Suryaa.co.in

Telangana

మహిళా రిజర్వేషన్స్ కోసం తొమ్మిదేళ్లుగా కల్వకుంట్ల కవిత అలుపెరుగని పోరాటం చేస్తోంది

-బిజెపి నాయకులు బండి సంజయ్, డీకే అరుణ.. మహిళా రిజర్వేషన్ల కోసం కవిత చేస్తున్న పోరాట చరిత్రను తెలుసుకోవాలి
-కళ్ళు, చెవులు ఉంటే బీజేపీ నాయకులకు కవిత పోరాట వాస్తవాలు తెలుస్తాయి
-10 న ఢిల్లీలో కవిత దీక్షకు దేశ వ్యాప్తంగా మహిళలు సంపూర్ణ మద్దతు పలకాలి
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్

లోక్ సభ, రాజ్యసభ, అన్ని రాష్ట్రాల్లోని అసెంబ్లీ, కౌన్సిల్ వంటి చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అప్పటి ఎంపీగా, ప్రస్తుత ఎమ్మెల్సీగా, జాగృతి అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత అలుపెరగకుండా గత తొమ్మిదేళ్ళ కాలం నుంచి పోరాటం చేస్తున్నారని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీర్మానాన్ని ఆమోదించి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి స్వయంగా అందజేశారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

తమ పార్టీ ఎంపీలు, కవిత లోక్ సభ, రాజ్య సభలో మహిళా రిజర్వేషన్ల కోసం చేస్తున్న పోరాట చరిత్రను బిజెపి నాయకులు తెలుసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు.మహిళా రిజర్వేషన్స్ కోసం తమ పార్టీ ఎంపీలతో సహా కవిత, తాను కూడా అనేక సార్లు పార్లమెంట్ లో ప్రస్తావించామని వినోద్ కుమార్ తెలిపారు.

తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలుగా, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలుగా, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గత తొమ్మిదేళ్లుగా మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తోందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.ఈనెల 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో కవిత చేపట్టనున్న మహిళా రిజర్వేషన్ల దీక్షకు దేశంలోని మహిళలు సంపూర్ణ మద్దతు పలకాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

కానీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాత్రం కవితపై అనవసర విమర్శలు చేయడం విస్మయాన్ని కలిగిస్తోందని వినోద్ కుమార్ అన్నారు.బిజెపి నాయకులకు కళ్ళు, చెవులు ఉంటే మహిళా రిజర్వేషన్ల కోసం కవిత చేస్తున్న, చేసిన వాస్తవాలు తెలుస్తాయని వినోద్ కుమార్ అన్నారు. కవితపై అనవసరంగా విమర్శలు చేయడం మానుకోవాలని వినోద్ కుమార్ అన్నారు.

మహిళా రిజర్వేషన్లు అమలు అయితే దాదాపు 180 ఎంపీ స్థానాలు మహిళలకు దక్కుతాయని, అలాగే ఆయా రాష్ట్రాల్లోని అసెంబ్లీ, కౌన్సిల్ లలో కూడా రిజర్వేషన్లు లభిస్తాయని వినోద్ కుమార్ పేర్కొన్నారు.రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిందని, అయితే లోక్ సభలో మాత్రం ఈ బిల్లు ఆమోదం పొందలేదు అని, ప్రధాని నరేంద్ర మోడీ తలుచుకుంటే ఇది సాధ్యం అవుతుందని, కానీ బిజెపికి చిత్తశుద్ధి లేదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

మానకొండూరు మండలంలో సోమవారం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ భారీ సభలో తీర్మాణం చేయడం ద్వారా మహిళా రిజర్వేషన్ల కోసం కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాట పటిమకు దాదాపు 20 వేల మంది మహిళలు మద్దతును ప్రకటించారని వినోద్ కుమార్ తెలిపారు

LEAVE A RESPONSE