– అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మేడారం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఈ మేరకు సీఎం మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 100 రోజుల్లో మేడారం అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను సీఎం పరిశీలించారు. పూర్తిగా సహజసిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు ఉండాలని సూచించారు.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ఏరియాలవారీగా చెక్ డ్యామ్ ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో మేడారానికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. బాసర జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన పలు సూచనలు చేశారు. అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్ ను గౌరవించడంతోపాటు, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.