Home » మరు జన్మఉంటే మళ్లీ కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా

మరు జన్మఉంటే మళ్లీ కుప్పం ముద్దుబిడ్డగానే పుడతా

-ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేరుస్తాం
-సంక్షేమానికి పెద్దపీట వేసి..అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం
-కొత్త ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయి….అయినా రాష్ట్రాన్ని నిలబెడతాం
-ఐదేళ్ల వైసీపీ పాలన ఓ పీడకల…ఎక్కడ చూసినా అవినీతే
-వైసీపీ పాలనలో దెబ్బతిన్న రంగాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం
-రైతుల పాసుపుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి..రాజముద్ర వేసి ఇస్తాం
-9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైతే…8 సార్లు కుప్పం నుంచే గెలిచాను
-కుప్పం ప్రజలతో నాది విడదీయలేని బంధం…
-వెనకబాటుతనం ఉండే కుప్పాన్ని అభివృద్ది చేయాలని నాడు ఈ నియోజకవర్గానికి వచ్చాను
-ప్రత్యేక ప్రణాళికతో కుప్పాన్ని దేశంలో మోడల్ నియోజకవర్గం చేస్తా
-కుప్పం బహిరంగ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
-అసంపూర్తిగా ఉన్న హంద్రీనీవా సుజల శ్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పరిశీలించిన సీఎం
-రాజధానికి రూ.4.5 కోట్ల విరాళం అందించిన డ్వాక్రా సంఘాలకు సీఎం అభినందన

కుప్పం : రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో సంక్షేమానికి పెద్దపీట వేసి…అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నాటి వైసీపీ ప్రభుత్వం రూ.10 ఇచ్చి ప్రజల నుండి రూ.100 దోచిందని…తమ ప్రభుత్వం రూ.15 ఇచ్చి…రూ.100 సంపాదించే మార్గం చూపుతుందని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా, పేదరికం లేని సమాజం సాధించేలా పాలన అందిదస్తామని ముఖ్యమంత్రి అన్నారు.

తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం మొదటి రోజు శాంతిపురం మండలం, చిన్నారిదొడ్డి వద్ద హంద్రీనీవా సుజల శ్రవంతి కుప్పం బ్రాంచ్ కెనాల్ ను పరిశీలించారు. అనంతరం కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….‘‘నేను 9వ సార్లు ఎమ్మెల్యే అయితే…రూ.8 సార్లు కుప్పం నుండే విజయం సాధించాను. అన్ని ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో కుప్పం ప్రజలు నన్ను గెలపించారు. నామినేషన్ కు నేను రాకపోయినా మీరే నా తరపున వేశారు. మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను. 164 మంది ఎమ్మెల్యేలతో కూటమి గెలిచింది….వైసీపీని చిత్తుగా ఓడించారు. ప్రజాస్వామ్యంలో విర్రవీగితే వైసీపీకి పట్టిన గతే ఎవరైనా పడుతుంది.

చిత్తూరు పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలకు 7 స్థానాలను ప్రజలు గెలిపించారు. 20 పార్లమెంట్లలో 7కు 7 స్థానాలు గెలివడం ఒక చరిత్ర. 21 పార్లమెంట్ స్థానాలు కూటమికి ఇచ్చారు. వైసీపీ ఒక అరాచక పార్టీ. దాన్ని ఇంటికి పంపడానికి టీడీపీ, జనసేన, బీజేపీ జట్టుకట్టాయి. ఈ ఎన్నికల ద్వారా రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరిగరాయబోతున్నాం. నేను చేపట్టబోయే ఏ కార్యక్రమాన్ని అయినా ఇక్కడే ప్రయోగించి…ఆ తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తా.’’ అని సీఎం అన్నారు.

వెనకబడిన వర్గాలే నా సామాజికవర్గం

మొన్నటి ఎన్నికల్లో చదువుకున్న అభ్యర్థులకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చాం. కేబినెట్ లో 17 మంది కొత్తవారికి అవకాశం ఇచ్చాం. 7 మంది మొదటిసారి గెలిచి…మొదటి సారి మంత్రులు అయ్యారు. యువతకు టీడీపీ ప్రాధాన్యం ఇస్తుంది. బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇస్తుంది. పామాజిక న్యాయానికి పెద్దపీట వేశాం. కుప్పంలో నాకు సామాజికవర్గం లేదు..వెనకబడిన వర్గాలే నా సామాజిక వర్గం.

8 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చాం. నాలుగో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాను. మొదటి పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టును సందర్శించాను…రెండో పర్యటన రాష్ట్ర భవిష్యత్తు అయిన అమరావతిలో పర్యటించాను. ఆ తర్వాత అసెంబ్లీ, కేబినెట్ సమావేశాలు పెట్టుకున్నాం. నా ప్రత్యక్ష దేవుళ్లు అయిన కుప్పం ప్రజలను కలవడానికి వచ్చాను. ప్రజా క్షేత్రానికి వెళ్లేందుకు ఇక్కడి నుండే శ్రీకారం చుట్టాను. కుప్పం ప్రజలకు రుణపడి ఉన్నా.

ఐదేళ్లలో మీ రుణం తీర్చుకుంటా. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి కుప్పంను అన్ని విధాలా అగ్రస్థాతానంలో ఉంచుతా. పేదరికం లేని సమాజం నా లక్ష్యం. 1989లో మొదటి సారి కుప్పం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను…అప్పటి నుండి 8 సార్లు వరుసగా గెలిచాను.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

ఐదేళ్ల వైసీపీ పాలన ఓ పీడకల
‘‘2019 నుండి 2024 వరకు ఒక పీడకల. ఐదేళ్లు అరాచకం సృష్టించారు…దౌర్జన్యాలు చేశారు. నా జోలికే వచ్చారు. అన్నాక్యాంటీన్ పెట్టి అన్నం పెట్టాలనుకుంటే వైసీపీ నేతలు దౌర్జన్యం చేశారు. కుప్పంలో గ్రానైట్ మొత్తం తినేసి కేజీఎఫ్ తలపించేలా దోపిడీ చేశారు. నేను కుప్పం వస్తున్నానంటే జీవో-1 ద్వారా మన వాళ్లపై దాడులు చేసి కేసులు పెట్టారు…30 మందిని జైల్లో పెట్టారు. ఇది నేను మర్చిపోతానా.?

నాకు ఎవరిపైనా కోపం లేదు…కుప్పం ప్రజలపై ప్రేమ మాత్రమే ఉంది. ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా…కుప్పంలో రౌడీ యిజం చేస్తే అదే చివరి రోజు. రౌడీ యిజం, గంజాయి కుప్పంలో ఉండటానికి వీలులేదు. కుప్పం మున్సిపాలిటీలో పన్నులు పెంచారు తప్ప అభివృద్ధి లేదు. మోడల్ మున్సిపాలిటీగా కుప్పంను మార్చుతాం. ఔటర్ రింగ్ రోడ్ వేస్తా. నాలుగు మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

కుప్పంలో ప్రతి ఎకరాకు నీళ్లందిస్తాం
రూ.2 లకే 20 లీటర్లు నీళ్లు ఇస్తే దాన్ని కూడా నాశనం చేశారు. కుళాయి ద్వార ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తా. హంద్రీనీవా కాలువను ఎన్టీఆర్ ప్రారంభించారు. నేను వి.కోట వరకు నీళ్లు తెచ్చాను. 5 ఏళ్లలో వైసీపీ హయాంలో 5 కి.మీ మేర కూడా నీళ్ల తీసుకురాలేదు. సినీ సెట్టింగులు పెట్టి ట్యాంకర్లలో నీళ్లు తెచ్చి కాల్వలో పోశారు. వైసీపీకి ఏమాత్రం రైతులపై ప్రేమ లేదు. అన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం అయ్యాయి. త్వరలోనే సాగునీటి ప్రాజెక్టుల దుస్థితిపై శ్వేత పత్రం విడుదల చేస్తాను.

హంద్రీనీవా ద్వారా అన్ని చెరువులు నింపి కుప్పంలో కరవు అన్నది లేకుండా చేస్తాం. యామిగానిపల్లె, మనమాదన పల్లెలో రెండు చెరువులు నిర్మించి టీఎంసీ మేర నీటిని నింపుతాం. చెక్ డ్యాములు నిర్మించి నీళ్లు నిల్వ చేస్తాం. అవసరమైతే లిఫ్ట్ లు పెట్టి పొలాలకు నీళ్లు ఇస్తాం. సాగునీళ్లు ఇస్తే ఇక్కడి రైతులు బంగారం పండిస్తారు..ఇక్కడ అన్ని రకాల పంటలు పండిస్తారు. కుప్పం పట్టు పరిశ్రమకు కేంద్ర బిందువు.

ఇక్కడ విమానశ్రయ నిర్మాణాన్ని చేపడితే దుర్మార్గులు నిలిపేశారు. వాణిజ్య పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం. నాడు నేను ఆవులు పట్టిస్తే ఎగతాళి చేశారు..కానీ ఇప్పడు అవే జీవనాధారం అయ్యాయి. పాల ఉత్పత్తిని పెంచుతాం…గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తాం. పేదరిక నిర్మూలన నా జీవిత ఆశయం…పేదరికం లేని కుటుంబం రావాలి.

కుప్పం ఏరియా డెవలెప్మెంట్ అథారిటీ మళ్లీ ఏర్పాటు చేస్తాను. మల్లనూరు, రాళ్లమదుగూరును మండలాలుగా చేస్తున్నాం. కృష్ణగరి, కేజీఎఫ్, బెంగళూరు, చెన్నై కుప్పం దగ్గరగా ఉంటుంది…అభివృద్ధి చేసుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటుంది.” అని సీఎం చంద్రబాబు అన్నారు.

7 అంశాలపై త్వరలో శ్వేత పత్రాలు
యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. కుప్పంకు టెక్స్ టైల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, వివిధ రకాల పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ద్రవిడ యూనివర్సిటీపై దృష్టి పెట్టి ప్రక్షాళన చేస్తా. యూనివర్సిటీ సిబ్బందికి జీతాలు సరిగా ఇవ్వడం లేదు…జీతాలు కూడా విడుదల చేయిస్తా. ఎడ్యుకేషన్ హబ్ గా కుప్పంను మార్చుతాం. మనం కట్టిన కమ్యూనిటీ భవనాలను గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసింది…వాటిని పూర్తి చేస్తాం.

తిరుపతి గంగమ్మ, నల్లప్ప కొండ గేటురాయిస్వామి ఆలయం, కోదండ రామాలయం, ధర్మరాజుల ఆలయాలను అభివృద్ధి చేస్తాం. వైసీపీ నేతలు గంజాయిని కూడా పెరట్లో పెంచారు…గంజాయి సరఫరాపై ఉక్కు పాదం మోపుతాం. వైసీపీ అరాచకాలు చూసిన ప్రజలు కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గాజువాక, బీమిలి, మంగళగిరిలో 90 వేలకు పైగా మెజారిటీని ప్రజలు కూటమి అభ్యర్థులకు ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజారిటీతో గెలిచారు.. ప్రజలకు అండగా నిలబడతారన్న నమ్మకంతోనే గెలిపించారు. నా ఇంట్లో ఆడపడుచులు ఎప్పుడూ బయటకు రాలేదు..కానీ మొన్నటి ఎన్నికల సమయంలో రావాల్సి వచ్చింది. వైసీపీ చేసిన అరాచకాలకు మహిళలు కూడా ఇంటి నుండి బయటకు వచ్చి పోరాడారు. వైసీపీ ఐదేళ్ల పాటు చేసిన తప్పులు, అరాచకాలతో నేను మోయలేనన్ని సమస్యలు తెచ్చి పెట్టారు. అప్పులు విపరీతంగా చేశారు. అయినా కష్టాలున్నాయని పారిపోయేవాన్ని కాదు. ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారో అంతుబట్టటం లేదు. త్వరలో 7 అంశాలపై శ్వేత పత్రాలు విడుదల చేయబోతున్నాం.” అని సీఎం చంద్రబాబు అన్నారు.

పాసుపుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి..రాజముద్ర వేస్తాం
‘‘16,347 పోస్టుల భర్తీకి ఇచ్చిన మాట ప్రకారం సంతకం చేశాం…కేబినెట్ లో కూడా ఆమోదం తెలిపాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి పట్టాదారుపుస్తకాలపై బొమ్మలు ముద్రించుకున్నారు. టైటిల్ రిజిస్ట్రేటర్ ను పెట్టుకుని భూములు దోచుకోవాలని చూశారు. అందుకే ఈ నల్ల చట్టాన్ని రద్దు చేసేందుకు కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం. పాసుపుస్తకాలపై జగన్ ఫోటో తొలగించి..రాజముద్ర వేసి పుస్తకాలు రైతులకు అందిస్తాం.

పెన్షన్ ను కూడా రూ.4 వేలకు పెంచాం…మూడు నెలల బకాయి కలిపి జూలైలో రూ.7 వేలు ఇవ్వబోతున్నాం. అన్న క్యాంటీన్లు కూడా 183 ప్రారంభించబోతున్నాం…వాటిని కూడా పెంచుకుంటూ పోతాం. స్కిల్ గణన కూడా చేపట్టి ఎవరికి ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వాలో చేస్తాం. సమైక్యరాష్ట్రంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాలు బలంగా తయారయ్యాయి.

పసుపు కుంకుమ కింద ప్రతి డ్వాక్రా మహిళకు గతంలో రూ.10 వేలు అందించాం. వడ్డీలేని రుణాలు అందించాం. డ్వాక్రా సంఘాల మహిళలను లక్షాధికారులను చేస్తాం. డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం. సూపర్-6 కూడా అమలు చేస్తాం.’’ అని అన్నారు.

రాజధాని నిర్మాణానికి విరాళాలు
అమరావతి రాజధానికి పలువురు విరాళాలు అందించారు. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు విరాళాలకు సంబంధించిన చెక్కులను అందించారు. చిత్తూరు జిల్లా డ్వాక్రా సంఘాల తరపున రూ.4.5 కోట్లు, రామకుప్పంకు చెందిన టీడీపీ నేత ఆనందరెడ్డి రూ.5 లక్షలు, కుప్పంకు చెందిన ప్రేమ్ కుమార్ రూ.లక్షను విరాళంగా అందించారు. సందర్భంగా వారిని సీఎం చంద్రబాబు అభినందించారు.

Leave a Reply