– పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు
– విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది
– అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళ్లం అవుతాం
– మహబూబ్ నగర్ జిల్లా వేములలో SGD-కార్నింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొత్త యూనిట్ ప్రారంభోత్స కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వేముల: రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లా నూతన పరిశ్రమలకు వేదిక కాబోతోంది. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు మహబూబ్ నగర్ జిల్లా వేదిక కాబోతున్నందుకు సంతోషంగా ఉంది. పాలమూరు జిల్లా ఒకనాడు వలసలకు మారుపేరు.
ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ఈ జిల్లా ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన పాలమూరు రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు వంటి ఏవీ సంపూర్ణంగా పూర్తి కాలేదు. ఆనాడు సోనియాగాంధీ గారు పాలమూరు యూనివర్సిటీని మంజూరు చేసినా పేరుకే అది యూనివర్సిటీ. కానీ అది పీజీ కాలేజీగానే మిగిలిపోయింది.
ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఎంప్లాయిమెంట్ లో మన జిల్లాను అభివృద్ధి చేసుకోకపోతే శాశ్వతంగా జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది. అందుకే ఇంజనీరింగ్, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలతో పాటు ట్రిపుల్ ఐటీని జిల్లాకు మంజూరు చేశాం. రూ. 2800 కోట్లతో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.
విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది. వలసలు వెళ్లే పాలమూరు బిడ్డలు ఆ వలసల బారి నుంచి బయటపడాలంటే చదువొక్కటే మార్గం. పాలమూరు జిల్లా నుంచి ఇంజనీర్లు, డాక్టర్లే కాదు, IAS లు ఐపీఎస్ లు గా ఎదిగి రాష్ట్రానికే కాదు దేశానికి సేవలందించేలా ఎదగాలి. ఎదగాలంటే మీరు చదవాలి. చదవాలంటే మీకు వసతులు ఉండాలి. ఆ వసతులు అందించే బాధ్యత పాలమూరు బిడ్డగా నేను తీసుకుంటా.
చదువు కోసం ఎక్కడ ఏది కావాలన్నా ఇవ్వడానికినేను సిద్ధంగా ఉన్నా. పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందించి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఉదండాపూర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని మేం ప్రయంత్నిస్తుంటే గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. భూసేకరణ విషయంలో రైతులతో మాట్లాడి ఒప్పించి మంచి పరిహారం అందించాలని అధికారులకు సూచిస్తున్నా.
గతంలో నాయకత్వ నిర్లక్ష్యం వల్లే ఇప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజక్టులు పూర్తి కాలేదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్ని అడ్డంకులను అధిగమించి అసంపూర్తిగా ఉన్న పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసుకుందాం. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ఈ రెండే పాలమూరు జిల్లా రూపురేఖలు మారుస్తాయి. ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 14 ఏటీసీలను ఏర్పాటు చేసే బాధ్యత మా ప్రభుత్వానిది.
భవిష్యత్ లో మన అభివృద్ధిని, సాగునీటి ప్రాజెక్టులను చూపించేందుకు విదేశాల నుంచి పర్యాటకులు వచ్చేలా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. కుర్చీలో కూర్చుంది మీ పాలమూరు బిడ్డ. ఏదైనా మొదటి ముద్ద మీకే పెడతా. ఇది నా బాధ్యత, నైతిక ధర్మం. ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకున్నవాళ్లం అవుతాం.