Suryaa.co.in

Andhra Pradesh

టీటీడీ చైర్మన్ పదవి రాజకీయ పోస్టింగ్‌గా మారడం దురదృష్టకరం

– భూమన కరుణాకర్ రెడ్డి నియామకంపై మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియామకంపై టీటీడీ మాజీ ఈవో, మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ ధర్మంపై అచంచల విశ్వాసం, నమ్మకం ఉన్న వ్యక్తులనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించాలి అని సూచించారు.

టీటీడీ చైర్మన్‌గా భూమన కరునాకర్ రెడ్డి నియామకంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఓ పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా కరుణాకర్‌రెడ్డికి టీటీడీ చైర్మన్‌ పదవి అంటూ పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను ఆ పోస్టుకు ఐవైఆర్ కృష్ణారావు జతచేశారు.

‘ఇది రాజకీయ పోస్టింగ్‌గా మారడం దురదృష్టకరం. హిందూ ధర్మ సంస్థల విషయంలో ఏ విధంగా వ్యవహరించినా తమను అడ్డుకునేవారు లేరనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎంత త్వరగా హిందూ ధర్మ సంస్థలపై ప్రభుత్వ అజమాయిషీని తప్పిస్తే, హిందూ ధర్మానికి అంత మంచిది’ అంటూ ఐవైఆర్ కృష్ణారావు సూచించారు.

LEAVE A RESPONSE