– ప్రజలు దీన్ని వదిలించుకుంటేనే సుఖశాంతులు
– ముఖ్యమంత్రి పదవికి జగన్ తగరని సుప్రీం వ్యాఖ్యలు స్పష్టం
– కక్షపూరిత రాజకీయాలకు సుప్రీంకోర్టును వాడుకోవడం దుర్మార్గం
– వ్యక్తిగత రాజకీయాలకు సీఐడీని అనుబంధ సంస్థలా జగన్ వాడుతున్నారు
– మూడున్నరేళ్లలో సీఐడీ కేసుల్లో ఒక్క చార్జిషీటు కూడా వేయలేదు
– జగన్ కు నైతిక విలువలుంటే తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
రాష్ట్రానికి మూడున్నరేళ్ల క్రితం జగన్ అనే గ్రహణం పట్టిందని, దీన్ని వదిలించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. జగన్ గ్రహణం వదిలితేనే రాష్ట్రానికి సుఖశాంతులు ఉంటాయని స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…
‘‘జగన్మోహన్ రెడ్డి సార్థ్యంలో నడుస్తున్న వైసీపీ ప్రభుత్వం లజ్జావిహీనంగా, నిస్సిగ్గుగా వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీ రాజకీయ కక్షల్లో మేం భాగస్వాములం కాలేం…మీరు మా దగ్గరకు రావొద్దు….మీ రాజకీయ ప్రతీకారంలోకి మమ్మల్ని లాగవద్దు…అంటూ చేసిన వ్యాఖ్యలను బట్టి జగన్ రెడ్డికి ఏమాత్రం నైతిక విలువలున్నా తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి.
ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి పదవిలో నీలం సంజీవరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్), నారా చంద్రబాబు వంటి వాళ్లు ఉంటే…తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేసేవాళ్లు. మీకు నిజంగా నైతిక విలువలుంటే ఎవరైనా పారదర్శకంగా పరిపాలించే నాయకులను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి, తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. జగన్ ప్రభుత్వం పూర్తిగా రాజకీయ కక్షలకు పాల్పడుతోంది.
2012లో జగన్ రెడ్డిపై ఉన్న సీబీఐ కేసుల్లో బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో సుప్రీం ధర్మాసనం ‘‘ఇంత తక్కువ సమయంలో ఇంత ఎక్కువ డబ్బులు ఇతనికి ఎలా వచ్చాయో చాలా లోతుగా సునిశితంగా దర్యాప్తు చేయండి’’ అంటూ చేసిన వ్యాఖ్యలతోనే జగన్ రెడ్డి రాజకీయంగా పతనమయ్యారు. అయినా సరే జగన్ రెడ్డి నవ్విపోదురు నాకేటి అనే విధంగా వ్యవహరిస్తున్నారు.
కక్షపూరిత రాజకీయాలకు సీఐడీ అనుబంధ సంస్థ
జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత కక్షపూరిత రాజకీయాలు చేసేందుకు ఏపీ సీఐడీ సంస్థను వైసీపీ అనుబంధ సంస్థలా వాడుకుంటున్నారు. సీఐడీ చీఫ్ ఈ అనుబంధ సంస్థకు పెద్దలా వ్యవహరిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలో అరెస్టులకు పాల్పడిన ఏ ఒక్క కేసులోనూ ఒక్క చార్జిషీటు కూడా వేయలేదు. కేవలం ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను వేధించడానికి సీఐడీ ని జగన్ తన జేబు సంస్థలా వాడుకుంటున్నారు. సీఐడీ జగన్ రెడ్డి డైరెక్షన్ లో పనిచేస్తోంది. జగన్ పాలనలో సీఐడీ పోలీసులు అర్థరాత్రే అరెస్టులకు పాల్పడుతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్టు మొదలు ఇటీవల అయ్యన్నపాత్రుడు అరెస్టు వరకు మొత్తం అర్ధరాత్రి అరెస్టులే. సీఐడీ పోలీసులు చీకటి రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. ఉదయం పూట అరెస్టులు చేయకూడదా? సీఐడీ తీరుపై జగన్ రెడ్డి, సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ప్రజలకు సమాధానం చెప్పాలి.
జగన్ నీకు జీసస్ పేరెత్తే అర్హత లేదు
జగన్ రెడ్డి నోరెత్తితే ఆ దేవుడి దయతో అని అంటారు. జగన్ రెడ్డి నమ్ముకున్నది కరుణామయుడు జీసస్ ని. జగన్ రెడ్డి జీసస్ నిన్ను కక్ష, కార్పణ్యంతో బ్రతకమని చెప్పాడా? కక్షపూరిత రాజకీయాలు, హత్యారాజకీయాలు చేయమని చెప్పాడా? నీ మనసులోని ఫ్యాక్షనిస్టుని జీసస్ పేరు చెప్పి కప్పిపుచ్చుకోవాలనుకోవడం దుర్మార్గం. నీకు జీసస్ పేరెత్తే అర్హత లేదు. ఇంకెప్పుడూ దేవుడి దయ అనొద్దు. సజ్జల దయ, వైసీపీ దయ అని అంటే బాగుంటుంది.
భావితరాలకు ఏం సందేశం ఇస్తున్నారు జగన్?
మీ కక్షపూరిత రాజకీయాలు, కోర్టులు వేసే మొట్టికాయలు, చెంపదెబ్బలుతో భావి తరానికి ఏం సందేశం ఇస్తున్నారో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మీ పాలనలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చెప్పిన విధంగా పరిపాలన ఎక్కడా కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో పారదర్శకత, చట్టబద్దత పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని వైసీపీ నాయకులు ఖూనీ చేశారు. ఇలాంటి పరిపాలన చూసి భావితరాలు ఏం నేర్చుకోవాలి? రానున్న తరాల భవిష్యత్తు ఎలా ఉండాలి?
జగన్ గ్రహణాన్ని సీబీఐ ఎలా ఛేదిస్తుందో చూడాలి
వివేకానందరెడ్డి హత్య కేసుకు జగన్ గ్రహణం పట్టిపీడిస్తోంది. హత్య కేసును ముందుకు కదలకుండా ఎక్కడికక్కడ ఆటంకాలు సృష్టిస్తోంది. సీబీఐ అధికారులను బెదిరించడం, తప్పుడు కేసులు పెట్టి వేధించడం చేస్తోంది. హంతకులెవరో సీబీఐ చెప్పినా వారికి కొమ్ముకాస్తోంది. మూడున్నరేళ్ల పైబడి వివేకా హత్య కేసుకు పట్టిన ఈ జగన్ గ్రహణాన్ని సీబీఐ ఎలా ఛేదిస్తుందో వేచిచూడాలి.