Suryaa.co.in

Telangana

మైనారిటీల సంక్షేమమే కేసీఆర్‌ లక్ష్యం

– మంత్రి హరీష్‌రావు

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ మేరకు మైనార్టీల వివిధ సమస్యలపై చర్చించేందుకు సచివాలయంలో సమావేశం అయిన మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మైనారిటీ సెక్రెటరీ ఉమర్ జలీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మైనారిటీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్ సీస్ స్కాలర్ షిప్స్, స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్ స్మశాన వాటికలు, RTF, MTF తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇతర వర్గాలతో సమానంగా మైనారిటీ వర్గాల సంక్షేమంతోపాటు అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు.స్మశాన వాటికలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు-మౌజిన్‌ల సంఖ్య పెంపు వంటి రెండు హామీలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు.

మైనార్టీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల మంది లబ్ధిదారులకు ఈనెల 16 నుండి లక్ష రూపాయల చెక్కుల పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ఇప్పటికే కేటాయించిన 270 కోట్లకు అదనంగా, మరో 130 కోట్లు కేటాయించి మొత్తం 400 కోట్లు ఈ కార్యక్రమం అమలుకు కేటాయించాలని ఆర్థిక శాఖను మంత్రి ఆదేశించారు.

ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం ఆర్థిక సహాయం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగాలని చెప్పారు.మైనారిటీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై మరింత దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.రాష్ట్రంలో శ్మశాన వాటికలు, ఈద్‌గాల భూముల కోసం వచ్చిన మొత్తం వినతులను క్రోడీకరించాలని, ఈ దిశగా పనులు వేగవంతం చేయాలని అధికారులను కోరారు.

ఒవైసీ పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ పనులు, దర్గా బర్హనా షా అద్దెల సవరణ, క్రిస్టియన్ స్మశాన వాటికలు, RTF, MTF, గ్రాంట్ ఇన్ ఎయిడ్ మరియు ఇతర పనులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసి పనులు త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని అధికారులను కోరారు. షాదీ ముబారక్‌కు సంబంధించి, ప్రక్రియను వేగవంతం చేసి, లబ్ధిదారులకు వెంటనే ఉపశమన సొమ్ము అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

LEAVE A RESPONSE