది? తులం బంగారం, స్కూటీ ఏమైంది? రూ.4వేల నిరుద్యోగ భ్రుతి ఏమైంది? వ్రుద్దులకు రూ.4 వేల ఆసరా పెన్షన్ హామీ ఏమైంది? 2 లక్షల ఉద్యోగాలు ఏమైనయ్? ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగాలకు అమలు చేస్తానన్న పీఆర్సీ ఏమైంది?… ప్రజలు ఎక్కడికి వెళ్లినా ఇవే అడుగుతున్నా. స్థానిక సంస్థల ఎన్నికల్లో మా బ్రాండ్ అంబాసిడర్లు మాజీ సర్పంచులే.
ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పనులు చేసి బిల్లులు రాక అప్పులపాలై బిచ్చమెత్తుకుంటున్నరు. ఆత్మహత్యలపాలవుతున్నారు. వాళ్లంతా ఈరోజు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయా మాజీ సర్పంచులు సొంత పనులు చేసుకోలేదు. గ్రామాల్లో అభివ్రుద్ది పనులకే సొంత డబ్బులు ఖర్చు చేశారు. గ్రామాల్లో జరిగే అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందంటే కేంద్రం ఇస్తున్న నిధులతోనే సాధ్యమైతోంది.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సిబ్బందికి కూడా జీతాలివ్వలేని దుస్థితిలో ఉంది. తట్టెడు మొరం తీయలేని పరిస్థితి నెలకొంది. గ్రామాల్లో పాలన పూర్తిగా కుంటుపడిపోయి అనాథలా మారింది. బీఆర్ఎస్ ను మించిన దరిద్రపు పాలన కాంగ్రెస్ కొనసాగిస్తోంది.
తెలంగాణ ప్రజల దశాబ్దాల నాటి కల కాజీపేట రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్. ఈ కలను నరేంద్ర మోదీ ప్రభుత్వం సాకారం చేయబోతోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు రేపు కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (కోచ్ ఫ్యాక్టరీ) పనులను పర్యవేక్షించడానికి తెలంగాణకు వస్తున్నారు.
521 కోట్ల రూపాయలతో వ్యయంతో ‘కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్’ నిర్మాణం మొదలైంది. ఇది తెలంగాణలో రైలు కోచ్ల తయారీకి పెద్ద బేస్గా మారనుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావుతో కలిసి అశ్వినీ వైష్ణవ్ సికింద్రాబాద్ నుంచి రైలులో కాజీపేటకు వస్తున్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందే. కాళేశ్వరం, డ్రగ్స్, విద్యుత్ కొనుగోళ్లు, ఫాంహౌజ్, ఫార్ములా ఈరేస్, చేపల, గొర్రెల స్కాంలు జరిగాయని, ఆధారాలున్నాయని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఎందుకంటే రెండు పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోంది. మీరు 6 గ్యారంటీలపై మీరు నిలదీయొద్దు. బీఆర్ఎస్ స్కాంల విషయంలో కేసీఆర్ కుటుంబాన్ని మేం అరెస్ట్ చేయబోమంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది. అందుకే నువ్వు తిట్టినట్లు చేయ్. నేను ఏడ్చినట్లు చేస్తానన్న్టట్లుగా రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయి.
బనకచర్ల విషయంలో రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయి. బనకచర్లపై తెలంగాణ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తామని బీఆర్ఎస్ డ్రామాలాడుతుంటే,
కేంద్రం నిర్వహించిన మీటింగ్ లో బనకచర్ల ప్రస్తావనే లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. కేంద్రం ఒకవైపు తెలంగాణకు అన్యాయం జరగనీయబోమని, అన్ని అంశాలపై కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. అయినా తెలంగాణ సెంటిమెంట్ తో బీఆర్ఎస్ రెచ్చగొట్టాలని చూస్తోంది.
బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలాడుతున్నారు. ఈ రెండు పార్టీల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ దుర్మార్గాలపై అనేక పోరాటాలు చేసిన బీజేపీ కార్యకర్తలు లాఠీదెబ్బలు తిన్నారు. రక్తం చిందించారు. జైలుకు వెళ్లారు. రాష్ట్ర అధ్యక్షుడి నుండి పోలింగ్ బూత్
కార్యకర్త దాకా ప్రజల కోసం ఉద్యమించి దెబ్బలు తిన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా ఆత్మసాక్షిగా ఓటేయాలని కోరుతున్నా. ఇరు రాష్ట్రాల సీఎంలు వాళ్ల సొంత ఎజెండాలను తీసుకుని కేంద్రం వద్దకు వెళ్లారు. అందుకే ఆ ఎజెండాలోని అంశాలపై కేంద్రం నిపుణులతో కమిటీని నియమించింది.
కిషన్ రెడ్డి ఫోన్ ను కూడా ట్యాప్ చేశారు. ఆయనెట్లా కేసీఆర్ ను కాపాడతారు? కేసీఆర్ లాంటి ఛండాలమైన వ్యక్తిని నేనెక్కడా చూడలేదు.భార్యాభర్తలు బెడ్రూంలో మాట్లాడుకునే మాటలను కూడా ట్యాప్ చేశారు. నా ఫోన్ ను, నా పీఏ, పీఆర్వో, డ్రైవర్ ఫోన్లను ట్యాప్ చేశారు. ఆఖరికి ఇంట్లో పనిచేసే వాళ్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. సిగ్గు లేకుండా ఇంకా సమర్ధించుకుంటున్నారు. నాకు కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా అనుమానం వస్తోంది. వాళ్లు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ స్టాండ్ వెరీ క్లియర్.పూర్తిగా బీసీ బిడ్డలకే 42 శాతం రిజర్వేషన్లకే అందించాలి. ఆ పనిచేస్తే కేంద్రాన్ని ఒప్పించి బిల్లును ఆమోదింపజేసే బాధ్యత మేం తీసుకుంటాం. కానీ కాంగ్రెస్ ఏం చేస్తోంది? బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెబుతూ… అందులో 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తోంది.
ఇప్పటికే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లవల్ల ముస్లింలు లబ్ది పొందుతున్నారు.ఇంకా 10 శాతం రిజర్వేషన్లు వాళ్లకు కల్పిస్తే ఈ రాష్ట్రంలోని ముస్లింలందరికీ నూటికి నూరు శాతం రిజర్వేషన్లు అందుతాయి.
బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. 51 శాతం జనాభా ఉన్న బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు మాత్రమే అమలవుతాయి. అందులోనూ ఇప్పటికే మోదీ ప్రభుత్వం 27 శాతం రిజర్వేషన్లను బీసీలకు అందిస్తోంది కదా? మరి కాంగ్రెస్ ఒరగబెట్టిందేమిటి? అందుకే బీసీ జాబితాలో ముస్లింలు చేర్చితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. గతంలో వైఎస్ హయాంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంవల్ల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీ స్థానాల్లోనూ ముస్లింలు పోటీ చేసి బీసీలను దెబ్బతీశారు.
ఇప్పుడు 10 శాతం రిజర్వేషన్లు ఆ వర్గానికి అమలు చేస్తే రాష్ట్రంలో బీసీల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అందుకే బీసీ రిజర్వేషన్ల జాబితా నుండి ముస్లింలను తొలగించాల్సిందే. బీసీలకే పూర్తిగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే. లేకుంటే బీజేపీ పక్షాన ఉద్యమిస్తాం.