Suryaa.co.in

Andhra Pradesh

చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తి పెంచుదాం

• 2047 విజన్ డాక్యుమెంటుకు అనుగుణంగా పని చేద్దాం
• ప్రతిభ ఉన్న వారిని తగిన విధంగా ముందుకు తీసుకువెళ్దాం
• ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులతో సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించే దిశగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ అధికారులు పని చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు.తనకు కేటాయించిన శాఖలపై వరుస సమీక్షల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గురువారం సాయంత్రం రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా భవిష్యత్ ఇన్నోవేషన్ కు అనుగుణంగా పిల్లలను తగిన నైపుణ్యవంతులుగా తీర్చే దిద్దే ప్రయత్నం వేగంగా సాగాలని స్పష్టం చేశారు. పిల్లలకు శాస్త్ర సాంకేతిక అంశాలపై ఆసక్తి కల్పించడంపై ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాల్లో చాలా ప్రతిభ ఉంటుందని దానిని వెలికితీసేలా భారీ వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడానికి సన్నద్దం కావాలని సూచించారు. పిల్లలను పూర్తి స్థాయిలో నైపుణ్యవంతులుగా తయారు చేయడమే కాకుండా వారు శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరం అయిన ప్రోత్సాహం అన్ని విధాలుగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వైజ్ఞానిక ప్రదర్శనలు పూర్తి స్థాయిలో జరగాలని దీనివలన రాబోయే తరాల్లో సైన్స్ పట్ల మక్కువ పెరుగుతుందని చెప్పారు. శాఖపరమైన అంశాలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎస్ఆర్ఎస్సీ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని అధికారులు తెలిపారు. కేంద్రాన్ని త్వరలోనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువద్దామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.

LEAVE A RESPONSE