– కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన మాటలు కేటీఆర్ మరిచిపోయారా?
– సచివాలయంలో సమీక్ష చేస్తా
– కేసీఆర్ చేసిన దీక్ష కూడా నాటకంలో భాగమే
– సోనియాను కలిసిన మీకు మాది చిల్లర పార్టీ అనిపించిందా?
– కేటీఆర్పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నల వర్షం
హైదరాబాద్: ” కాంగ్రెస్ పార్టీని విమర్శించిన కేటీఆర్కు క్యారెక్టర్ లే దు . తెలంగాణ ఇచ్చిన పార్టీపై ఇలా మాట్లాడటం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం. వందేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మీకు థర్డ్ క్లాస్ పార్టీగా, చిల్లర పార్టీగా కనిపిస్తోందా? ఆ పార్టీ నుంచే రాజకీయాలు నేర్చుకున్న మీ నాన్న కేసీఆర్ కూడా థర్డ్ క్లాసే కదా?” అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
తాను సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాను సమీక్షలు చేస్తానని, వాటిని ఆపేది లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.
సోనియా గాంధీ వల్లే తెలంగాణ సాధ్యమైందని స్వయంగా కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన మాటలను కేటీఆర్ మరిచిపోయారా? తెలంగాణ రాకపోయి ఉంటే కేటీఆర్ కుటుంబం పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని ధ్వజమెత్తారు. ఆయన తాత, నానమ్మ బతికి ఉంటే ఇలాంటి మాటలకు చెంప మీద కొట్టేవారని వ్యాఖ్యానించారు.
సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే మీరు అమెరికాలో జీతం మీద బతికేవారు. మీ కుటుంబం వేల కోట్లు సంపాదించే అవకాశం ఉండేది కాదని మండిపడ్డారు. తెలంగాణ ఇచ్చిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు లేనిది, ఇప్పుడు కాంగ్రెస్ చిల్లర పార్టీగా ఎందుకు కనిపిస్తోందని జగ్గారెడ్డి ప్రశ్నించారు.
పదేళ్లు మంత్రిగా పనిచేసినా కేటీఆర్కు రాజకీయ పరిణతి రాలేదని, బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, కేసీఆర్ చేసిన దీక్ష కూడా నాటకంలో భాగమేనని జగ్గారెడ్డి ఆరోపించారు.