Suryaa.co.in

Telangana

చదువుల తల్లికి బాసటగా మంత్రి ఎర్రబెల్లి

-నీట్ లో సత్తా చాటిన శృతికి వెంటనే ఆర్థిక సహాయం
-ఆర్థిక సాయంతో తమ ఔదార్యాన్ని చాటుకున్న దయాకర్ రావు
-ఆమె చదువు పూర్తి అయ్యే వరకు ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా బాధ్యత తీసుకుంటామని హామీ
-శృతిని హైదరాబాద్ కు పిలిపించుకొని శుభాకాంక్షలు తెలిపి, అభినందించిన మంత్రి
-శృతి తల్లి తండ్రులకు మెచ్చుకోలు
-శృతిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు

హైదరాబాద్/జనగామ/పాలకుర్తి, జూలై 3 : ఆమె నిరుపేద దళిత కుటుంబంలో జన్మించింది. కానీ ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. నీట్ పరీక్షలో 454 మార్కులు సాధించింది. జాతీయ స్థాయిలో 9,292 ర్యాంకు తెచ్చుకుంది. ఎస్సీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీటు గ్యారంటీ. కానీ, కనీస ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేని, పేదరికం ఆమెను వెక్కిరించింది. తండ్రి చేసే మేస్త్రి పని కూలీ సరిపోలేదు. తల్లి చేసే కూలీ, తన పై చదువుల ఫీజు కు సరిపోవడం లేదు. తెచ్చుకున్న ర్యాంకు, వచ్చిన మార్కులు, ఆ అమ్మాయిని వెక్కిరించాయి. ఇది జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన చెరిపల్లి శృతి పరిస్థితి.

విషయం తెలుసుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే స్పందించారు. ఆ చదువుల తల్లికి బాసటగా నిలిచారు. శృతిని, ఆమె తల్లదండ్రులను హైదరాబాద్ కు పిలిపించుకొని శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.
శృతిని బాగా చదివించిన ఆమె తల్లి తండ్రులను మంత్రి మెచ్చుకున్నారు. నీట్ లో సత్తా చాటిన శృతికి వెంటనే ఆర్థిక సహాయం అందచేశారు. ఆమె చదువు పూర్తి అయ్యే వరకు ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. శృతిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

కాగా, శృతి కి సంబందించిన సమస్యను ఓ విలేకరి ట్వీట్ చేయగా, ప్రతిగా ఆ బాధ్యత మేము తీసుకుంటామని ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణ శాఖల మంత్రి కేటీఆర్ రీ ట్వీట్ చేశారు. అయితే, ఆ బాధ్యతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీసుకున్నారు.

తన నియోజకవర్గానికి చెందిన శృతి చూపిన గొప్ప ప్రతిభకు తాను సాయంగా, ఊతంగా నిలిచారు. అన్నా అంటే నేనున్నా అనే దయన్న, స్పందనకు శృతితో పాటు, ఆమె తల్లిదండ్రులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ధన్యవాదాలు తెలిపారు. తమకు బాసటగా నిలిచిన మంత్రి కి రుణపడి ఉంటామని అన్నారు. అందుకు మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

LEAVE A RESPONSE