Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వం ఉంది పాలించడానికా? అందరిపై దాడులు చేయడానికా?

వైసీపీ అరాచకాలపై టీడీపీ పోరాటం ఆగదు
పోరాడితే పోయేదేయేముంది బానిస సంకెళ్లు తప్ప అన్న శ్రీశ్రీ మాటలు టీడీపీ నరాల్లో ఇంకిపోయింది
టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

వైసీపీ ప్రభుత్వం ఉంది పాలించడానికా? లేక ముప్పొద్దులా అందరిపై దాడులు చేయడానికా? అని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ద్వజమెత్తారు. గురువారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ….జగన్ రెడ్డి పాలనలో పౌర హక్కుల సంగతి దేవుడెరుగు, మానవ హక్కులు కూడా కాలరాస్తున్నారు.

న్యాయవ్యవస్ధ, ఎన్నికల కమిషన్ పై దాడి చేశారు. మండలిలో ఏకంగా శాసన మండలి చైర్మన్ పై వైసీపీ మంత్రులే దాడికి యత్నించారు. నాలుగేళ్ల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయి. వైసీపీ పాలనలో ప్రజలు జీవచ్చవాల్లాగా బ్రతుకుతున్నారు తప్ప ఎవరికి ప్రశాంతత లేదు.

ప్రజలు ఇలా ఉంటే జగన్ రెడ్డికి పైశాచిక ఆనందమా? 70 పేజీల జగన్ ఎన్నికల అఫడవిట్ లో 30 పేజీలు ఆయన కేసుల గురించే. జగన్ పై లెక్కలేనన్ని ఐపీసీ సెక్షన్లు ఉన్నా పాదయాత్రకు చంద్రబాబు నాయుడు సెక్యూరిటి కల్పించారు.
కరుడు గట్టిన నేరస్దుడు జగన్ రెడ్డి, ఒక్క చాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని హింసిస్తున్నారు.

వైసీపీ అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు కాపాడేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. జగన్ రెడ్డి పాలన వల్ల అనుభవిస్తున్న బాధలు, కష్టాలు ప్రజలు లోకేశ్ కి చెప్పుకుంటున్నారు. మరో వైపు వైసీపీ ఎమ్మెల్యేలే జగన్ రెడ్డి పాలన నచ్చక తిరుగుబాటు చేస్తున్నారు. ఇవన్నీ తట్టుకోలేకే యువగళం వాలంటీర్లపై దాడులు చేయించారు. పాదయాత్ర రూట్ మ్యాప్ 24 గంటల ముందే పోలీసులకు ఇస్తారు కానీ వాలంటీర్లపై వైసీపీ గూండాలు ఎలా దాడి చేశారు?

దాడికి గురైన వాలంటీర్లను అర్దరాత్రి తీసుకెళ్లి అనేక ప్రాంతాలు తిప్పి కొడతారా? పైశాచిక ఆనందం ఇచ్చేది పోలీసులైతే , పైశాచిక ఆనందం పొందేది జగన్ రెడ్డి. దాడులు చేయటం కాదు, చేతనైనే రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయండి. ఎన్ని దాడులు చేసినా టీడీపీ భయపడదు, పోరాడితే పోయేదేయేముంది బానిస సంకెళ్లు తప్ప అన్న శ్రీశ్రీ మాటలు టీడీపీ నరాల్లో ఇంకిపోయింది. జగన్ రెడ్డి బెదిరింపులకు భయపడేది లేదు, పోరాటం చేస్తాం వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని పంచుమర్తి అనురాధ అన్నారు.

LEAVE A RESPONSE