– ఇందిరాగాంధీపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు
– వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే
– అడ్డగోలుగా మాట్లాడటానికి ఇది ప్లాట్ ఫాం కాదు
– బీజేపీ శాసనసభ్యులకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
హైదరాబాద్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం. సిగ్గుచేటు.వెంటనే క్షమాపణలు చెప్పాల్సిందే. అడ్డగోలుగా మాట్లాడటానికి ఇది ప్లాట్ ఫాం కాదు. పవిత్రమైన శాసన సభ అని గుర్తుంచుకోవాలి.
నేను అయిదో సారి ఎమ్మెల్యేగా గెలిచి సభకొచ్చాను. ఒకటో సారి… రెండో సారి ఇక్కడికి రాలేదు. అధికార పక్షంలో ఉన్నాను. విపక్షంలోనూ ఉన్నాను. సభా మర్యాదల గురించి బీజేపీ శాసనసభ్యులు చెప్తేనే తెలుసుకునే స్టేజ్ లో నేను లేను.
రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించేలా బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తోన్న తీరు సరికాదు. ఇక్కడేమైనా ఊరు పంచాయితీ నడుస్తోందా? ఒక నాయకుడిగా తప్పును సరిదిద్దాల్సింది పోయి… ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాపైనే ఆరోపణలు చేస్తుండటం ఎంత వరకు సమంజసం? మొదటిసారి గెలిచి సభకొచ్చిన సభ్యుడు తప్పుగా మాట్లాడుతుంటే సరిచేయాల్సిన ఆ పార్టీ శాసన సభ్యులు, ఇంకా రెచ్చగొట్టడం ఎంత వరకు సమంజసం?
క్షమాపణలు చెప్పకపోతే… మహిళలపై మీ పార్టీకి గౌరవం లేదని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అదే మీ పార్టీ క్యారెక్టర్ అని అనుకోవాల్సి వస్తోంది. సాధారణంగా మొదటిసారి గెలిచిన సభ్యులు తాము మాట్లాడే క్రమంలో అప్పుడప్పుడు కొద్దిగా ‘స్లిప్’ అవుతుంటారు. అలాంటప్పుడు క్షమాపణ కోరడం సంస్కారం. అది హుందాతనం అనిపించుకుంటుంది.
సభ సజావుగా నడవాలంటే స్పీకర్ ఆదేశాలను ప్రతి ఒక్క సభ్యుడూ పాటించాల్సిందే. మేం చెప్తే స్పీకర్ వినాలనే బీజేపీ శాసనసభ్యుల ఆలోచన తీరు సరికాదు. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి.