Suryaa.co.in

Andhra Pradesh

జగన్ ప్రభుత్వానికి దళితులు అంటే ప్రేమ లేదు… చెప్పేవన్నీ అబద్ధాలే

-దళితులపై ధమనకాండ కొనసాగిస్తున్న జగన్ సర్కార్
-మీకో న్యాయం… ఉండవల్లి శ్రీదేవి, రఘురామకృష్ణం రాజుకు మరోక న్యాయమా?
-దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కోసం పార్లమెంటులో పోరాడుదాం… రండి!
-రాజ్యాంగ సవరణ జరగకుండా దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఎలా సాధ్యం ?
-రంగనాథ స్వామి మార్కెట్ యార్డ్ పేరు మార్చడం… హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే
-తనని అనర్హునిగా ప్రకటించమని కోరిన మీరే… ఇప్పుడు మా పార్టీ సభ్యుడని ప్రకటించడం సిగ్గుచేటు
-పార్టీలో ఉంచుకుంటే ఉంచుకో… పీక్కుంటే పీక్కో
-దగాపడ్డ రాజధాని రైతులదే అంతిమ విజయం… దగా కోరులది కాదు
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

దళితులంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఏ మాత్రం ప్రేమ లేదు. దళితులపై రాష్ట్రంలో ధమనకాండ కొనసాగుతోంది. పెత్తందారులతో పోరాడుతున్నాను. పేదల పక్షాన, దళితుల పక్షానే తాను ఉన్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు విమర్శించారు. ముఖ్యమంత్రి, పచ్చి అబద్దాలను చెబుతుంటే దళితులు ఎలా ఊరుకుంటారు… ఊరుకుంటారని ఆయన ఎలా అనుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా తన నివాసంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలని ఆక్రోషించే జన సమ్మోహనుడు, జగన్మోహనుడి పాలనలో దళితులపై యధేచ్చగా ధమనకాండ కొనసాగుతోంది. గతంలో డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్న లను ఈ ప్రభుత్వమే హత్య చేసింది. ఇప్పుడు దళిత ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవిపై దాడి చేస్తోంది. రాష్ట్రంలో దళితులపై జరిగిన అమానుష దాడుల గురించి ఈనాడు తెలుగు దినపత్రిక ప్రచురించిన కథనాన్ని చదివిన తర్వాత, ఆందోళన కలుగుతుంది. కాకినాడ సామర్లకోట కు చెందిన గిరీష్ బాబు అనే వ్యక్తికి కాళ్లలో రాడ్లు వేయగా, ఆయన్ని అరెస్ట్ చేసిన ఎస్సై అభిమన్యు కాళ్లలో రాడ్లు ఉన్నచోటే కొట్టడం వల్ల నొప్పి భరించలేక గత ఏడాది జనవరి 22వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ అమానుష ఘటనపై తమ్ముడు మహాసేన రాజేష్ గట్టిగా పోరాటం చేశాడు. అత్యాచారం కేసులో దోషులను, దేశద్రోహులను కూడా ఈ విధంగా శిక్షించాలని చట్టంలో ఎక్కడా కూడా లేదు. అయినా ఎస్సై అభిమన్యు పాశవికంగా వ్యవహరించి రాజేష్ ప్రాణాలను బలిగొన్నారు. డాక్టర్ సుధాకర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నడిరోడ్డు పై ఎర్రటి ఎండలో చొక్కా విప్పించి కాళ్లు చేతులు కట్టేసి పడుకోబెట్టారు. పోలీసుల హింసలు తాళలేకనే డాక్టర్ సుధాకర్ మృతి చెందారు. డాక్టర్ అచ్చన్నను ఈ ప్రభుత్వమే హత్య చేయించింది. అగ్రవర్ణానికి చెందిన ఎమ్మెల్సీ, తన వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యమును హత్య చేసి శవాన్ని డోరు డెలివరీ చేశాడు. తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న శిరోమండనం కేసులో ఏ ఒక్కరికి శిక్ష పడలేదు. దళిత సామాజిక వర్గానికి చెందిన కిషోర్ అనే వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకపోతే, ఆయన్ని కొట్టి చంపి వేశారు. ఇవన్నీ చూస్తుంటే భయం వేస్తోంది. కొట్టిన వాళ్ళు రెడ్లు అయితే, ఆత్మహత్య చేసుకున్నది దళిత యువకుడు. కావలి ఎమ్మెల్యే వేధింపులు తాళలేక శ్రీ హర్ష అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేయగా, స్థానికులు సకాలంలో స్పందించి అతని ప్రాణాలు కాపాడారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇలా రాష్ట్రంలో దళితులపై జరిగిన హత్యాచార, హత్య ఘటనలను ఈనాడు దినపత్రిక తన కథనంలో ప్రచురించిందని వివరించారు.

దళిత ఎమ్మెల్యేను వేధిస్తున్న వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలి
దళిత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్న వారిపై సైబర్ చట్టం ప్రకారమే కాకుండా, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్టులు చేయాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. శ్రీదేవి తన ఇద్దరు కూతుర్లతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, అసభ్యంగా, అసహ్యంగా, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా కామెంట్లు పెడుతున్నారు. ఇలా కామెంట్లు పెడుతున్న వారికి స్త్రీ జాతి అంటే గౌరవం లేదా?. ఏమీ లేని దానికే సుమోటోగా కేసులు నమోదు చేసే ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఇప్పుడు ఏం చేస్తున్నట్లు?. ఆ పార్టీకి చెందిన వారిపై ఏమి మాట్లాడినా పైన పడిపోయే సిఐడి పోలీసులు, ఒక దళిత శాసన సభ్యురాలిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతుంటే ఎందుకని చర్యలు తీసుకోవడం లేదు. సోషల్ మీడియాలో ఈ రకమైన కామెంట్లు ఎవరు పెడుతున్నారో, వారి పూర్తి వివరాలు తెలిసినప్పటికీ, మౌనం దాల్చడం దారుణం. ఈ తరహా కామెంట్లు చేస్తున్న ముష్కరులను తక్షణమే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉండవల్లి శ్రీదేవి, రఘురామకృష్ణం రాజుకు ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి కి మరొక న్యాయమా?,. పేరు చివరన తోక ఉంటే, వారు ఎవరిపైన ఎటువంటి కామెంట్స్ అయినా పెట్టవచ్చా?. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి ఏదో మాట్లాడితే, తన తల్లికి అవమానం జరిగిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాధపడిపోయి, టిడిపి కార్యాలయం పై దాడికి తమ పార్టీ నాయకులను శ్రేణులను ఉసిగొలిపారు. కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే మనసు ఉంటుందా?, ఉండవల్లి శ్రీదేవి, ఆమె కుమార్తెలకు మనసు ఉండదా?. శ్రీదేవి ఇంటిపై దాడి చేయిస్తారా??. అంతటితో ఆగకుండా ఆమె ఇంట్లో లేని సమయంలో, వాహనం తన పేరిట ఉందని ఎవరో చెప్పగానే, పోలీసులే అతనికి వాహనాన్ని ఇచ్చి పంపిస్తారా?. ఆ వాహనం అతనిదేనా అని కనీసం విచారణ కూడా చేయరా?. ఒకరు వచ్చి ఫ్రిడ్జ్ నాది అని, మరొకరు బెడ్ నాది అని అనడం హాస్యాస్పదంగా ఉంది. ఆమె ఏమైనా పేద వనితనా?. మీరు ఊరికే సీటు ఇచ్చారా?. మీరు సీటు ఎలా ఇస్తారో అందరికీ తెలిసిందే. మా తాత దళిత క్రిస్టియన్లకు ఆడబిడ్డలనిచ్చారని చెప్పడం, దళితులంతా మా బంధువులే అనడం అంతా ఉత్తిదేనా?. ఒకవేళ దళిత క్రిస్టియన్లు అయితే ఏమైనా ఉపశమనం ఉంటుందేమో?. శ్రీదేవి దళిత హిందూ కావడం వల్లే ఆమెను ఈ రకంగా వేధిస్తున్నారేమో?. నెల్లూరుకు చెందిన రెడ్డి సామాజిక వర్గ నాయకుల ఫోటోలను సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్ట్ చేసి ట్రోల్ చేసి రోడ్ల మీద తిరగగలరా?., మీరు ఈ విధంగా వారి ఫోటోలను పోస్ట్ చేసి, ట్రోల్ చేయనిస్తారా? అంటూ జగన్మోహన్ రెడ్డి ని రఘురామకృష్ణం రాజు సూటిగా ప్రశ్నించారు.

దళితులకు మేలు చేసే 27 నుంచి 29 సంక్షేమ పథకాలను ఎత్తి వేసిన జగన్మోహన్ రెడ్డి
దళిత ప్రజలకు మేలు చేసే 27 నుంచి 29 సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎత్తివేశారు. ఈ విషయంపై ఇప్పటికే దళిత సంఘాల నేతలు, మేధావులు ఎన్నోసార్లు వివరాలను వెల్లడించారు. మన పార్టీ దళిత నేతలకు ఆశ చూపెట్టి, వారి గొంతు నొక్కే స్తున్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పిస్తామని ఈ పోటుగాళ్లు అసెంబ్లీలో తీర్మానం చేశారట. మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు తీర్మానం చేసినప్పటికీ, న్యాయ స్థానంలో కేసు పెండింగులో ఉంది. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించగలిగితే, కల్పించండి. ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి ఎప్పుడైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకువెళ్లారా?., రాజ్యాంగానికి అనుగుణంగానే న్యాయస్థానం నడుచుకుంటుంది. రాజ్యాంగ సవరణ చేయకుండానే, దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఎలా సాధ్యపడుతుంది. రాజ్యాంగ సవరణ చేయమని, ప్రధానమంత్రిని కోరండి. పార్లమెంట్లో ఈ విషయాన్ని పార్టీ పక్షాన ఎప్పుడైనా ప్రస్తావించారా?,. వచ్చేనెల ఆరవ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్లో ఇదే విషయమై ప్ల కార్డుల ప్రదర్శన చేద్దాం. రండి చిత్తశుద్ధి ఉంటే… అంతేకానీ తీర్మానం చేశామని, దళిత క్రిస్టియన్లను మోసగించే ప్రయత్నం చేయకండి. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసే వరకు, ప్రస్తుతమున్న చట్టాలను గౌరవించవలసిందే. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పిస్తున్నామన్న హామీ కేవలం మతమార్పిడులకు సాధనంగా ఉపయోగపడుతుంది తప్పితే, ఈ తీర్మానం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు.

ఇప్పటికే రాష్ట్రంలో 90 శాతం దళితులు, క్రిస్టియన్ మతంలోకి మారిపోయారు. పేపర్లపై కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నప్పటికీ, నూటికి 90 శాతం క్రిస్టియన్ మతాన్ని స్వీకరించారు. బలవంతపు మతమార్పిడుల కోసం దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పిస్తామని అబద్ధపు హామీలను ఇస్తున్నారా?, ఇంత మోసం చేయాల్సిన అవసరం ఏముంది?. ప్రజలకు అబద్ధాలు చెప్పి, బలవంతపు మతమార్పిడులను ప్రోత్సహించడం రాజ్యాంగ విరుద్ధం. ఎవరైనా తమకు ఇష్టం ఉండి ఏ మతాన్ని స్వీకరించిన అభ్యంతరం లేదు. బలవంతపు మతమార్పిళ్ళు చేయడం దేశద్రోహం కిందే లెక్క అని రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉద్యోగులు, ఉపాధ్యాయులలో విప్లవం మొదలయ్యింది . భవన కార్మికుల్లోనూ ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. మద్యనిషేధం అమలు చేస్తానని మోసం చేయడం వల్ల మహిళల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. చెత్త మద్యం, శరత్ చంద్రారెడ్డి బ్రాండ్లను చూసి మహిళలు త్వరలోనే తిరుగబడతారు. యావత్ దళిత జాతి జాగృతమౌతోంది. ఈనాడు దినపత్రిక నిజాలను నిర్భయంగా వెలికితీస్తుందని, ఎవరు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ సుమోటోగా ఈ ప్రభుత్వం, ఆ సంస్థ పై కేసు నమోదు చేసింది. హైదరాబాద్ హైకోర్టు, ఈ కేసు పై స్టే ఇచ్చింది. అయినా, నోటీసులను జారీ చేశారు. ఎవరు ఫిర్యాదు చేయకపోయినప్పటికీ, కేసు నమోదు చేసి విచారించడానికి ప్రభుత్వానికి పని పాట లేదా? అని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

రంగనాథ స్వామి మార్కెట్ యార్డ్ పేరును పునరుద్ధరించండి
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు, తన తండ్రి డాక్టర్ చదివారు కాబట్టి ఆయన పేరుని హెల్త్ యూనివర్సిటీ కి నామకరణం చేసినట్లు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు కడపలోని రంగనాథ స్వామి మార్కెట్ యార్డ్ పేరు ను కూడా మార్చడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు. ఎవరో శ్రీమహావిష్ణువు భక్తుడు మార్కెట్ యార్డ్ కోసం స్థలాన్ని విరాళంగా ఇచ్చి ఉంటారు. అందుకే మార్కెట్ యార్డ్ కు శ్రీ రంగనాథ స్వామి మార్కెట్ యార్డ్ గా నామకరణం చేశారు. భగవంతుడి పేరును కూడా మార్చి, ఇప్పుడు వైయస్సార్ మార్కెట్ యార్డ్ గా నామకరణం చేయడం దారుణం. భగవంతుడి జోలికి వస్తే పురుగులు పడిపోతారు బాబు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ కూడా తన తండ్రి పేరు కానీ తన పేరు కానీ దేనికి పెట్టిన దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి చూసి, వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ కూడా క్షోభి స్తుంది. రంగనాథ స్వామి పేరు మార్పుపై హిందూ సంఘాలు, జేఏసీగా ఏర్పడి శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాయి. భగవంతుడి పేరును మార్చి, ఒక వ్యక్తి పేరు పెట్టడం అనేది ఈ దేశంలోని డెబ్బై శాతం ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే. ఈరోజు మార్కెట్ యార్డ్ కు ఉన్న రంగనాథ స్వామి పేరును మార్చిన జగన్మోహన్ రెడ్డి, రేపు తిరుమల తిరుపతి దేవస్థానం పేరును డాక్టర్ వైయస్సార్ తిరుమల తిరుపతి దేవస్థానంగా మార్చిన ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. ఇది చేసిన వ్యక్తికి అది చేయడం పెద్ద విషయం ఏమి కాదు. ముఖ్యమంత్రికి తెలిసి మార్కెట్ యార్డ్ పేరు మార్చారా?, తెలియకుండానే మార్చారా?, ఒకవేళ తెలియకుండా మార్చితే ఆ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. దీనివల్ల కొంత నష్ట నివారణ జరుగుతుంది. ఇటువంటి చిన్న చిన్న సంఘటనలే, రాజకీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు అన్నారు.

ఎన్నికలు జరిగితే అవలీలగా గెలుస్తాను
పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కి జరిగే ఎన్నికల్లో తాను కూడా నామినేషన్ దాఖలు చేశాను. మా పార్టీ నుంచి ఇద్దరు పేర్లను ప్రతిపాదించారు. ఎన్నిక అంటూ జరిగితే తాను అవలీలగా విజయం సాధిస్తాను. వివిధ రాజకీయ పక్షాలతో పాటు, బిజెపిలోను ఎంతోమంది ఎంపీలతో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. పిఎసి, పియుసి కమిటీలకు గత రెండేళ్లుగా నామినేషన్లు దాఖలు చేస్తూ వస్తున్నాను. అయితే చివరి నిమిషంలో పీ ఏ సీ కమిటీ కోసం దాఖలు చేసిన తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం లేఖ రాసింది. ఒకవైపు తనని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ, కాళ్ల చెప్పులరిగే లా తిరిగి, సూట్ కేసులతో యుద్ధం చేసి… ఇప్పుడు వారే తనని మా పార్టీ సభ్యుడు అని పేర్కొనడం సిగ్గుచేటు. పార్టీలో ఉంచుకుంటే ఉంచుకో, పీక్కుంటే పీక్కో.. దమ్ముంటే పీక్కో అని సోషల్ మీడియాలో అంటున్నారు. కానీ నేను ఆ మాట అనను. సింహాన్ని అని చెప్పుకునే మీకు , ఈ తరహా చిల్లర రాజకీయాలు తగదని పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు .

రాష్ట్ర విభజన విభజన చట్టం ప్రకారమే రాజధానిగా అమరావతి
రాష్ట్ర విభజన చట్టం ప్రకారమే రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయడం జరిగిందని, మూడు రాజధానుల ఏర్పాటు విషయం తమకు తెలియదని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. కోర్టులో విచారణ ఎంత ఆలస్యం అయినా విజయం మాత్రం దగా పడ్డ అమరావతి రైతులదే. దగాక కోర్లది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత త్వరగా రాజధాని కేసు విచారణ జరగాలని కోరుకుంటున్నప్పటికీ, అంత ఆలస్యం అవుతుంది. మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణకు రావలసిన రాజధాని కేసును విచారణకు చేపట్టలేదు. ఈరోజు విచారణ చేపట్టకపోతే, ఈ వారం మొత్తం విచారణ చేపట్టే అవకాశం లేదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

LEAVE A RESPONSE