– మండలిలో మనకే బలం
– సమస్యలపై గళం విప్పండి
– ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్
తాడేపల్లి: శాసనమండలిలో పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వినియోగించుకోవాలని వైసీపీ అధినేత జగన్ పార్టీ ఎమ్మెల్సీలకు పిలుపునిచ్చారు. మండలిని వేదికగా చేసుకొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జగన్ అధ్యక్షతన లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్సీలకు జగన్ మార్గనిర్దేశం చేశారు.
ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ, జనసేన, టీడీపీ అధికార పక్షంలో ఉండగా, ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని జగన్ పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయాలని చాలామంది సలహాలిచ్చినా, కొందరు టీడీపీ సభ్యులను పార్టీలోకి లాక్కోవాలని చెప్పినా తాము అలా చేయలేదని జగన్ స్పష్టం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం వంటి కీలక రంగాలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కూడా దారుణంగా ఉందని అభిప్రాయపడ్డారు. శాసనమండలిలో వైసీపీకి బలం ఉందని, ఆ బలాన్ని ఉపయోగించుకొని ప్రజా సమస్యలపై గట్టిగా గళం విప్పాలని ఎమ్మెల్సీలకు ఆయన దిశానిర్దేశం చేశారు.