-సూపర్సిక్స్ అమలు ఊసే ఎత్తని ప్రభుత్వం
-తొలి ఓవర్లోనే బాబు సర్కార్ డక్అవుట్
-సంపద సృష్టిస్తామన్నారు…. ఏమైంది?
-అప్పులు చేస్తూ పోవడమే సంపదా?
-హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం చంద్రబాబు విడుదల చేసింది శ్వేతపత్రం కాదని.. అది ఒక సాకు పత్రమని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. అసలు శ్వేతపత్రానికే అర్ధం మార్చిన చంద్రబాబు.. రాష్ట్రాభివృద్ధి కోసం వాస్తవ పరిస్థితులు వివరిస్తూ, తామేం చేయబోతున్నామో చెప్పకుండా.. గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ.. అన్నింటికీ మమ్మల్ని బాధ్యులను చేస్తూ.. వైట్పేపర్ల పేరుతో డ్రామాలు చేస్తున్నారని బుగ్గన ఆక్షేపించారు.
ఎన్నికల ముందు టీడీపీ అట్టహాసంగా ప్రకటించిన సూపర్ సిక్స్.. అమలుకు ముందే, తొలి ఓవర్లోనే డకౌట్ అయిందని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. బాబు వైఖరి చూస్తుంటే.. ‘మీరంతా కొండను ఎత్తి, నా నెత్తిపై పెట్టండి. నేను దాన్ని మోస్తాను’ అన్నట్లు ఉందని బుగ్గన వ్యాఖ్యానించారు.
రాష్ట్ర ఆదాయం రూ.2.40 లక్షల కోట్లు కాగా.. రెగ్యులర్ జీతభత్యాలు, పెన్షన్లు, సబ్సిడీలు, పీడీఎస్, అప్పులకు వడ్డీలు, ఇతర పరిపాలన అవసరాల కోసమే రూ.2.50 లక్షల కోట్లు ఖర్చవుతుందన్న ఆయన.. ఆ అవసరల కోసమే ఏటా రూ.10 వేల కోట్లు అప్పు చేయల్సిన పరిస్థితి ఉందని చెప్పారు.
మరి అలాంటప్పుడు ఏటా, దాదాపు లక్షన్నర కోట్ల వ్యయమయ్యే పథకాలను చంద్రబాబు ఎలా ప్రకటించారని ప్రశ్నించారు. వాటిని అమలు చేయలేరన్న విషయం తెలుసు కాబట్టే.. ఇప్పుడు శ్వేతపత్రాల పేరుతో సాకు పత్రాలు రిలీజ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి రూ.15 వేలు, 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500, ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి, రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.20 వేలు.. వీటన్నింటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా స్కూళ్లు తెరిచిన నేపథ్యంలో తల్లికి వందనం అమలు కావాల్సి ఉందని గుర్తు చేశారు.
తమ హయాంలో 2014–19 మ«ధ్య, స్ధూల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెంచామని చంద్రబాబు వైట్పేపర్లో చెప్పుకోవడాన్ని తప్పు పట్టిన బుగ్గన, కోవిడ్ పీరియడ్.. అది లేని కాలంతో ఎలా పోలుస్తారని ప్రశ్నించారు.
నిజం చెప్పాలంటే.. టీడీపీ పాలన కంటే, తమ హయాంలోనే స్థూల ఉత్పత్తిలో కాస్త వృద్ధి సాధించామన్న ఆయన.. 2014 నుంచి 2019 వరకు దేశ స్ధూల ఉత్పత్తిలో రాష్ట్ర స్ధూల ఉత్పత్తి నిష్పత్తి 4.47 కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4.82 గా నమోదైందని చెప్పారు. అది 0.4 శాతం ఎక్కువని వివరించారు.
అదే విధంగా పారిశ్రామిక రంగానికి సంబ«ంధించి, దేశ జీడీజీలో రాష్ట్ర జీడీపీ వాటా 2014 నుంచి 2019 వరకు 2.98 శాతం కాగా, అదే 2019 నుంచి 2024 వరకు 4 శాతమని గుర్తు చేసిన ఆయన, తమ హయాంలో 1.1 శాతం పెరిగిందని.. అయినా తమ పాలనలో ఇక్కడికి పరిశ్రమలు రాలేదని అసత్య ప్రచారం చేశారని ఆక్షేపించారు.
రాష్ట్రంలో టీడీపీ పాలన చివరి ఏడాది 2018–19లో తలసరి ఆదాయం రూ.1,54,031 కాగా, ఆ పెరుగుదల 11.38 శాతం అని చెప్పారు. అదే తమ ప్రభుత్వ పాలనలో చివరి ఏడాది.. 2023–24లో తలసరి ఆదాయం రూ.2,19,518 కాగా, అది 13.98 శాతం పెరుగుదల అని వెల్లడించారు. దీంతో మన రాష్ట్రం 18వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరిందని చెప్పారు. అంతేకాక, సులభతర వాణిజ్యం (ఈఓడీబీ)లో రాష్టం వరసగా నెంబర్ వన్గా నిల్చిందన్న బుగ్గన, ఇది అభివృద్ధి కాక, మరేమిటని ప్రశ్నించారు.
టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ 50 రోజుల్లోనే అపరిమితంగా అప్పు చేసిందని మాజీ ఆర్థిక మంత్రి తెలిపారు. గత జూన్ 20న రూ.2 వేల కోట్లు, జూలై 2న రూ.5 వేల కోట్లు, జూలై 16న మరో రూ.2 వేల కోట్లు అప్పు చేశారని చెప్పారు.
ఈ విషయాన్ని ఎల్లో మీడియా ఎందుకు రాయదని ప్రశ్నించిన ఆయన.. ‘మరి మేం చేస్తే అప్పు, టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తే నిప్పా’ అని కడిగి పారేశారు. అంతకు ముందు హయాంలో ఒకేరోజు రూ.5 వేల కోట్ల అప్పు చేసినా, ఎల్లో మీడియా రాయలేదని ఆక్షేపించారు.
2014–19 మధ్య రాష్ట్ర అప్పులు 21 శాతం పెరిగితే, తమ హయాంలో 2019–24 మధ్య ఆ పెరుగుదల 12 శాతం మాత్రమే అని మాజీ ఆర్థిక మంత్రి వెల్లడించారు.
రాష్ట్ర విభజన తరవాత, ఆంధ్రప్రదేశ్ అప్పులు 2014లో రూ.1,18,051 కోట్లు ఉంటే, 2019 నాటికి, అంటే టీడీపీ ప్రభుత్వం గద్దె దిగేనాటికి అవి రూ.2,71,795 కోట్లకు చేరుకున్నాయని.. అంటే టీడీపీ హయాంలో అప్పులు 21.63 శాతం పెరిగాయని చెప్పారు.
అదే తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పులు రూ.5.18 లక్షల కోట్లు కాగా, అది 2019–24 మధ్య కేవలం 12.9 శాతం పెరుగుదల మాత్రమే అని తెలిపారు. అయినా ఎల్లో మీడియా దారుణంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
సంపద సృష్టిలో తాము స్పెషలిస్టులమని చంద్రబాబు చెప్పుకుంటారని.. కానీ అది పూర్తిగా అవాస్తవమని బుగ్గన వెల్లడించారు.
2014–15లో రాష్ట్ర ఆదాయం రూ.90,672 కోట్లు కాగా, 2019లో ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ మొత్తం కేవలం రూ.1,14,671 కోట్లు మాత్రమే అన్న ఆయన, ఆదాయం ఏటా 6.09 శాతం పెరిగిందన్నారు.
అదే తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం 16.7 శాతం పెరిగిందన్న ఆయన, ఆ గణాంకాలు చెబుతూ.. 2019–20లో రాష్ట్ర ఆదాయం రూ.1,11,034 కోట్లు కాగా, 2023–24 నాటికి అది రూ.1,76,448 కోట్లకు చేరిందని వివరించారు.
ఆనాడు మేము అధికారంలోకి వచ్చిన తరవాత, 2019 జూలైలో అయినా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టామన్న ఆయన, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఓట్ ఆన్ ఎక్కౌంట్కు పోవడాన్ని ప్రశ్నించారు.
నిజానికి రాష్ట్ర నికర అప్పు రూ.4,38,278 కోట్లు అన్న బుగ్గన, పబ్లిక్ అకౌంట్స్ లయబిలిటీ కింద మరో రూ.80,914 కోట్ల రుణాలున్నాయని తెలిపారు. కార్పొరేషన్ రుణాలు రూ.2.18 లక్షల కోట్లు కాగా, అవి రూ.2.48 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.90 వేల కోట్లు, ఇంకా అప్లోడ్ చేయలేదన్న ఆయన, వాటిని రుణాలుగా ఎలా చూపుతారని ప్రశ్నించారు. ఇంకా ఉద్యోగుల బకాయిలు కూడా కలుపుకున్నా, మొత్తం అప్పులు దాదాపు రూ.7 లక్షల కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు. ఇంకా, తాము తీసుకొచ్చిన ‘గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్’ (జీపీఎస్) ను ఇప్పుడు దేశమంతా అమలు చేయాలని కేంద్రం యోచిస్తోందని చెప్పారు