– విజన్ డాక్యుమెంట్ కాదు.. ‘విజన్ లెస్’ డాక్యుమెంట్
– క్యూర్, ప్యూర్, రేర్ అంటూ అంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్
– గ్లోబల్ సమ్మిట్ లో MOU ల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లేవు అని మండిపాటు
– నీ చెత్త విధానాలు, చిల్లర చేష్టలు, వాటాలు, కమీషన్ల కోసం కేసీఆర్ చేసిన అభివృద్ధిని నాశనం చెయ్యకు
– పెట్టుబడుల కట్టుకథలు చెప్పి, కోట్లు ఖర్చు చేసి గ్లోబల్ సమ్మిట్ అట్టర్ ఫ్లాప్ చేశారంటూ రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం
– దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి
– రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ సవాల్
హైదరాబాద్: రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి నువ్వు తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి? ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి.. దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలి. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి గ్లోబల్ సమ్మిట్ వేదికగా టోనీ బ్లెయిర్, సుబ్బారావు గారు ఇచ్చిన కితాబు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు.
రేవంత్ రెడ్డి నిర్వహించింది గ్లోబల్ సమ్మిట్ లాగా లేదు, భూములు అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్ పో లాగా ఉంది. ఫ్యూచర్ సిటీ వేదికగా రేవంత్రెడ్డి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పరువు పోగొట్టుకున్నది. అందాల పోటీల్లాగే, ఏఐ సమ్మిట్ లాగే.. గ్లోబల్ సమ్మిట్ కూడా అట్టర్ ఫ్లాప్ షో అయ్యింది.
విజన్ డాక్యుమెంట్ లో విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదు. విజన్ డాక్యుమెంట్ ప్రిపరేషన్ లో కమిట్మెంట్ లేదు. ఆ డాక్యుమెంట్ కు శాంటిటీ లేదు? అక్షరాలు, అంకెలు, రంగు రంగుల పేజీలతో అర్థం లేకుండా అల్లిన అబద్ధాలు, అర్థ సత్యాల ‘విజన్ లెస్’ డాక్యుమెంట్ అది. రెండేళ్ల పాలన వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రేవంత్ రెడ్డి చేసిన పీఆర్ స్టంట్ గ్లోబల్ సమ్మిట్.
గ్లోబల్ సమ్మిట్ అని మూడు నెలల నుంచి ఊదరగొట్టారు.
18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 5వేల మంది విదేశీ ప్రతినిధులు వస్తరు అన్నరు. మంత్రులు పోయి ఒక్కో ముఖ్యమంత్రికి స్వయంగా ఆహ్వాన పత్రికలు అందించారు. కనీసం ఒక్క ముఖ్యమంత్రి రాలేదు, 5వేల మంది విదేశీ రిప్రెజంటేటివ్స్ రాలేదు. ఒక్క మీ పార్టనర్ డీకే శివకుమార్ తప్ప. చివరకు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా రాని పరిస్థితి.
గ్లోబల్ సమ్మిట్ లో గ్లోబల్ రిప్రెజెంటేటివ్స్ కరువయ్యారు. ఆఖరుకు ఎంబీఏ విద్యార్థులను, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కోట్ వేసి తెచ్చి కూర్చోబెట్టారు. గ్లోబల్ సమ్మిట్ కాదు అది లోకల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షో ఇది. ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అని, ఆ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసం గ్లోబల్ సమ్మిట్ అని.. అందమైన కట్టుకథ అల్లినవు రేవంత్ రెడ్డి? బయో స్కోప్ సినిమా చూపించావు?
భూముల స్కాం అయిపోయింది. పవర్ స్కాం అయిపోయింది. లిక్కర్ స్కాం అయిపోయింది. ఇప్పుడు ఇగ రియల్ ఎస్టేట్ స్కాం మొదలు పెట్టిండు. రేవంతు గ్లోబల్ సమ్మిట్ పెట్టింది ఫోర్త్ సిటీ వైపు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసమే కానీ, పెట్టుబడుల కోసం కాదు అని అందరికీ అర్థం అయ్యింది. ఫార్మా సిటీ పక్క భూములు ముందుగానే మీ బినామీలతో కొనిపించి లే అవుట్లు చేసి రెడీగా పెట్టుకున్నావు.
ఇప్పుడు అక్కడ గ్లోబల్ సమ్మిట్ అని పెట్టీ, ఆ భూములను తెగ నమ్మడానికి ప్లాన్ వేశావు. గ్లోబల్ సమ్మిట్ పేరిట రియల్ ఎస్టేట్ స్కాం కు తెరతీసావు. పెట్టుబడులు తెచ్చింది లేదు, ఉద్యోగాలు ఇచ్చింది లేదు. రెండేళ్లుగా పెట్టుబడుల పేరిట కట్టు కథలు తప్ప చేసింది ఏం లేదు. 2024 జనవరి నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల మంత్రి దావోస్ సమావేశానికి వెళ్లారు. 40,232 కోట్ల పెట్టుబడులు సాధించినం అని, 2,500 ప్రత్యక్ష ఉద్యోగాలు వస్తయని చెప్పారు. ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి?
ఇదే రాష్ట్ర ప్రభుత్వం 2024 సెప్టెంబర్ నెలలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ -2024 నిర్వహించింది. 100 దేశాల కంపెనీలు పాల్గొన్నరూ, 20 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నం అని డబ్బా కొట్టారు. ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి? జనవరి 2025 వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావాస్ లో జరిగిన సమావేశం సీఎం, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్నం అని అక్కడ ఎంతో తిరిగినట్లు, ఎంతో కష్ట పడ్డట్లు సూటు బూటు వేసుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టించుకున్నరు.
అంతా అయిపోయినంక 16 ప్రపంచ అగ్రగామి కంపెనీలతో సుమారు లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల (1.78లక్షల కోట్లు) పెట్టుబడుల ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నదని ఘనంగా ప్రకటించారు. ఈ ఒప్పందాల ద్వారా 49,550 ఉద్యోగాలు వస్తయి అన్నరు. ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి? పెట్టుబడులు తెస్తం అని రెండు సార్లు దావోస్ పోయిండు. అమెరికా పోయిండు. సౌత్ కొరియా పోయిండు. ఆస్ట్రేలియా పోయిండు, సింగపూర్ పోయిండు, జపాన్ పోయిండు. ఆ పెట్టుబడులు ఏమయ్యాయి? ఆ ఉద్యోగాలు ఎక్కడ వచ్చాయి? నిన్న, మొన్న రెండు రోజుల పాటు జరిగిన సమ్మిట్ లో ఏకంగా 5లక్షల కోట్ల పై చిలుకు పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు అంటున్నరు.
రేవంత్ రెడ్డి… నీకు బహిరంగ సవాల్ విసురుతున్నా.. దమ్ముంటే స్వీకరించు. రెండేళ్లుగా కోట్లు ఖర్చు చేసి నువ్వు తిరిగిన దేశాలు, నిర్వహించిన సమ్మిట్స్ ద్వారా మొత్తం ఎన్ని కోట్ల పెట్టుబడులు వచ్చాయి? అందులో ఎన్ని కంపెనీలు గ్రౌండ్ అయ్యాయి? ఎంత మంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దావోస్ పెట్టుబడులు, అమెరికా, సౌత్ కొరియా, జపాన్, సింగపూర్ కంపెనీలు ఎక్కడకు పోయాయి, పెట్టుబడులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి?
విదేశీ పర్యటనలు, గ్లోబల్ సమ్మిట్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం చూస్తే, ఆచరణకు నోచుకోని ఆరు గ్యారెంటీల వలే ఉన్నాయి. క్యూర్, ప్యూర్, రేర్ అంటూ అంటున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణను కొల్లగొడుతున్న చోర్. 2025-26 బడ్జెట్ ప్రసంగంలో మెగా మాస్టర్ ప్లాన్ 2050 అన్నరు. ఒక్క చోటే పారిశ్రామిక ప్రగతి కేంద్రీకృతం కాకుండా, పారిశ్రామిక వికేంద్రీకరణ జరిపి తెలంగాణలోని అన్ని ప్రాంతాలు, హైదరాబాద్ తరహాలోనే అభివృద్ది చేస్తం అన్నరు. ఇప్పుడేం చేస్తున్నరు. ఫ్యూచర్ సిటీ పేరిట ఒకే ప్రాంతంలో పరిశ్రమల కేంద్రీకరణ చేయాలని చూస్తున్నరు.
మీ చెత్త విధానాలను చూసి ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నయి. ఫ్యూచర్ సిటీ అని ఫార్మాసిటీని బొంద పెట్టినవు కాబట్టే సిగాచి ఇండస్ట్రీస్, విరూపాక్ష ఆర్గానిక్స్ వంటి హైదరాబాద్ బేస్డ్ ఫార్మా కంపెనీలు ఆంద్రాకు తరలివెళ్లాయి. కర్నూల్ జిల్లాలోని ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్క్ లో 2315 కోట్ల పెట్టుబడులు పెట్టి, 3000 ఉద్యోగాలు ఇచ్చే ప్రణాళికలు రూపొందించాయి. ఒకవైపు గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంటే, మరో వైపు హైదరాబాద్ లో నడిరోడ్డుపై మర్డర్లు జరుగుతున్నయి.
తెలంగాణ అంటే బిజినెస్ అంటూ దిగజారుడు నిర్వచనాలు ఇచ్చే మీకు బిజినెస్ చేయడం తప్ప తెలంగాణ ప్రజలు, రైతుల కష్టాలు కనిపించవా? గ్లోబల్ సమ్మిట్ లో MOU ల వెనుక చీకటి ఒప్పందాలు, అంకెల గారడీ తప్ప ప్రజలకు పనికొచ్చే పనులు ఏవీ లేవు. కోట్లాది రూపాయలు దండుకునే స్కెచ్ ను రేవంత్ రెడ్డి గ్లోబల్ సమిట్ లో ఘనం గా అమలు చేస్తున్నారు. అంబానీలు, ఆదానీలు దేశాన్ని దోచుకుంటున్నారని రాహుల్ గాంధీ చెబుతుంటే, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి మాత్రం అంబానీ, ఆదానీలకు తెలంగాణను అమ్మేస్తున్నడు.
రాష్ట్రం లో రాహుల్ గాంధీ ఆలోచనలు పక్కన బెట్టి అదానీ, అంబానీ ప్రతినిధులకు రేవంత్ ఎర్ర తివాచీ పరచడంలో ఆంతర్యం ఏమిటి ? విమర్శలు రావడం తో గతం లో అదానీ ఇచ్చిన వందకోట్ల రూపాయల విరాళం చెక్కును వెనక్కు పంపి గ్లోబల్ సమిట్ ప్రారంభ కార్యక్రమం లో అదానీ కుమారుడు కరణ్ అదానీతో ఒప్పందాలు ఎలా చేసుకున్నారు? సీఎం రేవంత్, కాంగ్రెస్ ముఖ్య నేతల బినామీలతోనే ఒప్పందాలు జరిగాయి. ఆ పూర్తి వివరాలు త్వరలో బయటపెడతాం.
గుజరాత్ సమ్మిట్ అయినా, కేరళ సమ్మిట్ అయినా, కర్ణాటక సమ్మిట్, వెస్ట్ బెంగాల్ సమ్మిట్ అయినా గతంలో పీఆర్ స్టంట్లు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలే కాబట్టే, రేవంత్ గ్లోబల్ సమ్మిట్ పీఆర్ స్టంట్ గా భావించి రాహుల్, ప్రియాంక, ఖార్గేలు ముఖం చాటేశారు. మీరు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ లో, మీ సమక్షంలోనే పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో జరిగిన రికార్డు స్థాయి తెలంగాణ అభివృద్ధి గురించి బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ వివరించారు. తెలంగాణ ఒక మాడల్ అంటూ పొగడ్తలు కురిపించారు.
అదే వేదిక నుండి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు .. కేసీఆర్ పాలనలో వృద్ధిరేటులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ప్రశంసించారు. కేసీఆర్ పదేళ్ళ పాలన గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడే రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ చెత్త విధానాలు, చిల్లర చేష్టలు, వాటాలు, కమీషన్ల కోసం కేసీఆర్ చేసిన అభివృద్ధిని నాశనం చెయ్యకు. నీకు చేతనైతే ఆ అభివృద్ధిని కొనసాగించి చూపు. అంతే గాని చేసిన అభివృద్ధిని విధ్వంసం చేయొద్దు అని హితవు పలుకుతున్నాం.