– ఏపీ ఇప్పటికే 657 టిఎంసీలు వాడింది
– ఏపీకి మిగిలిన హక్కు కేవలం 9 టీఎంసీలే
– తెలంగాణ వాడుకున్నది 220 టీఎంసీ మాత్రమే
– ఇంకా తెలంగాణకు 123 టీఎంసీలు రావాలి
– ఏపీ నుంచి తెచ్చుకున్న మీ అడ్వైజర్ ఏం చేస్తున్నడు?
– నిర్లక్ష్యంతో మొద్దు నిద్ర నటిస్తున్న కాంగ్రెస్
– కేఆర్ఎంబీ ఆఫీసు ముందు ధర్నా చేద్దాం పదండి
– ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నరు.. ఎందుకు ఎత్తుక తిననా? మొత్తుకు సావనా?
– కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు.. చంద్రబాబును అడగవు
• చంద్రబాబును అడిగే ధైర్యం లేదు
• కేంద్రం ను అడిగే దమ్ము లేదు
– మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాగు నీరు, తాగు నీరు ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుంటే కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. వేసవిలో తాగునీటి సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉంది.తెలంగాణ సోయి లేని ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎంతటి నష్టం జరుగుతుందో ఇవాళ కళ్ల ముందు కనబడుతున్నది.
సాగర్ కుడి కాల్వ నుంచి ఏపీ ప్రభుత్వం రోజు 10వేల క్యూసెక్కుల నీళ్లు తరలించుకుపోతుంటే, తెలంగాణ ప్రభుత్వం చేవచచ్చి, చేష్టలుడిగి చేతులు కట్టుకొని చూస్తున్నారు. నీళ్ల మంత్రి నీళ్లు నములుతున్నడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భూభాగానికి నీళ్లు మళ్లించిన ప్రభుత్వం బీఆర్ఎస్ అయితే, చేతగాక నీళ్లు నములుతున్న ప్రభుత్వం ఇవ్వాళ కాంగ్రెస్.
మూడు నెలలుగా నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కులను ఏపీ తరలించుకుంటుంటే ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి బెల్లం గొట్టిన రాళ్లలాగా చలనం లేకుండా పడి ఉన్నరు. కృష్ణా జలాల్లో ఏపీ తాత్కాలిక వాటా 512 టిఎంసీలు, కానీ ఇప్పటి వరకు 657 టీఎంసీలు తరలిస్తే మీ నోరు పెగలదా? మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు? గడిచిన 25 రోజుల్లోనే 60 టిఎంసీలు తరలించారు. అంటే రోజుకు రెండు టిఎంసీలు.
తెలంగాణ నీటి ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్, తెలంగాణ ప్రజల పాలిట పెను శాపం. సీఆర్పీఎఫ్ బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేసినం. నాగార్జున సాగర్ ను తెలంగాణ ఆధీనంలోకి తీసుకోవాలని కోరినం. నవంబర్ 30, 2023 నాడు ఏ స్టేటస్ లో ఉందో, అదే స్టేటస్ ఉండాలని తీర్మానం చేసినం. ఏడాది నుంచి చేతుల్లోకి తీసుకోవడంలో కాంగ్రెస్ ఫెయిల్. మన చేతిలో ఉండే కుడి కాల్వ నుంచి రోజుకు 10వేల క్యూసెక్కులు ఏపీ తీసుకుపోరు కదా? మీ చేతగాని తనం, నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు పెద్ద దెబ్బ తగిలే ప్రమాదం ఉన్నది.
సీఆర్పీఎఫ్ బలగాల చేతిలో ఉన్న ప్రాజెక్టు నుంచి ఏపీ ఇష్టారాజ్యంగా నీళ్లు తరలిస్తున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని అడగవు, చంద్రబాబును అడగవు. చంద్రబాబును అడిగే ధైర్యం లేదు. కేంద్రం ను అడిగే దమ్ము లేదు. ఎగరుమంటే విపక్షం మీద వికారపు భాషలో జానెడు జానెడు ఎగురుతడు. ఎగరాల్సిన చోట ఎగరటం చేతనైతలేదు. తెలంగాణ సాగు నీటి, తాగు నీటి అవసరాలకు నిల్వ ఉంచాల్సిన నీటిని ఏపీ తరలిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు?
ఈ ఏడాదికి కృష్ణాలో 1010 టీఎంసీల నీళ్లు వచ్చాయి. తాత్కాలిక ఒప్పంద ప్రకారం అనుకున్నా ఏపీ 666 టీఎంసీలు రావాలి. కానీ ఏపీ ఇప్పటికే 657 టిఎంసీలు వాడింది. ఏపీకి మిగిలిన హక్కు కేవలం 9 టీఎంసీలే ఇవ్వాళ కూడా సాగర్ కుడి కాల్వలో 10వేల క్యుసెక్కులు పోతున్నయి. తెలంగాణకు ఆ రేషియో ప్రకారం చూసిన 343 టీఎంసీల నీళ్లు తెలంగాణకు రావాలి. ఈరోజుకు తెలంగాణ వాడుకున్నది ఎంత అంటే 220 టీఎంసీ మాత్రమే. ఇంకా తెలంగాణకు 123 టీఎంసీలు రావాలి.
123 మరియు 9 టీఎంసీలు కలిపితే 132టీఎంసీ. శ్రీశైలం, సాగర్ లో కలిసి ఉన్న నీళ్లు 100 టీఎంసీలు. ఈ వందలో ఏపీ తరలిస్తూ ఉన్నది. తెలంగాణ నష్ట పోతున్నది. కాంగ్రెస్ గుడ్లు అప్పగించి చూస్తున్నది. ఏపీ నుంచి తెచ్చుకున్న మీ అడ్వైజర్ ఏం చేస్తున్నడు. ఇంజినీర్లు ఏం చేస్తున్నరు. నీటి పారుదల శాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నడు? నాగార్జున సాగర్ ఎండీడీఎల్ 510, ఈరోజు ఉన్నది 50 టీఎంసీలు.
శ్రీశైలం ఎండీడీఎల్ 834, ఈరోజు ఉన్నది 50టీఎంసీలు. రెండు కలిపి మొత్తం 100 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నయి. ఉన్నయి తక్కువ తెలంగాణకు రావాల్సింది ఎక్కువ. ఇప్పటికైనా కళ్లు తెరవండి. అన్యాయం అడ్డుకోండి. యాసంగి పంటకు నీళ్లు ఇస్తమని కోట్లు పెట్టి పత్రికల్లో యాడ్స్ ఇచ్చారు. సాగర్ ఎడమ కాల్వ కింద నల్గొండలో లక్షా 45 వేల ఎకరాలు, సూర్యపేటలో 2లక్షల 35వేల ఎకరాలు, ఖమ్మంలో 2లక్షల పైగా ఎకరాలు, మొత్తంగా 6లక్షల 38వేల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకున్నరు.
నాలుగు తడుల నీళ్లు ఇస్తే గాని పంటలు పండవు. దాదాపు 30, 35 టీఎంసీల నీళ్లు కావాలి. ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద 2లక్షల 40వేల ఎకరాల్లో పంట వేశారు.ఈ పంటలకు కూడా మూడు నాలుగు తడుల నీళ్లు ఇవ్వాలి. ఖమ్మం, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యపేట, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నాగార్జున సాగర్ పై ఆధారపడి ఉంది.ఇప్పటికైనా కండ్లు తెరవండి. రైతుల పంటలు కాపాడాలంటే తక్షణం కేంద్రం మీద ఒత్తిడి తేవాలి. ఏపీ జలదోపిడిని తక్షణం అడ్డుకోవాలి. కేఆర్ఎంబీ ఆఫీసు ముందు ధర్నా చేద్దాం పదండి. పోదాం పదా.. కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం. మీకు చేతగాకుంటే మీ వెంట మేమూ వస్తాం. అఖిల పక్షాని తీసుకుపోండి.
మిమ్మల్ని గెలిపించింది పంటలు ఎండగొట్టడానికా, తాగు నీటి కోసం ప్రజలు గోస పడడానికా? తక్షణమే సాగర్ కుడి కాల్వకు నీళ్లు విడుదల ఆపాలి. ముచ్చుమర్రి నుంచి తోడుతున్న నీళ్లను ఆపాలి. పోతిరెడ్డి పాడు ద్వారా తరలిస్తున్న నీటిని ఆపాలి. ఉన్న 100 టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే మన పంటలు ఎండవు. కొద్దో గొప్పో సర్దుకొని వ్యవహారం నడిపించవచ్చు. పంటలు దెబ్బతినడం కాదు, తాగు నీళ్లు కూడా లేని పరిస్థితి వస్తుంది.
ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నది. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతున్నది. ఏపీ ఇష్టం ఉన్నట్లు నీటిని తరలిస్తున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి ఇక్కడ అధికారంలో ఉండటంతో నీటి తరలింపు సులువు అయ్యింది. పార్లమెంట్ లో బిఆర్ఎస్ ఉంటే మా వాళ్లు దద్దిరిల్లింప చేసేవాళ్లు. తెలంగాణ అంటేనే బీఆర్ఎస్, బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ. కాంగ్రెస్, బీజేపీ చెరో 8 మంది గెలిచి ఏం ప్రయోజనం. ప్రశ్నించే గొంతు పార్లమెంట్ లో లేదు. కాంగ్రెస్ కు సోయి లేదు, బిజేపికి పట్టి లేదు. రెండు పార్టీలు తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి. కేంద్రంలో తనకున్న తిరుగులేని బలం వల్లనే చంద్రబాబు నాయుడు ఇష్టారీతిన జలదోపిడి చేస్తున్నడు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆ జలదోపిడిని ప్రశ్నించకుండా, అడ్డుకోకుండా పరోక్షంగా సహకరిస్తున్నడు.
రేవంత్ వైఖరి ఎంత బేలగా, ఎంత హాస్యాస్పదంగా ఉందంటే త్రిమెన్ కమిటీ సమావేశాన్ని డిమాండ్ చేసేంత సత్తా కూడా లేదు. ప్రతి సంవత్సరం కేఆర్ఎబీ పరిధిలోని ఉమ్మడి ప్రాజెక్టులకు సంబంధించి నీటి వినియోగానికి త్రిమెన్ కమిటీ సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఇంతవరకు త్రిమెన్ కమిటీ మిటింగ్ పెట్టలేదు. అంటే బోర్డు వ్యవహారం ఎంతగా దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బోర్డు కేంద్రం కంట్రోల్ లో ఉందా, ఏపీ కంట్రోల్ లో ఉందా అనుమానం వస్తున్నది. కేంద్రం రెండు రాష్ట్రాలను ఎందుకు సమానంగా చూడటం లేదు?
త్రిమెన్ కమిటీ మీటింగ్ పెట్టకుంటే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు? బోర్డు పై సీరియస్ గా ఒత్తిడి చేయరు. త్రిమెన్ కమిటీ మీటింగ్ పెట్టుమని డిమాండ్ చేయరు. నీళ్ళు తరలించుకు పోతుంటే శిలా విగ్రహాల్లాగా పడి ఉంటరు. ప్రేక్షక పాత్ర వహించడానికా మిమ్మల్ని ఎన్నుకున్నది? అప్పుడే నీటి ఎద్దడి ప్రారంభమైంది. సాగు నీటి కోసం సాగర్ ఆయకట్టు రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నరు. నేను బీజేపీని కూడా అడుగుతున్నా 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నరు. ఎందుకు ఎత్తుక తిననా? మొత్తుకు సావనా?
కేంద్రం మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి గారూ.. ఏం చేస్తున్నారు. మీకు బాధ్యత లేదా? మీకు ఏపీ చేస్తున్న జలదోపిడి కనబడటం లేదా? కృష్ణా బోర్డు మీ పరిధిలోనే ఉన్నది. మీరు ఆర్డర్ వేస్తే ఏపీకి తరలిపోతున్న నీళ్లు ఆగవా? ఏపీ జలదోపిడి కిషన్ రెడ్డి గారికి కనబడటం లేదా సికింద్రాబాద్ ప్రజలు కూడా తాగు నీటి సమస్య ఎదుర్కుంటారు. మీరు ఏపీ నీళ్లు తరలింపుపై రివ్యూ చేయండి.
త్రిమెన్ కమిటీ ఎందుకు ఈ సారి సమావేశం కాలేదు? కమిటీ నిర్ణయించకుండా నీళ్ల తరలింపు ఎలా అని ప్రశ్నించండి. మీ ప్రతాపం మా మీదనేనా? సీఆర్పీఎప్ బలగాలు తక్షణం తొలగించాలని కిషన్ రెడ్డి ని కోరుతున్నా. కేసీఆర్ సాగర్ ను తెలంగాణ ప్రభుత్వం పరిధిలో ఉంచేందుకు కొట్లాడారు. మీరు ఎందుకు కొట్లాడటం లేదు? ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు చణాకా కొరటా, చిన్న కాళేశ్వరం, గూడెం ప్రాజెక్టు ఇలా అనేక ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చాం.
అనుమతులు కాదు కదా, చివరి దశలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులను సాధించడం లేదు. డిపిఆర్ లు వాపస్ అవుతున్నయి. పాలమూరు ప్రాజెక్టు, వార్దా, కాళేశ్వరం మూడో టీఎంసీ డీపీఆర్ వెనక్కి వచ్చింది. సీతమ్మ సాగర్ కు అన్ని అనుమతులు తెచ్చినం. చివరి అనుమతి రావాల్సి ఉంటే, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ రిజెక్ట్ చేసింది. సమ్మక్క సాగర్ పరిస్థితి అట్లనే ఉన్నది. ప్రాజెక్టులకు అనుమతులు తేరు, ఉన్న నీటి కేటాయింపులను సక్రమంగా వినియోగించరు.
ఉద్దేశ్యపూర్వకంగా మేడిగడ్డను పండబెట్టిన్రు. గట్టిగ చేస్తే ఆరు నెలల్లో చేసే పని. కాళేశ్వరం కూలి పోయిందని దొంగ ప్రచారం చేశారు. కాళేశ్వరంలో అనేక భాగాల ఉన్నయి. ఏడు బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పియ్యర్ కుంగింది. దాన్ని రిపేర్ చేయకుండా చోద్యం చేస్తున్నారు. రైతులు నీళ్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నరు. కుట్రతో రిపేర్లు ఆలస్యం చేసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నరు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సీఎం చోద్యం చూస్తున్నరు.