Suryaa.co.in

Andhra Pradesh

యూనివర్సిటీని రాజకీయ కేంద్రంగా మార్చిన జగన్ బావమరిది!

• చంద్రబాబుపై రాళ్లు వేసిన వారినే నెత్తిన పెట్టుకుంటున్నారంటూ టీడీపీ నేతల ఫిర్యాదు
• పనులు చేయకుండానే లక్షలు కొట్టేసిన వైసీపీ నేతపై చర్యలకు వినతి
• భూ కబ్జాలు.. ఆన్ లైన్ సమస్యలపై పోటెత్తిన భూ బాధితులు
• సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సాయం, ఉద్యోగాలు, పింఛన్ లతో పాటు పలు సమస్యలపై పోటెత్తి అర్జీదారులు

మంగళగిరి: కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిల బావమరిది ప్రొఫెసర్ సురేంద్రనాథ్ రెడ్డి యోగివేమన విశ్వవిద్యాలయాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని.. విశ్వవిద్యాలయంలో వైసీపీకి అనుకూలమైన వ్యక్తులను నియమించుకుని అవినీతి అక్రమాలు, అనైతిక కార్యక్రమాలకు పాల్పడ్డారని.. గత ప్రభుత్వం అండతో వారి అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని.. వారు ఆడిందే ఆట.. పాడిందే పాటగా చట్టాలను నిబంధనలను తుంగలో తొక్కి.. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీవేజెస్ ఇతర బోధనేతర ఉద్యోగాల్లో రిజర్వేషన్ పాటించకుండా.. అక్రమాలకు తెరలేపారని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి వి. గంగా సురేష్ శనివారం ఇక్కడి తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలను కలిసి ఫిర్యాదు చేశారు.

విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా వినతులు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాశ్రీనివాసరావు, శ్రీరామ్ చిన్నబాబులు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని విద్యార్థి సంఘ సభ్యులకు హామీ ఇచ్చారు. సమస్యలపై వచ్చిన ఇతర అర్జీదారులనుండి వినతులు స్వీకరించారు.

• గత వైసీపీ పార్టీతో అంటకాగి.. ఆ పార్టీ కోసం పోస్టల్ ఓట్లను కూడా వైసీపీకి వేయించిన అధికారులను వెనకేసుకు రావడం.. టీడీపీ అధినేత చంద్రబాబు యర్రగొండపాలెం పర్యటనకు వచ్చినప్పుడు ఆయనపై రాళ్లు వేయించిన వారిని నేడు నెత్తిన పెట్టుకోవడం వలన యర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ పూర్తిగా నష్టపోతుందని దీన్ని పార్టీ పెద్దలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని నియోజకవర్గం నుండి వచ్చిన పలువురు టీడీపీ నేతలు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలిగాంట్ గ్రామానికి చెందిన. ఎస్. శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తూ.. వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పి. జయరామరెడ్డి పనులు చేయకుండా లక్షల్లో డబ్బులు దోచుకున్నారని.. మంచినీటి బోర్లు వేయకుండా, ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయకుండా చేసినట్టు చూపించి డబ్బులు మింగారని విచారించి చర్యలు తీసుకోవాలని నేతలకు ఫిర్యాదు చేశారు.
• తాము ఉపాధి కోసం ఊరువిడిచి వెళితే వచ్చేసరికి తమ తండ్రి తమకు ఇంటికోసం ఇచ్చిన స్థలాన్ని ఆక్రమించారని.. ఆక్రమణదారుల నుండి తమ స్థలాన్ని విడిపించి న్యాయం చేయాలని కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం మధిరపాడు గ్రామానికి చెందిన దొరగుడి ప్రభుదాసు నేతలకు విన్నవించుకున్నారు.
• ఎమ్మార్వో, వీఆర్వో లు ఎటువంటి విచారణ జరపకుండా పై అధికారులకు తప్పుడు నివేదికలు ఇచ్చి తమకు అన్యాయం చేశారని.. సర్వేనెంబర్ లు మార్చి మోసం చేశారని.. తప్పుడు పనులు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జల్లా వీకోట మండలం మద్దిరాళ్లగ్రామానికి చెందిన నారాయణస్వామి గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• అనంతపురం మండలం సంగమేశ్వరకాలనీకి చెందిన చింతా నారాయణ విజ్ఞప్తి చేస్తూ.. శంకర పెద్దన్న అనే వ్యక్తి తమ భూమికి గవర్నమెంట్ సర్వేయర్ తో సర్వేచేయించి రాళ్లు పాతిస్తామని చెప్పడంతో అతనికి రూ. 40,000 ఇచ్చామని.. తీరా చూస్తే.. దొంగ సర్వే చేసి దొంగ పత్రాలు ఇచ్చి పోయారని తమకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని వేడుకున్నారు.
• కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లద్దిపల్లె గ్రామానికి చెందిన మాల వరాదమ్మ విజ్ఞప్తి చేస్తూ.. 2011 లో ప్రభుత్వం ద్వారా పట్టా పొంది ఇప్పటికి తమ స్వాధీనంలో ఉన్న భూమిని తమదంటూ.. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన సురేష్ తమను బెదిరిస్తునారని.. తమకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.
• తన భర్త చనిపోయారని.. తన పేరు గుమ్మడి సుశీలమ్మని తనది గుంటూరు జిల్లా చుండూరు మండలం దున్దిపాలెం గ్రామమని.. తన భర్త పేరున మంజూరైన ఇంటి స్థలాన్ని తన పేరుమీద మార్చమంటే వీఆర్వో బట్టు బాలశౌరి రూ. లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నారని తనకు న్యాయం చేయాలని ఆమె నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
• కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా అధికారులు తన ప్లాట్ ఎక్కడ ఉందో చూపించమంటే పట్టించుకోవడంలేదని ఎమ్మార్వో ఆఫీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చెందిన ఎస్‌. వైజుల్లా నేతల మందు ఆవేదన వ్యక్తం చేశారు.
• పుంగనూరు లో జరిగిన గొడవల్లో తాను టీడీపీ కార్యకర్తనని తనపై అక్రమ కేసులు బనాయించారని అదే సమయంలో తన భార్యను ఆసుపత్రిలో చేర్పించగా ఆపరేషన్ సక్రమంగా చేయకపోవడంతో ఉన్న చూపు కూడా పోయిందని. తన భార్యకు మళ్లీ ఆపరేషన్ చేయాలని ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని పుంగనూరు మండల పుంగనూరుకు చెందిన యం. నాగరాజు నేతలకు విజ్ఞప్తి చేశారు.
• నూజివీడు మండలం మీర్జాపురం పంచాయతీ కండ్రిక గొల్లగూడెం గ్రామానికి చెందిన పలువురు ఉపాధి కూలీలు విజ్ఞప్తి చేస్తూ.. మీర్జాపురం ఉపాధి హామీ పధకం ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న బొమ్మనబోయిన విమలాదేవి తన విధి నిర్వహణలో అవకతవకలకు పాల్పడిన రూ. 6,35,969 లను వెంటనే రికవరీ చేసి కూలీలకు అందచేయాలని వారు అర్జీ ఇచ్చారు.
• అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన చింబిలి శ్రీకాంత్ విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వంలో ఆపార్టీ నేతల ఒత్తిడి మేరకు తహశీల్దార్ సుమతి తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వన్‌బీ అడంగల్ ను తొలగించి తమ భూమిని అరుణమ్మ భర్త ఎర్రిస్వామి పేరుపైకి మార్చి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
• భూమి తమదే అని కోర్టు నుండి ఆర్డర్ వచ్చిందని.. దాంతో తాము భూమిని సాగుచేసుకుంటుంటే. వైసీపీ నేతల అండతో తమను భూమిలోకి వెళ్లనివ్వడంలేదని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని తమకు న్యాయం చేయాలని గురజాలకు చెందిన ఉన్నం నాగేశ్వరరావు నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
• ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ళ నుండి 62 సంవత్సారాలకు పెంచాలని పి. గుర్రయ్య నేతలను కలిసి అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.

వికలాంగ పింఛన్ లు.. నూతన రేషన్ కార్డులు, చదువుకోసం ఆర్థిక సాయం , కారుణ్య నియామకాలు, సంఘీక సంక్షేమ హాస్టళ్ల ఏర్పాటు, గ్రామాల్లో మౌలిక వసతులు, ఉద్యోగాలు, కమ్యునిటీ భవనాలు, గత టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన బిల్లులు వాటి పరిష్కారాల కోసం పెద్ద సంఖ్యలో వచ్చిన అర్జీలను నేతలు స్వీకరించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు.

LEAVE A RESPONSE