-ఏటా దాదాపు 4 వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం
-70 వేల టీఎంసీల నీరు నదుల్లో ప్రవహిస్తున్నది
-దేశవ్యాప్తంగా కేవలం 20 వేల టీఎంసీల నీటిని మాత్రమే వినియోగంలోకి
-మిగతా 50 వేల టీఎంల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నాయి
-సమాజంలో నేటికీ కుల, మత, లింగ వివక్షలు కొనసాగడం విషాదం
-బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీర్మానం
హైదరాబాద్: తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ కొనసాగుతున్నది. పార్టీ ప్రతినిధులు పలు తీర్మానాలపై చర్చించి, ఆమోదం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.
‘భారతదేశాన్ని 75 ఏండ్ల పరిపక్వ ప్రజాస్వామ్య దేశంగా ఘనంగా చెప్పుకుంటున్నాం. నేటికీ దేశ ప్రజలు తాగు, సాగునీరు, విద్యుత్ అందక అల్లాడిపోతున్నారు. మౌలిక వసతుల కొరతతో దేశ ప్రగతి మందగిస్తున్నది. దేశాభివృద్ధికి చోదక శక్తిగా నిలవాల్సిన యువతకు ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో నిరాశతో కొట్టుమిట్టాడుతున్నారు. సమాజంలో నేటికీ కుల, మత, లింగ వివక్షలు కొనసాగడం విషాదం. ఈ వివక్షల వల్ల భారత సమాజం వికాసం ఆశించిన స్థాయిలో జరగడం లేదు.
దేశంలో సామాజిక సమానత్వం కొరవడింది. దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఉపాధి లేక మగ్గిపోతున్నారు. భారత రాజ్యాంగం ప్రజలందరికీ హక్కులు, రక్షణ కల్పించినప్పటికీ.. ఇప్పటికీ దళిత, మైనార్టీలపై జరుగుతున్న దాడులు నాగరికతా విలువలను పరిహసిస్తున్నాయి. అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజారుస్తున్న ఈ వైఖరి ఆమోదయోగ్యం కాదు.
భారతదేశంలో ఎంతో అద్భుతమైన వనరులు ఉన్నాయి. పాలకుల వైఫల్యంతో ప్రజల దుర్భర పేదరికాన్ని అనుభవిస్తున్నారు. దేశంలో నీటి వనరుల లభ్యత దేశ ప్రజల అవసరాలకు మించిన స్థాయిలో ఉంది. ఏటా దాదాపు 4 వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం కురుస్తున్నది. 70 వేల టీఎంసీల నీరు నదుల్లో ప్రవహిస్తున్నది. దేశవ్యాప్తంగా కేవలం 20 వేల టీఎంసీల నీటిని మాత్రమే వినియోగంలోకి తెచ్చుకున్నాం. మిగతా 50 వేల టీఎంల నీరు వృధాగా సముద్రం పాలవుతున్నాయి.
ఇందులో నుంచి మరో 20 వేల టీఎంసీల నీటిని వినియోగించుకుంటే దేశంలో సాగుయోగ్యమైన 41 కోట్ల ఎకరాల్లో ప్రతి ఎకరానికి సాగునీరు అందించవచ్చు. ఇవన్నీ స్వయంగా కేంద్రం వెల్లడించిన గణాంకాలు. 50 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతుంటే.. దేశ పాలకులు తమాషా చూస్తున్నారు. దేశంలో ఎక్కడ చూసినా తాగు, సాగునీటి కటకటే.
భారత్ కన్నా విస్తీర్ణంలోనూ, జనాభాలోనూ చాలా చిన్న దేశాలు పెద్దపెద్ద రిజర్వాయర్లు నిర్మించుకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద రిజర్వాయర్ జింబాబ్వేలో ఉంది. పాలకులు ఇటువంటి చర్యలు చేపట్టకపోవడంతో అనేకమంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తెలంగాణ మినహా.. దేశంలోని అన్నిప్రాంతాల్లో ప్రజలు తాగు, సాగునీరు లేక బాధలు అనుభవిస్తున్నారు. దేశంలో అనేక పట్టణాలు, నగరాల్లో వారం రోజులకోసారి తాగునీరు రావడం లేదు. పల్లెల్లో మహిళలు మైళ్ల దూరం నడిచి తాగునీరు తెచ్చుకుంటున్నారు. కడివెడు నీళ్ల కోసం వీధిపోరాటాలకు దిగాల్సి వస్తుంది.’ అని కేటీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు.