Suryaa.co.in

Andhra Pradesh

వికసిత్‌ భారత్‌ ఆకాంక్షకు జమిలి ఎన్నికల బిల్లు నిదర్శనం

  • జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ హర్షం
  • నిరంతర అభివృద్ధిని ఆకాంక్షించే భారత్‌ చేసిన ప్రకటన ఇది
  • పెద్ద సంస్కరణల గురించి ఆలోచించే ప్రధాని ధైర్యానికి చిహ్నం
  • ఏడాది పొడవునా ఎన్నికలతో భారీ వ్యయం, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం
  • ఒక దేశం-ఒకే ఎన్నికలు
  • ఎక్స్ లో మంత్రి సత్యకుమార్ యాదవ్ ట్వీట్

అమరావతి, డిసెంబర్‌ 12: జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదించడం నిరంతర అభివృద్ధిని ఆకాంక్షించే భారత్‌ తరపున వచ్చిన ప్రధాన ప్రకటనగా వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ అభివర్ణించారు. ఇదొక చారిత్రక బిల్లు అని, చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. జమిలి ఎన్నికల కోసం మరో ముందడుగు వేస్తూ, ‘ఒక దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లును కేంద్ర కేబినెట్‌ ఆమోదించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. మన దేశం విదేశీ పరిపాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన వందేళ్ల సందర్భాన్ని ఘనంగా జరుపుకునేందుకు నిర్ణయించిన తరుణంలో వచ్చిన ఇలాంటి ప్రకటన భారత అభివృద్ధి ఆకాంక్షను ఘనంగా చాటుతుందన్నారు. బిల్లు రూపకల్పనకు స్ఫూర్తిగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీని సత్యకుమార్‌ యాదవ్‌ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ చారిత్రాత్మక బిల్లు అభివృద్ధికి నిలువెత్తు రూపంగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు గుర్తు అని వివరించారు.

భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే భారీ సంస్కరణల గురించి ఆలోచించే ప్రధాని మోదీ ధైర్యం ఈ బిల్లులో స్పష్టంగా కనబడుతోందని సత్యకుమార్‌ మెచ్చుకున్నారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలకు దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుండడం వల్ల భారీ వ్యయం కావడంతో పాటు, అభివృద్ధి ప్రయత్నాలపైనా ప్రతికూల ప్రభావం పడుతోందని వివరించారు. ‘ఒక దేశం-ఒకే ఎన్నికల’ సంకల్పం మన దేశాన్ని వికసిత్‌ భారత్‌గా మార్చడానికి 145 కోట్ల మంది భారతీయులను ఐక్యంగా ఉంచుతుందని మంత్రి చెప్పారు. ఎన్నికల ప్రక్రియను క్రమబద్ధీకరించడం వల్ల దేశ నిర్మాణం కోసం ప్రజల ఉత్పాదక శక్తి పెరుగుతుందని వెల్లడిస్తూ మంత్రి ‘X’ వేదికగా ట్వీట్‌ చేశారు. జై హో మోదీ- జై హో ఇండియా అని ట్వీట్‌లో నినదించిన సత్యకుమార్‌ యాదవ్‌, మోదీ అంటే ‘మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా’ అని వివరించారు.

గురువారం, ఒక దేశం-ఒకే ఎన్నికలు’ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లు ఆమోదం పొందుతుందని భావిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE