– ఒక్క రోజులోనే 5 రంగాల్లో 35 ఎంఓయూలు
– రూ. 3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షల మందికి ఉద్యోగాలు
– ఇంధన శాఖలోనే రూ. 2.65 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన సంస్థలు
– ఏపీని విడిచి వెళ్లిన కంపెనీలను తిరిగి తెచ్చిన కూటమి ప్రభుత్వం
– పారిశ్రామిక రంగానికి ఏపీ ఇస్తున్న సహకారానికి కంపెనీల నుంచి కితాబులు
– ప్రభుత్వం చేపట్టే అన్నక్యాంటీన్లకు విరాళాలు
– వేగమే వేదంగా పెట్టుబడుల సాధనకు కృషి: ముఖ్యమంత్రి
– రోజంతా 15కు పైగా సమావేశాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
విశాఖపట్నం : పెట్టుబడులు ఆకర్షించడంలో రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో నిలపడమే ధ్యేయంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు వేగమే వేదంగా పెట్టుబడుల సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు. విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సుకు ముందు రోజు గురువారం జరిగిన వివిధ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సుమారు 15కు పైగా సమావేశాల్లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన వారితో వరుస భేటీలు నిర్వహించారు. అలాగే తైవాన్, ఇటలీ వంటి దేశాల రాయబారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. ఏయే ప్రాంతంలో ఏయే రంగానికి తాము ప్రాధాన్యత ఇస్తున్నామని వివరించడంతోపాటు… ఆయా ప్రాంతాల్లో ఉన్న పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం ఏ విధంగా ఉంది… అక్కడ కనెక్టివిటీ ఏ విధంగా అభివృద్ధి చేశాం అనే విషయాలను వివిధ పారిశ్రామిక వేత్తలకు ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే తైవాన్, ఇటలీ దేశాలకు చెందిన పరిశ్రమలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా చూడాలని ఆ దేశాల రాయబారులను ముఖ్యమంత్రి కోరారు.
ఇక వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థలు ముందుకు రావడంతో పాటు… ప్రతిపాదనలతో వచ్చిన కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈ మేరకు రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా వివిధ కంపెనీలు ముందుకు వచ్చాయి. మొత్తంగా 35 ఎంఓయూలను ఒక్క రోజులోనే ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. ఈ ఎంఓయూలు ద్వారా భారీ పెట్టుబడులు రానున్నాయి. భాగస్వామ్య సదస్సు ప్రారంభానికి ముందు రోజే ఏకంగా రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు, 1.26 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేందుకు కంపెనీలు ముందుకు వచ్చాయి. ఇలా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన కంపెనీల్లో రెన్యూ పవర్ వంటి ప్రముఖ సంస్థలు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయి.
అప్పటి విధానాలు నచ్చక రాష్ట్రం విడిచి వెళ్లిన సంస్థలను తిరిగి ఏపీకి రప్పించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. రెండు రోజుల పాటు జరిగే భాగస్వామ్య సదస్సులో సుమారుగా రూ.10 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయనే అంచనాలు ఉన్నాయి. అయితే ఆ సదస్సు కంటే ముందే రూ.3.65 లక్షల కోట్ల పెట్టుబడులు రావడంతో ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లకు రూ.1 కోటి విరాళం చెక్కును బాలాజీ యాక్షన్ బిల్డ్ వేర్ సంస్థ ముఖ్యమంత్రికి అందించింది.
వనరులున్నాయి… కనెక్టివిటీ ఉంది
భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుస సమావేశాలు నిర్వహించారు. అలాగే ఎంఓయూలు కుదుర్చుకునేందుకు నిర్వహించిన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”సీఐఐ సదస్సుకు ముందుగానే ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం చాలా సంతోషకరం. పెట్టుబడులకు ముందుకు వచ్చిన పారిశ్రామిక వేత్తలకు ధన్యవాదాలు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీలో పరిశ్రమలు స్థాపించడానికి వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి.
గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్ వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. దేశం చాలా వేగంగా అభివృద్ది చెందుతోంది. ఆ వేగంలో మనం ముందుడాలి. పెట్టుబడులు సాధించాలి. రాష్ట్రాన్ని పెట్టుబడుల్లో ముందుంచాలి అనేది ప్రభుత్వ ప్రయత్నం. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రంలో అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం రూపొందించిన ఎనర్జీ పాలసీ మంచి ఫలితాలను ఇస్తోంది. అందుకే ఇంధన రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. ఏపీకి 1000 కి.మీ మేర సముద్ర తీరం ఉంది.
పోర్టులు, రోడ్లు, రైలు మార్గం వంటి వాటి ద్వారా లాజిస్టిక్స్ రంగానికి ఏపీ కేంద్ర బిందువుగా మారుతుంది. రాష్ట్రంలో అన్ని రంగాల్లో పెట్టుబడులకు అవకాశం ఉంది… దీన్ని వినియోగించుకోవాలని పారిశ్రామిక వేత్తలను కోరుతున్నా. హార్టికల్చర్, అగ్రికల్చర్, ఆక్వా కల్చర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అవకాశాలు ఉన్నాయి. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ వంటి వాటిని ఏర్పాటు చేసుకుంటున్నాం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మినరల్ వెల్త్ ఉంది. వీటి విలువను మరింత పెంచగలిగే పరిశ్రమలు తెస్తున్నాం. ఒక కుటుంబం ఒక వ్యాపార వేత్త అనే నినాదంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఆలోచనలతో వచ్చే వారికి అవకాశాలు కల్పిస్తాం. ఒప్పందం చేసుకున్న ప్రతి సంస్థకు భూములు కేటాయిస్తున్నాం. పారిశ్రామిక వేత్తలు వేగంగా పనులు గ్రౌండ్ చేయడానికి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో వెళ్తున్నాం. మా ప్రభుత్వం నుంచి అనుమతులు సహా ఏ విషయంలోనూ జాప్యం ఉండదు”అని ముఖ్యమంత్రి వెల్లడించారు.
పెట్టుబడుల వెల్లువ… ఉద్యోగాల కల్పన
శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు పెట్టుబడుల సదస్సు ప్రారంభం అవుతుంటే… దాని కంటే ముందు రోజే వివిధ పరిశ్రమలు భారీ ఎత్తున పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. రూ.3.65 లక్షల కోట్ల మేర పెట్టుబడులపై ఎంఓయూలు కుదిరాయి. మొత్తంగా 5 రంగాల్లో ఈ పెట్టుబడులు రాగా… ఒక్క ఇంధన రంగం నుంచే రూ.2,64,787 లక్షల కోట్ల పెట్టుబుడులు వచ్చాయి. ఇంధన శాఖ 7 ఎంఓయూలు కుదుర్చుకుని ఈ పెట్టుబడులను రాబట్టింది.
ఇంధన రంగంలో వచ్చిన పెట్టుబడుల ద్వారా 49,400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఇక మిగిలిన నాలుగు రంగాల్లో పెట్టుబడులు వచ్చిన విధానం పరిశీలిస్తే… 8 ఒప్పందాల ద్వారా ఏపీ సీఆర్డీఏకు రూ.32,300 కోట్లు, 7800 మందికి ఉద్యోగాలు రానున్నాయి. 4 ఎంఓయూల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రూ.2319 కోట్ల పెట్టుబడి, 8166 మందికి ఉద్యోగాలకు అవకాశం ఉంది. 3 ఒప్పందాల కుదుర్చుకుని ఐ అండ్ ఐ రంగంలో రూ.12,255 కోట్ల పెట్టుబడులు, 1300 మందికి ఉద్యోగాలు కల్పించేందుకు వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి. మరోవైపు 3 ఎంఓయూల ద్వారా రూ.52,143 కోట్ల పెట్టుబడుల ద్వారా 32,105 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలా పరిశ్రమలు-వాణిజ్యం రంగం ఆయా సంస్థల నుంచి హామీ పొందింది.
కంపెనీల వివరాలివి…
రాష్ట్ర ప్రభుత్వంతో ఏయే కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.. ఎంత మేర పెట్టుబడులు పెట్టనున్నాయి… ఏ మేరకు ఉద్యోగావకాశాలు కల్పిస్తాయనే వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
ఇంధన రంగం…
• ABC క్లీన్టెక్ & ఆక్సిస్ ఎనర్జీ వెంచర్స్ – రూ. 1,10,250 కోట్లు, 13500 మందికి ఉద్యోగాలు • రీన్యూ పవర్-రూ. 25000 కోట్లు, 10000 మందికి ఉద్యోగాలు
• రీన్యూ ఇ-ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్-రూ. 17000 కోట్లు, 1100 మందికి ఉద్యోగాలు.
• రీన్యూ ప్రైవేట్ లిమిటెడ్-రూ 12500 కోట్లు, 3250 మందికి ఉద్యోగాలు
• నవయుగ ఇంజనీరింగ్-రూ. 23427 కోట్లు, 6300 మందికి ఉద్యోగాలు
• చింతా గ్రీన్ ఎనర్జీ-రూ. 27955 కోట్లు, 6600 మందికి ఉద్యోగాలు
• ఫోర్ స్క్వేర్ గ్రీన్ ఎనర్జీ-రూ. 10205 కోట్లు, 1750 మందికి ఉద్యోగాలు
• ఇండోసోల్-రూ. 23450 కోట్లు, 6900 మందికి ఉద్యోగాలు
• షిర్డీ సాయి-రూ.15000 కోట్లు, 15400 మందికి ఉద్యోగాలు
పరిశ్రమలు-వాణిజ్య రంగం…
• రెన్యూ ఫొటో వాల్ టైక్స్-రూ. 5451 కోట్లు, 3600 మందికి ఉద్యోగాలు
• ఇండోసోల్-రూ. 2200 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు
• షిర్డీ సాయి-రూ. 5000 కోట్లు, 5000 మందికి ఉద్యోగాలు
• వైజాగ్ ప్రొఫైల్స్ లాజిస్టిక్స్-రూ. 6000 కోట్లు, 5250 మందికి ఉద్యోగాలు
• స్టీల్ ఎక్సైఛేంజ్ ఇండియా-రూ. 4650 కోట్లు, 5400 మందికి ఉద్యోగాలు
• విరూపాక్ష ఆర్గానిక్స్-రూ. 1189 కోట్లు, 2000 మందికి ఉద్యోగాలు
• అనంత్ టెక్నాలజీస్-రూ. 1000 కోట్లు, 1000 మందికి ఉద్యోగాలు
• ఏటీఆర్ వేర్ హౌసింగ్-రూ. 1100 కోట్లు, 6200 మందికి ఉద్యోగాలు
• లారస్ ల్యాబ్స్-రూ. 1000 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు
• మారుతి ఇస్పాత్ అండ్ పైప్స్-రూ. 1000 కోట్లు, 1800 మందికి ఉద్యోగాలు
• ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్-రూ. 1000 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు
• మల్లాది ఫార్మా-రూ. 353 కోట్లు, 355 మందికి ఉద్యోగాలు
• ఈజౌల్-రూ. 19000 కోట్లు, 1800 మందికి ఉద్యోగాలు
• కోరమండల్-రూ. 2000 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు
• తైవాన్ ప్రైవేట్ ఇండస్ట్రీయల్ పార్క్స్-రూ. 1200 కోట్లు, 10000 మందికి ఉద్యోగాలు
• జూల్-రూ. 1500 కోట్లు, 1000 మందికి ఉద్యోగాలు
ఏపీ సీఆర్డీఏ…
• మణిపాల్ గ్రూప్-రూ. 15000 కోట్లు, 1000 మందికి ఉద్యోగాలు
• బెర్జాయ గ్రూప్-రూ. 8300 కోట్లు
• అమరావతి లైఫ్ సైన్సెస్-రూ. 2000 కోట్లు
• మైసిటీ-రూ. 2000 కోట్లు
• వివెన్స్ గ్రూప్-రూ. 2000 కోట్లు, 5000 మందికి ఉద్యోగాలు
• ఫ్యాషన్ ఎంటర్ ప్రెన్యూయర్ ఫండ్-రూ. 1200 కోట్లు, 1200 మందికి ఉద్యోగాలు
• ఏస్ అర్బన్ డెవలర్స్-రూ. 1800 కోట్లు, 600 మందికి ఉద్యోగాలు
ఐ అండ్ ఐ…
• క్రౌన్ ఎల్ఎన్జీ-రూ. 10640 కోట్లు
• ఆర్సీఆర్టీ-రూ. 1615 కోట్లు, 1300 మందికి ఉద్యోగాలు
ఫుడ్ ప్రాసెసింగ్…
• ఉమెన్ ఓవా అగ్రో ఫుడ్ పార్క్-రూ. 1440 కోట్లు, 7000 మందికి ఉద్యోగాలు
• ఐటీసీ ఫుడ్స్-రూ. 400 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు
• గాడ్రేజ్ అగ్రో వెట్-రూ. 279 కోట్లు, 66 మందికి ఉద్యోగాలు
• బిస్లరీ-రూ. 200 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు











