Suryaa.co.in

Entertainment Telangana

జానీ మాస్టర్ ను దూరం పెట్టిన జనసేన

– జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణలు

అమరావతి: నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై హైదరాబాద్లో కేసు నమోదైంది.తనను అత్యాచారం చేశాడంటూ, పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ అతడి వద్ద పని చేసే ఓ డ్యాన్సర్ ఫిర్యాదు చేసింది.ఈ ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ నేపథ్యంలో జనసేన పార్టీ చర్యలకు ఉపక్రమించింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది.

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్స్టేషన్‌లో కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అత్యాచారం చేశాడంటూ ఓ లేడీ డ్యాన్సర్‌ రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు. ఈ ఘటనపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగి పీఎస్‌లో 372(2) (N), 506, 323 ఐపీసీ సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2017 లో సొంత ఊరి నుంచి హైదరబాద్కు వచ్చానని, ఓ రియాలిటి షోలో కంటెస్టెంట్గా సెలక్ట్ అయ్యానని బాధితురాలు తెలిపింది. అదే సమయంలో జానీ మాస్టర్ పరిచయం అయ్యారని వివరించింది. తన టీమ్లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉండాలని జానీ మాస్టర్ కోరాడని ఫిర్యాదులో తెలిపింది. ఓ ప్రాజెక్ట్ కోసం ముంబయి వెళ్లిన సమయంలో, టికెట్లు లేని సమయంలో తన తల్లి తనతో రాలేదని తెలిపింది.

మాస్టర్ నుంచి నాకు ప్రాణహాని ఉంది: హోటల్లో తనపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని, ఈ విషయం ఎవరికైనా చెప్తే ఇండస్ట్రీలోనే లేకుండా చేస్తానని బెదిరించాడని వాపోయింది. ఆ భయంతో పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడినా, ఎవ్వరికీ చెప్పలేదంది. షూటింగ్‌కు సంబంధించిన వాహనంలో కూడా తనను వేధించాడని పేర్కొంది. అందరి ముందు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఒప్పుకోలేదని తన తలను అద్దానికి వేసి కొట్టాడని ఫిర్యాదులో వివరించింది. అంతేకాకుండా రాత్రి వేళల్లో ఇంటికి వచ్చి స్కూటీని ధ్వంసం చేశాడని, తనను పెళ్లి చేసుకోవాలంటే మతం మార్చుకోమని చెప్పాడంది.

ఇంటి ముందు అనుమానాస్పద పార్సిల్‌: ఇవన్నీ చూసి తాను టీమ్ నుంచి బయటకు వచ్చి వ్యక్తిగతంగా పని చేసుకుంటుంటే భార్యతో కలిసి ఇంటికి వచ్చి తనపై దాడి చేశాడని తెలిపింది. గత నెల 28న అనుమానాస్పద పార్సిల్‌ తన ఇంటి ముందు ఉందని, దానిపై ఇదే తన చివరి షూటింగ్ అని రాసి ఉందని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేసింది. తనకు అవకాశాలు లేకుండా చేయడమే కాకుండా జానీ మాస్టర్ నుంచి ప్రాణ హానీ ఉందని ఫిర్యాదులో పేర్కొంది. కాగా ఈ కేసులో నార్సింగి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

జానీ మాస్టర్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో చర్యలకు జనసేన పార్టీ ఉపక్రమించింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జానీ మాస్టర్ను ఆదేశిస్తూ ప్రకటన విడుదల చేసింది.

LEAVE A RESPONSE