– రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
– 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పాదచారుల వంతెన పనులకు శంకుస్థాపన
నల్గొండ: పట్టణాన్ని ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పట్టణంలో రద్దీగా ఉండే రోడ్లపై పాదాచారుల వంతెన ఏర్పాటు చేయడం అందరికీ ఎంతో మేలు చేస్తుందని అన్నారు.
శుక్రవారం మంత్రి నల్గొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న సెయింట్ ఆల్ఫోన్సస్ పాఠశాల వద్ద 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న పాదచారుల వంతెన పనులకు శంకుస్థాపన చేశారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెంట్ ఆల్ఫాన్సెస్ పాఠశాల వద్ద ప్రతిరోజు విద్యార్థులతో రద్దీగా ఉంటుందని, ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకుగాను పాదచారుల వంతెనను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
పట్టణంలో రహదారులతో పాటు ,మురికి కాలువలు, సిసి రోడ్లు వంటివి నిర్మిస్తున్నామని, పట్టణాన్ని ఉత్తమ పట్టణంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాదాచారుల వంతెన వల్ల ట్రాఫిక్ ఇబ్బందు లేకుండా ఉండడమే కాకుండా, ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మంత్రి రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో రహదారుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.