Suryaa.co.in

Telangana

వీఎల్ఎఫ్ రావడం గర్వకారణం

– దేశం ఉంటేనే మనం ఉంటాం
– ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు
– రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నా
– వికారాబాద్ పూడూర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

వికారాబాద్: దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్రం మరో కీలక అడుగు ముందుకు వేయబోతోంది. దేశ రక్షణకు సంబంధించి కీలకమైన డిఫెన్స్,ఎన్.ఎఫ్.సీ లాంటి కేంద్రాలకు హైదరాబాద్ గుర్తింపు పొందింది. కొందరు వీఎల్ఎఫ్ ను వివాదం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

వీఎల్ఎఫ్ తో ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. తమిళనాడులోనూ 1990లో ఇలాంటిదే ప్రారంభించారు. అక్కడి ప్రజలకు ఎలాంటి నష్టం జరగలేదు. దేశంలో రెండో వీఎల్ఎఫ్ మన ప్రాంతంలో రావడం గర్వకారణం. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను తెలంగాణ సమాజం గుర్తించాలి.

వివాదాలకు తెరలేపుతున్నవారు దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దేశం ఉంటేనే మనం ఉంటాం. మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసే ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసేవారికి కనువిప్పు కలగాలి.

2017లోనే భూ బదలాయింపు, నిధుల కేటాయింపు లాంటి పూర్తి నిర్ణయాలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. ప్రాజెక్టును ప్రారంభించాలని రాజ్ నాథ్ సింగ్ అడగగానే మేం కొనసాగించాం. దేశ రక్షణ విషయంలో రాజీ పడొద్దనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించా.

పర్యావరణ ప్రేమికులకు నేను ఒకటే చెబుతున్నా. దేశం, దేశ ప్రజలు సురక్షితంగా ఉంటేనే పర్యావరణ రక్షణ గురించి ఆలోచించగలం. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్ట్ ను వివాదాస్పదం చేయడం సమంజసం కాదు. ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, రాజకీయాలు. దేశ రక్షణ విషయంలో కలిసికట్టుగా ముందుకెళ్లాలి.

వీఎల్ఎఫ్ ను ముందుకు తీసుకెళ్లేందుకు మా ప్రభుత్వం పూర్తి మద్దతుగా ఉంటుంది. ఇక్కడ ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయానికి వచ్చేవారిని అనుమతించాలని, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి విజ్ఞప్తి చేస్తున్నా. ఆలయానికి ఇబ్బందులు కలిగించొద్దని కోరుతున్నా.

ప్రజల సెంటిమెంట్, విశ్వాసాన్ని గౌరవించి ఆలయానికి వెళ్లేందుకు దారి ఇవ్వాలని కోరుతున్నా. ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విద్యా సంస్థల్లో, ఈ ప్రాంత ప్రజలకు 1/3వ వంతు సీట్లు కేటాయించాలని కోరుతున్నా.

LEAVE A RESPONSE